యుద్ధం జరుగుతున్నది. కనిపించని శత్రువుకు, మానవాళికి మధ్య సంకుల సమరం జరుగుతున్నది. వైరస్ మాయలమారితనం కొంత, మనందరి నిర్లక్ష్యం మరికొంత… కలగలసి విపత్తు మరింత తీవ్రమై వెంటాడుతున్నది. వైరస్ వ్యాప్తి అపారం. వనరులు పరిమితం.
ఉన్న సౌకర్యాలనే దేశమంతా వాడుకోవాల్సిన పరిస్థితి. ఈ సంక్షోభ సమయంలో తెలంగాణ ప్రభుత్వం, వైద్యారోగ్య సిబ్బంది ఉక్కు సంకల్పంతో కరోనాతో పోరాడుతున్నరు. ప్రాణాలకు తెగించి ప్రజలకు కవచంలా నిలబడుతున్నరు. ముఖ్యమంత్రి కేసీఆర్ నిరంతర పర్యవేక్షణలో, ఆరోగ్య మంత్రి ఈటల రాజేందర్ మార్గదర్శకత్వంలో వైద్య ఆరోగ్య సిబ్బంది దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నరు.
విశాలమైన ఆవరణ.. అందులోనూ చెట్ల చల్లటి నీడలో భౌతికదూరం పాటిస్తూ విశ్రాంతిగా కూర్చున్న వీరంతా కొవిడ్ టీకా తీసుకోవటానికి వచ్చినవారు. రాష్ట్ర ప్రభుత్వం వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ఎంత పకడ్బందీగా చేపడుతున్నదో చెప్పేందుకు సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల ఆరోగ్య కేంద్రంలో కనిపించిన ఈ దృశ్యమే ఉదాహరణ.
కొన్ని రాష్ర్టాల్లో కరోనా పరీక్షలు నిర్వహించడమే గగనంగా ఉన్నది. ఢిల్లీ, పంజాబ్లాంటి చోట్ల ఆక్సిజన్ కొరత ప్రాణగండంగా మారింది. మహారాష్ట్రలో దవాఖానల్లో వరుస ప్రమాదాలు. యూపీలో వైద్య వ్యవస్థ తీవ్ర ఒత్తిడిలోకి జారుకున్నది. ఉత్తరాది రాష్ర్టాల్లో ఇలా కరోనా విలయతాండవం చేస్తుంటే.. తెలంగాణలో కొంత అదుపులోనే ఉన్నది. ప్రజలు, ప్రభుత్వం చేతిలో చేయివేస్తే తప్ప కట్టడి చేయలేని ఈ విపత్తు తెలంగాణలో చేయిదాటి పోకపోవడానికి కారణం రాష్ట్రంలో తీసుకుంటున్న ముందుజాగ్రత్త చర్యలే.
తెలంగాణ ఏర్పడిన తర్వాత ప్రభుత్వ వైద్య వ్యవస్థను బలోపేతం చేసేందుకు సర్కారు తీసుకున్న చర్యలు ఆపత్కాలంలో ఎంతో ఉపయోగపడుతున్నాయి. వీటి వల్ల తెలంగాణలో ఇప్పుడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో సైతం కరోనాకు చికిత్సలు జరుగుతున్నాయి. ఊరూరా టీకా క్యాంపులను నిర్వహిస్తున్నారు. కింది స్థాయిలో మౌలిక సదుపాయాలను పెంచడం వల్ల హైదరాబాద్పై ఒత్తిడి తగ్గి, ఇతర రాష్ర్టాల వారికి చికిత్స అందించే వీలు చిక్కింది. తెలంగాణలో కరోనా చికిత్స పొందుతున్న వారిలో 40 శాతం మంది పొరుగు రాష్ర్టాలకు చెందినవారే అని ఒక అంచనా.
