జిల్లా వ్యాప్తంగా భారీ స్పందన
ఇప్పటి వరకు 13,149 మందికి టీకా
అయినా జాగ్రత్తలు పాటించాలి
‘నమస్తే’తో మంచిర్యాల డీఎంహెచ్వో నీరజ
మంచిర్యాల ఏసీసీ, మార్చి 19 : కరోనా వైరస్ను నియంత్రించడంలో కొవిడ్-19 వ్యాక్సిన్ సురక్షితంగా పనిచేస్తున్నదని మంచిర్యాల జిల్లా వైద్యాధికారి నీరజ అన్నారు. శుక్రవారం ఆమె ‘నమస్తే తెలంగాణ’తో మాట్లాడారు. జిల్లాలో వ్యాక్సినేషన్ ప్రారంభమైన మొదటి రోజు నుంచే భారీ స్పందన వచ్చిందన్నారు. మొదటగా వైద్య రంగం, పారిశుధ్య కార్మికులకు టీకా కార్యక్రమం విజయవంతమైందని తెలిపారు. రెండో దశలో 60 ఏండ్లు పైబడిన వారికి, 45-59 ఏండ్ల దీర్ఘకాలిక, ఇతర ఆరోగ్య సమస్యలు ఉన్న వారికి వ్యాక్సిన్ ఇస్తున్నట్లు చెప్పారు. ప్రస్తుతం ప్రభుత్వ దవాఖానతో పాటు ఆయా పీహెచ్సీలు, ప్రభుత్వం అవకాశం కల్పించిన ప్రైవేట్ దవాఖానల్లో వ్యాక్సినేషన్ కొనసాగుతున్నదన్నారు. ఇప్పటి వరకు జిల్లా వ్యాప్తంగా మొదటి, రెండో డోస్ టీకా తీసుకున్న వారిలో హెల్త్ వారియర్స్ 7042 మంది, ఫ్రంట్ లైన్ వారియర్స్ 3,944 మంది ఉన్నారని వెల్లడించారు. అలాగే రెండో దశలో మొదటి డోస్కు సంబంధించి 60 ఏళ్లు పైబడిన వారిలో 1,563 మంది, 45-59 మధ్య దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు 600 మంది ఉన్నారని తెలిపారు. మొత్తంగా 13,149 మందికి టీకా ఇచ్చినట్లు చెప్పారు. ఇప్పటి వరకు టీకా తీసుకున్న వారికి ఎలాంటి ఆరోగ్య సమస్యలు కలుగలేదని, వ్యాక్సిన్ పూర్తిగా సురక్షితమేనని వెల్లడించారు. వృద్ధులు ఉత్సాహంగా పాల్గొని టీకా తీసుకుంటున్నారని తెలిపారు. సోషల్ మీడియా ద్వారా వస్తున్న పుకార్లను నమ్మవద్దని, అనుమానాలు ఉంటే వైద్యులను సంప్రదించాలని సూచించారు. అందరూ కొవిన్ యాప్లో పూర్తి వివరాలతో రిజిస్టర్ చేసుకొని తప్పనిసరిగా టీకా తీసుకోవాలన్నారు. జిల్లా వ్యాప్తంగా ప్రతి రోజూ 300 నుంచి 400 మందికి టీకా ఇస్తున్నామని తెలిపారు. జిల్లా వ్యాప్తంగా మొదటి విడుతలో 10,986 మందికి, రెండో విడుతలో 2,163 మందికి టీకా వేసినట్లు వెల్లడించారు. టీకా తీసుకున్నా నిబంధనలు పాటించాలని సూచించారు. ప్రస్తుతం జిల్లాలో కరోనా కేసులు నమోదవుతున్నాయని, జాగ్రత్తలు పాటించాలన్నారు.