హైదరాబాద్, ఏప్రిల్ 30 (నమస్తే తెలంగాణ): డ్రోన్ల ద్వారా వ్యాక్సిన్ పంపిణీ చేసేందుకు మానవరహిత విమాన వ్యవస్థ (యూఏఎస్) నిబంధనల్లో పౌర విమానయాన సంస్థ (డీజీఏసీ) సడలింపులు ఇచ్చింది. ఏడాపాదిపాటు సడలింపు ఇస్తూ కేంద్ర పౌర విమానయానశాఖ సంయుక్త కార్యదర్శి అంబర్దూబే గురువారం ఉత్తర్వులు జారీచేశారు. విజువల్ లైన్ ఆఫ్ సైట్ (వీఎల్వోఎస్) పరిధిలో డ్రోన్ల ద్వారా వ్యాక్సిన్లను పంపిణీ చేసుకోవచ్చని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. డీజీఏసీ 2021 కోసం ఇప్పటికే ప్రకటించిన నిబంధనలు ఇతర విషయాల్లో అమలవుతాయని కేంద్ర పౌర విమానయానశాఖ స్పష్టంచేసింది. డ్రోన్ల ద్వారా వ్యాక్సిన్ పంపిణీ చేయడం కోసం నిబంధనల్లో మార్పులు చేయాలని తెలంగాణ ప్రభుత్వం మార్చి 9న కోరినట్టు కేంద్రం వెల్లడించింది.