మహారాష్ట్ర, ఢిల్లీ వంటి రాష్ర్టాల్లో ఆక్సిజన్ లేక దవాఖాన గేట్ల వద్దే రోగులు రాలిపోతుంటే.. ఆక్సిజన్ సిలిండర్లు పేలిపోతుంటే.. తెలంగాణలో ఇంతటి క్లిష్టపరిస్థితుల్లోనూ ప్రభుత్వ హస్పిటళ్లలో ప్రాణవాయువు కొరత లేదు! వెంటిలేటర్లు, అత్యవసర ఔషధాలు లేక దవాఖానలో పేషెంట్లకు చికిత్స అందించడం కొన్ని రాష్ర్టాల్లో కత్తిమీద సాములా తయారైతే.. ప్రభుత్వ దవాఖానలో చేరితే ప్రాణాలకు భరోసా దొరుకుతున్నది తెలంగాణలో! ఇండ్లలోనే చికిత్స పొందుతున్నవారిని తమకేమీ పట్టనట్టు కొన్ని రాష్ర్టాలు వదిలేస్తుంటే.. ప్రతి రోగికీ హోం ఐసొలేషన్ కిట్స్ ఇవ్వడమే కాకుండా.. ఎప్పటికప్పుడు వారి బాగోగులు తెలుసుకుంటున్నది తెలంగాణలోనే!
వైరస్ వ్యాప్తిని అడ్డుకోవటానికి ఇతర చర్యలు తీసుకుంటూనే అత్యంత కీలకమైన వ్యాక్సినేషన్ ప్రక్రియనూ పకడ్బందీగా నిర్వహిస్తూ కరోనాకు అడ్డుకట్ట వేస్తున్నది తెలంగాణ ప్రభుత్వం. అందుకే.. మహారాష్ట్ర, ఢిల్లీ, మధ్యప్రదేశ్, గుజరాత్, ఉత్తరప్రదేశ్, ఛత్తీస్గఢ్, కర్ణాటక రాష్ర్టాల్లో పరిణామాలు నానాటికి భయానకంగా మారుతున్నా.. తెలంగాణలో పరిస్థితి తీవ్రంగానే ఉన్నప్పటికీ.. అదుపులో ఉంటున్నది!
కరోనా సెకండ్వేవ్తో యావత్ భారతం వణికిపోతున్నది. తెలంగాణలో సైతం పరిస్థితి కొంత తీవ్రంగానే ఉన్నా.. ప్రభుత్వం ప్రజలకు నేనున్నానని అండగా నిలుస్తున్నది. భవిష్యత్తు పరిస్థితిని ముందే అంచనావేసి.. అప్రమత్తంగా ఉండి.. చికిత్సకు ఏర్పాట్లు, దవాఖానలు, అందులో బెడ్లు, వెంటిలేటర్లు, ఆక్సిజన్, పీపీఈ కిట్లు.. ఇలా ప్రతి విషయంలో తగిన ఏర్పాట్లు చేసి.. భరోసా కల్పిస్తున్నది. ట్రేస్, టెస్ట్, ట్రీట్.. అనే మూడంచెల విధానాన్ని వైద్యశాఖ రాష్ట్రంలో పకడ్బందీగా అమలుచేస్తున్నది. ఇందుకోసం హైదరాబాద్ మొదలుకొని గ్రామీణ ప్రాంతాల్లో పీహెచ్సీల వరకు కరోనా పరీక్షల కేంద్రాలను ప్రజలందరికీ అందుబాటులో ఉంచింది.
హైదరాబాద్, ఏప్రిల్ 25 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్లో గాంధీ, ఉస్మానియా, నిమ్స్ లాంటి ప్రధాన దవాఖానలు మొదలుకుని పాత జిల్లాల కేంద్రాల్లోని ప్రధాన దవాఖానలతోపాటు.. సిద్దిపేట, ఆసిఫాబాద్, కొత్తగూడెం, సూర్యాపేట లాంటి కొత్త జిల్లా కేంద్రాల్లోనూ మొత్తం 20 ఆర్టీపీసీఆర్ టెస్టింగ్ కేంద్రాలను ఏర్పాటుచేసింది. వీటికితోడు మరో 60 కేంద్రాలను ప్రైవేటు హాస్పిటళ్లలో ఏర్పాటు చేశారు. ఇక ర్యాపిడ్ యాంటిజెన్ పరీక్షల కోసం ప్రభుత్వమే ఏకంగా 1,064 కేంద్రాలను నెలకొల్పడం గమనార్హం. హైదరాబాద్లోని అనేక అర్బన్ పీహెచ్సీలతోపాటు ప్రముఖ హాస్పిటళ్లలో మొత్తం 104 కేంద్రాలను ఏర్పాటు చేశారు. మారుమూల గ్రామాల్లోనివారి సౌలభ్యం కోసం వారికి అత్యంత సమీపంలోనే ఈ కేంద్రాలను నెలకొల్పారు. మండల కేంద్రాలతోపాటు పీహెచ్సీలు, సబ్ సెంటర్లను ఇందుకు వినియోగిస్తున్నారు. ఆదివాసీలు అధికంగా ఉండే ఉమ్మడి ఆదిలాబాద్లోనే 30 ర్యాపిడ్ పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు.
