హైదరాబాద్, ఆగస్టు 19(నమస్తే తెలంగాణ): ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా తమకు 30 శాతం ఫిట్మెంట్ అమలుచేసిన సీఎం కేసీఆర్కు తెలంగాణ అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ అసోసియేషన్ కృతజ్ఞతలు తెలిపింది. గురువారం సంఘం ప్రతినిధులు.. స్త్రీ, శిశు సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్ను కలిసి ధన్యవాదాలు తెలిపారు. ఏడేండ్ల కాలంలో మూడుసార్లు తమకు వేతనాలు పెంచిన గొప్ప నేత సీఎం కేసీఆర్ అని కొనియాడారు. మంత్రిని కలిసినవారిలో అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షురాలు ఎం భిక్షపమ్మ, సభ్యులు సుమాంజలి, నిర్మల, విజయలక్ష్మి, సౌజన్య ఉన్నారు.
పలుచోట్ల క్షీరాభిషేకాలు..
అంగన్వాడీ టీచర్లకు వేతనాల పెంపుపై హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. టీఆర్ఎస్కేవీ సూర్యాపేట జిల్లా అధ్యక్షుడు, అంగన్వాడీల యూనియన్ జిల్లా గౌరవాధ్యక్షుడు వెంపటి గురూజీ ఆధ్వర్యంలో సూర్యాపేటలో సీఎం కేసీఆర్, మంత్రులు కేటీఆర్, జగదీశ్రెడ్డిల ఫ్లెక్సీకి అంగన్వాడీలు క్షీరాభిషేకం. కామారెడ్డి జిల్లా మద్నూర్ మండలంలోని పెద్ద ఏక్లారా టీచర్లు, హెల్పర్లు సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేసి కృతజ్ఞతలు తెలిపారు.