హైదరాబాద్, జూన్ 24 (నమస్తే తెలంగాణ): ఇటీవల ఏర్పాటుచేయాలని నిర్ణయించిన 7 కొత్త మెడికల్ కాలేజీలకు 7,007 పోస్టులను రాష్ట్ర ప్రభుత్వం మంజూరుచేసింది. పోస్టులను భర్తీచేయడానికి మెడికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్కు అనుమతి ఇస్తూ ఆర్థికశాఖ ముఖ్యకార్యదర్శి కే రామకృష్ణారావు గురువారం ఉత్తర్వులు జారీచేశారు. ఈ మేరకు సంగారెడ్డి, మహబూబాబాద్, మంచిర్యాల, వనపర్తి, భద్రాద్రి కొత్తగూడెం, జగిత్యాల, నాగర్కర్నూల్ మెడికల్ కాలేజీలకు కావాల్సిన సిబ్బందిని నేషనల్ మెడికల్ కమిషన్ నిబంధనల ప్రకారం నియామకాలు చేపట్టాలని ప్రభుత్వం తెలిపింది. ఒక్కో కాలేజీకి 47 విభాగాలున్నాయి. ఈ కాలేజీలకు ఏడుగురు ప్రిన్సిపాళ్లు/డీన్లు, ఏడుగురు మెడికల్ సూపరింటెండెంట్లతోపాటు 294 మంది ప్రొఫెసర్లను నియమిస్తున్నారు. జనరల్ మెడిసిన్ లాంటి సబ్జెక్టుకు కాలేజీకి ఇద్దరు చొప్పున ప్రొఫెసర్లను నియమించాలని నిర్ణయింంచారు. కాలేజీ ప్రిన్సిపాల్, ఫ్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్, ట్యూటర్లతోపాటు టీచింగ్, నాన్ టీచింగ్ సిబ్బందిని నియమించడానికి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. గాంధీ దవాఖాన, జగిత్యాల ప్రభుత్వ నర్సింగ్ కాలేజీతోపాటు కొత్తగా ఏర్పాటుచేయాలని నిర్ణయించిన 13 నర్సింగ్ కాలేజీలకు రాష్ట్ర ప్రభుత్వం 720 పోస్టులు మంజూరుచేసింది. 15 కాలేజీలకు 15 ప్రిన్సిపాల్, 15 వైస్ ప్రిన్సిపాల్, 105 ప్రొఫెసర్, 180 అసిస్టెంట్ ప్రొఫెసర్, 300 లెక్చరర్, 15 అడ్మినిస్ట్రేటీవ్ ఆఫీసర్, 15 ఆఫీస్ సూపరింటెండెంట్, 30 సీనియర్ అసిస్టెంట్, 15 లైబ్రేరియన్, 30 జూనియర్ అసిస్టెంట్ పోస్టులను మంజూరుచేస్తూ ఆర్థికశాఖ ముఖ్యకార్యదర్శి కే రామకృష్ణారావు ఉత్తర్వులు జారీచేశారు.