భారీ సంఖ్యలో పెరుగుతున్న కరోనా పేషెంట్లను దృష్టిలో పెట్టుకుని.. వైరస్ మరింతగా విస్తరించకుండా సర్కారు రాష్ట్రవ్యాప్తంగా 363 మైక్రో కంటైన్మెంట్ జోన్లను ఏర్పాటు చేసింది. ఇటువంటి జోన్లలోకి బయటివారు రాకుండా, లోని వ్యక్తులు బయటకు వెళ్లకుండా పకడ్బందీ చర్యలు తీసుకున్నది. కరోనా బారినపడ్డ వారిలో ఎలాంటి లక్షణాలు లేనివారు, స్వల్ప లక్షణాలు ఉన్నవారిని ఎక్కడికక్కడ ఐసోలేషన్లో ఉంచి.. తగిన చికిత్స అందించేలా పక్కాగా ప్రణాళిక వేసింది. ఇందుకోసం జిల్లా కేంద్రాలతోపాటు ముఖ్య పట్టణాల్లోనూ కొవిడ్ కేర్ సెంటర్లను వైద్యారోగ్య శాఖ ఏర్పాటు చేసింది. రాష్ట్రవ్యాప్తంగా 33 జిల్లాల్లో 49 కొవిడ్ కేర్ సెంటర్లలో మొత్తం 4,737 బెడ్లను అందుబాటులో ఉంచింది. దీనివల్ల స్వల్ప లక్షణాలున్నవారు ఎక్కడికక్కడ తమకు అందుబాటులోనే చికిత్స పొందే అవకాశం కల్పించింది.
కరోనా పేషెంట్లకు చికిత్స అందించేందుకు రాష్ట్రవ్యాప్తంగా కావాల్సినన్ని బెడ్లను ప్రభుత్వం ఏర్పాటుచేసింది. గాంధీ లాంటి ముఖ్యమైన దవాఖానను కొవిడ్ చికిత్సకే వాడుతున్నారు. కొవిడ్ చికిత్స కోసం రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 116 హాస్పిటళ్లు ఉండగా.. వాటిలో సాధారణ బెడ్లు 5,109 ఉన్నాయి. ఇందులో శనివారం నాటికి 4,175 బెడ్లు అందుబాటులో ఉన్నాయి. ఆక్సిజన్ బెడ్లు 3,270, ఐసీయూ బెడ్స్ 905 ఖాళీగా ఉన్నాయి. రాష్ట్రం మొత్తంమీద ప్రభుత్వ దవాఖానల్లో అన్ని బెడ్లు 13,732 ఉంటే శనివారం నాటికి 8,350 అందుబాటులో ఉన్నాయి. ప్రభుత్వ దవాఖానల్లో చికిత్స తీరుతెన్నులకు ఈ లెక్కలే సాక్ష్యం చెప్తున్నాయి. మరోవైపు ప్రైవేటులోనూ మొత్తం 30,816 బెడ్లు ఉండగా.. శనివారం నాటికి 17,757 బెడ్లు ఖాళీగా ఉన్నాయి. భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వ, ప్రైవేటు దవాఖానల్లో బెడ్ల సంఖ్యను పెంచేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
రాష్ట్రవ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగంగా నిర్వహిస్తున్నారు. రాష్ట్రంలో 1300లకుపైగా వాక్సినేషన్ సెంటర్లను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. శుక్రవారం నాటికి రాష్ట్రంలో సుమారు 4.5 లక్షల వ్యాక్సిన్లు అందుబాటులో ఉన్నాయి. రెమ్డెసివిర్ విషయంలో కేంద్రం వివక్ష చూపిస్తున్నప్పటికీ.. ప్రభుత్వ దవాఖానల్లో రెమ్డెసివిర్ ఇంజక్షన్లు సరిపోయినన్ని అందుబాటులో ఉన్నాయని అధికారులు స్పష్టంచేస్తున్నారు. అయితే ప్రైవేటులో వీటి కొరత కనిపిస్తున్నది. మరిన్ని రెమ్డెసివిర్ ఇంజక్షన్లను రాష్ర్టానికి కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేస్తున్నా.. కేంద్రం వివక్ష కారణంగా కొంత గందరగోళ పరిస్థితి తలెత్తింది. వాస్తవానికి వ్యాక్సిన్లు, రెమ్డెసివిర్ ఇంజక్షన్ల నియంత్రణ కేంద్రం చేతుల్లో ఉన్నది. ఫలితంగా రాష్ట్రంలో ఈ రెండు అంశాల్లో కొంత ఇబ్బంది నెలకొన్నది. కానీ.. ముందు జాగ్రత్త చర్యగా సిద్ధం చేసుకున్న రెమ్డెసివిర్ ఇంజక్షన్లను రోగులకు అందుబాటులో ఉంచుతున్నారు. ఇక వ్యాక్సినేషన్లోనూ మనకు వచ్చిన కోటా ప్రకారం ఎప్పటికప్పుడు టీకాలు వేస్తూ దేశంలోని టాప్ 5 రాష్ర్టాల్లో ఒకటిగా నిలిచింది.
