నిజామాబాద్, మే 13 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): ‘కరోనా బాధితులు ధైర్యంగా ఉండాలి. సీఎం కేసీఆరే నన్ను ఇక్కడకు పంపించారు. ఏ అవసరం వచ్చినా తీర్చేందుకు ప్రభుత్వం అండగా ఉన్నది. త్వరలోనే కోలుకొని ఇండ్లకు వెళ్తారు’ అని రోడ్లు భవనాలశాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి కరోనా బాధితుల్లో మనోధైర్యాన్ని నింపారు. నిజామాబాద్, బోధన్, ఆర్మూర్ ప్రభుత్వ దవాఖానల్లోని కొవిడ్ వార్డులను ఆయన గురువారం జిల్లా అధికారులతో కలిసి పరిశీలించారు. నిజామాబాద్, ఆర్మూర్ దవాఖానల్లో కొవిడ్ పేషెంట్లను పలుకరించేందుకు వచ్చిన మంత్రి ప్రశాంత్రెడ్డి, ఎమ్మెల్యే జీవన్రెడ్డి, కలెక్టర్ నారాయణరెడ్డి పీపీఈ కిట్లు లేకుండానే కొవిడ్ వార్డుల్లో కలియ తిరిగారు. అవసరాలను గుర్తించడంతోపాటు త్వరలోనే ఆయా దవాఖానల్లో వెంటిలేటర్ సౌకర్యాలను పెంచేందుకు కృషిచేస్తామని ప్రశాంత్రెడ్డి హామీ ఇచ్చారు. నిజామాబాద్ దవాఖానలో కరోనా సోకి హాస్పిటల్లో చేరిన 13 ఏండ్ల బాలికను ఆత్మీయంగా పలుకరించారు. ‘ఏమ్మా.. ఎట్లుంది ఆరోగ్యం’ అంటూ ఆరా తీశారు. వైద్యులు, వైద్య సిబ్బంది సేవలు అమోఘమని మంత్రి మెచ్చుకున్నారు. నిజామాబాద్ జిల్లా వేల్పూర్లో ఇంటింటి జ్వర సర్వేను పరిశీలించారు.