కరోనా పరీక్షలు చేయడం దేశంలోని అనేక రాష్ర్టాల్లో అత్యంత క్లిష్టంగా మారింది. ట్రేసింగ్, టెస్టింగ్, ట్రీటింగ్ అనే మూడు సూత్రాలను ఏ రాష్ట్రంలోనూ సరిగా అమలు చేయడంలేదు. తెలంగాణలో మాత్రం ప్రభుత్వం పకడ్బందీగా పరీక్షలు నిర్వహిస్తున్నారు. పాజిటివ్ వచ్చి స్వల్ప లక్షణాలు ఉన్నవారిని హోం ఐసొలేషన్లో ఉండాలని సూచిస్తూ కావల్సిన మెడిసిన్స్ అందిస్తున్నది. అక్కడితో వదిలేయకుండా స్థానిక ఆరోగ్య కార్యకర్తలు, ఆశా వర్కర్ల ద్వారా రోగుల ఆరోగ్య పరిస్థితిని నిత్యం తెలుసుకుంటూ అవసరమైన సలహాలు, సహాయాన్ని అందజేస్తున్నది.
వాస్తవానికి ప్రపంచ ఆరోగ్య సంస్థ మార్గదర్శకాల ప్రకారం ప్రతి 10 లక్షల మంది ప్రజలకు ప్రతి రోజూ 140 పరీక్షలు చేస్తే సరిపోతుంది. ఈ లెక్కన మన రాష్ట్రంలో ప్రతిరోజూ 5,600 పరీక్షలు నిర్వహించాల్సి ఉంటుంది. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడా రాజీ పడకుండా.. కరోనాను పూర్తిస్థాయిలో అదుపు చేసే లక్ష్యంతో ప్రతిరోజూ లక్షకుపైగా పరీక్షలు చేస్తున్నది. శనివారం రాష్ట్రవ్యాప్తంగా 1.08 లక్షల కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. ఇప్పటివరకు సుమారు 1.24 కోట్లకుపైగా పరీక్షలను ప్రభుత్వం చేసింది. ఈ లెక్కన చూసుకుంటే.. ప్రతి మిలియన్ జనాభాకు ఇప్పటి వరకు దాదాపు 4.37 లక్షల మందికి పరీక్షలు చేసినట్టయ్యింది. కరోనా కారణంగా చనిపోయినవారి శాతాన్ని పరిశీలిస్తే.. దేశ సగటుకన్నా రాష్ట్రంలో చాలా తక్కువ ఉన్నది. శనివారం నాటికి మన రాష్ట్రంలో మరణాలు 0.50% ఉండగా.. దేశ సగటు 1.1 శాతంగా ఉన్నది. ఇందులోనూ 55.69% మరణాలు కరోనాతోపాటు ఇతర తీవ్రమైన వ్యాధుల కారణంగా సంభవించగా, 44.31% మంది కొవిడ్తో చనిపోయారు. రికవరీ రేటులోనూ మన రాష్ట్రం మెరుగ్గా ఉన్నది. శనివారం నాటికి మన దగ్గర రికవరీ రేటు 83.57% ఉండగా.. దేశ సగటు 83%గా ఉన్నది.
నిజానికి మన పొరుగున్న ఉన్న మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్లలో కరోనా తీవ్రత చాలా ఎక్కువగా ఉన్నది. దేశంలోనే మహారాష్ట్ర పరిస్థితి దారుణాతి దారుణంగా ఉన్నది. దేశవ్యాప్తంగా నమోదవుతున్న కేసులలో మహారాష్ట్రలోనే 40% వరకు ఉంటున్నాయంటే అక్కడి పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. తెలంగాణలో, హైదరాబాద్లో కరోనాకు మంచి చికిత్స అందిస్తుండటం, మంచి సౌకర్యాలు ఉండటంతో.. మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ నుంచి సైతం పేషెంట్లు తెలంగాణ దవాఖానలకు పోటెత్తుతున్నారు. అనధికారిక అంచనాల ప్రకారం ప్రస్తుతం తెలంగాణలో చికిత్స పొందుతున్నవారిలో సుమారు 40% వరకు ఇతర రాష్ర్టాలకు చెందినవారే ఉన్నారు.
దవాఖానలు, ఐసొలేషన్ కేంద్రాలు, కొవిడ్ కేర్ సెంటర్లలో పేషెంట్లకు ప్రభుత్వం బలవర్ధకమైన ఆహారాన్ని అందిస్తున్నది. కొవిడ్ కేర్ సెంటర్లలోనే సుమారు 4,700 మందికిపైగా రోగులకు ఆహారాన్ని అందిస్తున్నారు. మరోవైపు గాంధీ దవాఖానలో దాదాపు 1500 మందికిపైగా పేషెంట్లు ఉంటారు. మిగిలిన హాస్పిటళ్లను కూడా పరిగణనలోకి తీసుకుంటే.. రోజూ సుమారు 8 వేల మందికి బలవర్ధకమైన ఆహారాన్ని ప్రభుత్వం అందిస్తున్నది. ఇందులో ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం, రాత్రి వేడివేడి భోజనం ఉంటున్నాయి. మధ్యాహ్నం భోజనంలో ఉడికిన కోడిగుడ్డు, కూర, పప్పు, రసం, రాత్రికి పుల్కాలు, కూర, పప్పు, రసం అందిస్తున్నారు. దీనికితోడు రోగనిరోధక శక్తిని పెంచేలా బాదంపప్పు, కిస్మిస్ లాంటి డ్రైఫ్రూట్స్కూడా అందిస్తున్నారు.
ఆక్సిజన్ తరలింపు విషయంలో తెలంగాణ ప్రభుత్వం దేశానికే ఒక మార్గం చూపినట్టయ్యింది. దేశ చరిత్రలోనే మొదటిసారిగా ఆక్సిజన్ ట్యాంకర్లను వాయుమార్గంలో తరలించడం గమనార్హం. మన దగ్గర ఆక్సిజన్ కొరత రాకుండా ముందే ఏర్పాట్లు చేశారు. ఇందులో భాగంగానే శుక్రవారం భారత సైన్యానికి చెందిన రెండు విమానాల్లో మొత్తం 8 ఖాళీ ట్యాంకులను ఒడిశాలోని రూర్కెలాకు పంపించారు. కేవలం గంటన్నర వ్యవధిలోనే అక్కడికి చేరుకున్న ట్యాంకర్లు 150 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ను తీసుకుని బయలుదేరాయి. ట్యాంకర్లను రోడ్డు మార్గంలో అక్కడికి పంపినట్లయితే అవి అక్కడికి చేరటానికే మూడు రోజులకుపైగా పట్టేది. ఒక దశలో వాయుమార్గాన్ని ఎంచుకోవడంతో ఈ సమయం గణనీయంగా తగ్గింది.
ఢిల్లీ, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్లలో పరిస్థితి దారుణంగా ఉన్నది. ఒక విధంగా చెప్పాలంటే అక్కడి వైద్యారోగ్య శాఖలు, ప్రభుత్వాలు, అధికారులు, సిబ్బంది చేతులెత్తేశారు. మన దగ్గర పరిస్థితి ఒకింత బాగుంది. ట్రేస్, టెస్ట్, ట్రీట్లను పక్కాగా అమలు చేస్తూ.. కొవిడ్ కేసులను ముందే గుర్తించి చికిత్స చేస్తున్నాం. అక్కడికి.. ఇక్కడికి.. జమీన్ ఆస్మాన్ ఫరక్ ఉన్నది. వేరే రాష్ర్టాల్లో ప్రభుత్వ, ప్రైవేటు దవాఖానల మధ్య సమన్వయం లేదు. కానీ మనం ప్రైవేటు దవాఖానల్లోని బెడ్లనుకూడా స్వాధీనం చేసుకొని, వాటి యాజమాన్యాలతో సమన్వయం చేసుకుంటూ పేషెంట్లకు చికిత్సలు చేస్తున్నాం. ఇతర రాష్ర్టాల్లో ప్రజలు వీధుల్లోకి వచ్చి హాహాకారాలు చేస్తున్నారు. మన దగ్గరకూడా పరిస్థితి గంభీరంగా ఉన్నది.. కానీ అక్కడ ఉన్నంత అల్లకల్లోలం లేదు. ఆక్సిజన్ తగినంత ఉండేలా చూసుకుంటున్నాం. ఐసీయూ బెడ్ల సంఖ్యను పెంచుతున్నాం. మొదటి వేవ్లో 23-24 వేల బెడ్లు మాత్రమే సిద్ధం చేయగా.. రెండో వేవ్లో 50 వేల బెడ్లు అందుబాటులోకి తెచ్చాం. మరిన్ని పెంచేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం. ఇతర రాష్ర్టాల్లో కొవిడ్ మృతులకు సరైన అంత్యక్రియలు కూడా నిర్వహించడం లేదు. కానీ మన దగ్గర పరిస్థితి విషమించి చనిపోయిన పేషెంట్లకు అంత్యక్రియలను బాగా నిర్వహిస్తున్నాం. మన చుట్టుపక్కల రాష్ర్టాల నుంచి పెద్దసంఖ్యలో వచ్చే పేషెంట్లకు కూడా చికిత్స అందిస్తున్నాం.
-శ్రీనివాసరావు, డైరెక్టర్ ఆఫ్ హెల్త్
దేవునోలె వచ్చి ఆదుకుర్రు.. లేకుంటే జీవిపొయ్యేది
నాకు కరోనా వచ్చినప్పుడు హాలియా దవాఖాన డాక్టర్ శీనివాసులు, కంపోండర్ సైదులు రోజూ దేవుండ్లోలె ఇంటికి వచ్చి నాకు వైద్యం చేసి ప్రాణాలు కాపాడిర్రు. లేకుంటే నా జీవి పొయ్యేది. ‘పెద్దమ్మ.. కరోనా వచ్చిందని భయపడకు. నేనున్నా..’ అంటూ ధైర్యం చెప్పిండ్రు. ‘ఇది అంటు వ్యాధి.. నీవు మాట్లాడితే నీ నోటి తుప్పిళ్లతోటి మరొకరికి వస్తది.. అందుకే 17 రోజులు బయటకు వెళ్లకు.. చెప్పినట్లు మందులు వేసుకో, ఉడుకుడుకు అన్నం తిను.. వేడినీళ్లలో ఈ గోలీలు వేసుకోని ఆవిరి పీల్చు, గోరు వెచ్చని నీళ్లు తాగు’ అని చెప్పిర్రు. కరోనా నాకు నయమైంది. డాక్టరు రోజూ కారులో పొద్దున్నే ఇంటికి వచ్చి ‘మందులు వేసుకున్నావా, అన్నం తిన్నావా?’ అని అడిగిండు. ఐదు రోజుల తర్వాత రోజూ నా కొడుకుతో ఫోన్లో మాట్లాడేది. ‘మీ అమ్మ ఎట్లుం ది?’ అని అడిగి సలహాలు చేప్పేది. కరోనా వచ్చినప్పుడు మా ఊరోళ్లు కూడా దగ్గర రాలేదు కానీ డాక్టర్, ఆయన వెంట సైదులు మాత్రం భయం లేకుండా నా దగ్గరకు వచ్చిండ్రు.
చాపల కమలమ్మ ఇబ్రహీంపేట గ్రామం. అనుముల మండలం, నల్లగొండ జిల్లా
ప్రాణాలను పణంగా పెట్టి వైద్యసేవలు..
ప్రాణాలను పణంగా పెట్టి వైద్యసేవలు అందిస్తున్నాం. ప్రతి రోజు వ్యాక్సినేషన్, కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నాం. కరోనా బారిన పడకుండా ప్రజలకు అవగాహన కల్పిస్తున్నాం. కరోనా రోగులకు మందులను అందిస్తూ తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి చెప్తున్నాం. హోం ఐసొలేషన్లో ఎక్కువ శాతం కోలుకున్నారు. చనిపోయిన వారి గురించే సోషల్ మీడియాలో చూపిస్తున్నారు, వ్యాధి తగ్గుముఖం పట్టి చాలా మంది ఆరోగ్యంగా ఉంటున్నారు.
శోభ, నర్స్, రెడ్డిపల్లి పీహెచ్సీ, నర్సాపూర్, మెదక్ జిల్లా
ప్రైవేటులో2500దాకా అవుతాయట!
ప్రైవేట్ దవాఖానలో కరోనా పరీక్షలకు రూ.1500 నుంచి రూ.2500 వరకు తీసుకుంటారట. రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా పరీక్షలు చేయిస్తున్నది. కరోనా ఉన్నదీ, లేనిదీ వెంటనే తెలుస్తుంది. శాలిగౌరారం వచ్చి పరీక్షలు చేయించుకున్నా. ఇక్కడ వైద్యులు కూడా దూరం పాటిస్తూ పరీక్షలు చేస్తున్నారు. ఇంత సౌకర్యం కల్పిస్తున్న తెలంగాణ ప్రభుత్వానికి కృతజ్ఞతలు.
-గుండా భిక్షమయ్య, మాదారం, శాలిగౌరారం, నల్లగొండ జిల్లా
ప్రభుత్వ దవాఖానలో ఫ్రీగా టీకా
కొవిడ్ కేసులు పెరుగుతుండటంతో ప్రభుత్వ దవాఖానలో ఉచితంగా ఇస్తున్న వ్యాక్సిన్ తీసుకున్నా. టీకా తీసుకోవడంలో ఎలాంటి ప్రమాదం లేదు. టీకా తీసుకునేందుకు ప్రభుత్వ దవాఖానలో అన్ని వసతులు బాగున్నాయి. వైద్యుల పర్యవేక్షణలో టీకాలు వేస్తున్నారు. వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత అరగంట పాటు అబ్జర్వేషన్లో ఉంచారు.
గోవర్ధన్ , మహబూబ్నగర్ జిల్లా
అంతా భగవంతుడి దయ
భగవంతుడిపై భారం వేసి పనిచేస్తున్నా. కరోనా వచ్చిన తొలి రోజుల్లో వాళ్ల వద్దకు వెళ్లాలంటే భయం వేసేది. రానురాను అలవాటై పోయింది. బాధితుల వద్దకు బంధువులు కూడా రావడం లేదు. నేను ధైర్యంతో ముందుకొచ్చాను. పీపీఈ కిట్ వేసుకుని మూతికి మాస్క్ కట్టుకుని, తలకు టోపీ పెట్టుకుని అన్నం పెడుతున్నాను. ఇప్పటిదాకా ఎలాంటి అనారోగ్య సమస్య రాలేదు. ఎవరైనా ఎంతో కష్టమొస్తేనే దవాఖానకు వస్తరు. వారిని మంచిగా చూసుకుంటే పుణ్యం ఉంటుంది. అందుకే ధైర్యంగా చేస్తున్నాను.
-మూడా కళావతి, కొత్తగూడెం జిల్లా కేంద్ర దవాఖాన వంట మనిషి
రోజుకు వంద మందికి పరీక్షలు
బయ్యారం పీహెచ్సీలో రోజుకు వంద మందికి కరోనా పాజిటివ్ పరీక్షలు చేస్తున్నాం. ఇటీవల రెండోదశ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో జలుబు, దగ్గు, జ్వరం ఇతర లక్షణాలు ఉన్నవారు వస్తున్నారు. రోజుకు వంద మందికి పరీక్షలు చేస్తున్నాం. ఎక్కువగా కేసులు నమోదైన వీధుల్లో అక్కడే స్పెషల్ క్యాంపు పెడుతున్నాం. ప్రజలకు అవగాహన కల్పించి ర్యాపిడ్ టెస్టులు చేస్తున్నాం. పాజిటివ్ వచ్చిన వారికి మందులు ఇస్తున్నాం.
సులోచన, ఏఎన్ఎం, బయ్యారం, మహబూబాబాద్ జిల్లా