ప్రయాణికుల భద్రతకు పెద్దపీట వేయడమే కాదు.. కరోనా కట్టడికి పటిష్టమైన చర్యలు చేపట్టింది హెచ్ఎంఆర్. మహమ్మారి మళ్లీ వ్యాప్తిస్తున్న నేపథ్యంలో రైళ్లను శానిటైజ్ చేయడంతో పాటు స్టేషన్ ఎంట్రీ, ఎగ్జిట్ వద్ద ప్యాసింజర్లు కొవిడ్ నిబంధనలు పాటించేలా చూస్తున్నది. మరోవైపు ఎండలు మండిపోతుండడంతో మెట్రోలో ప్రయాణించేందుకు నగరవాసులు మొగ్గు చూపుతుండగా, రద్దీకి అనుగుణంగా.. అత్యుత్తమ సేవలందిస్తున్నది హైదరాబాద్ మెట్రో రైల్.
మెట్రో జర్నీ సాఫీగా ఉండేందుకు తీసుకుంటున్న చర్యలపై హెచ్ఎంఆర్ సోషల్మీడియా వేదికగా ఎప్పటికప్పుడు ప్రయాణికులకు సమాచారం చేరవేసేలా ఏర్పాట్లు చేసింది. అంతేకాదు సిబ్బంది రద్దీగా ఉండే స్టేషన్లలో పర్యవేక్షణ ఉంచారు. రైళ్లలో ప్రయాణం చేస్తూ..మాస్కులు ధరించడం, భౌతికదూరం పాటించడం, శానిటైజేషన్ వంటి అంశాలను ప్రయాణికులకు వివరిస్తున్నారు. అన్ని స్టేషన్లలోని ఎంట్రీ, ఎగ్జిట్లను తమ నియంత్రణలోకి తీసుకొని.. కొన్నింటిని మాత్రమే తెరిచి వాటి నుంచే ప్రయాణికులు వచ్చి.. వెళ్లేలా, థర్మల్ స్క్రీనింగ్ చేయించుకునేలా చూస్తున్నారు. ముఖ్యంగా ఇంటర్చేంజ్ మెట్రో స్టేషన్లైన అమీర్పేట, ఎంజీబీఎస్, పరేడ్గ్రౌండ్లో రద్దీకి అనుగుణంగా థర్మల్ స్క్రీన్కింగ్ చేసేందుకు సిబ్బందిని అందుబాటులో ఉంచారు. కౌంటర్ల వద్ద క్యూ లైన్లు లేకుండా మొబైల్ ఫోన్లో క్యూఆర్ కోడ్తోనే టికెట్గా మార్చుకొని ప్రయాణం చేసేలా ప్యాసింజర్లకు సలహాలు, సూచనలు ఇస్తున్నారు.
గతేడాది కరోనా కంటే ముందు జనవరి, ఫిబ్రవరి నెలల్లో ప్రతి రోజూ సుమారు 4 లక్షల మంది మెట్రోలో ప్రయాణం చేసేవారు. లాక్డౌన్ విధించిన తర్వాత సేవలు పూర్తిగా నిలిచిపోయాయి. మళ్లీ ప్రారంభమైన తర్వాత క్రమంగా ప్రయాణికుల సంఖ్య పెరుగుతున్నది. తాజా కరోనా ఉధృతి దృష్ట్యా అధికారులు పటిష్టమైన చర్యలు చేపడుతున్నారు. మరోవైపు ఎండలు మండిపోతుండటంతో చాలా మంది మెట్రోలోనే ప్రయాణించేందుకు మొగ్గు చూపుతున్నారు. దీంతో మరింత అప్రమత్తమైన అధికారులు.. అటు ప్రయాణికుల సంఖ్య తగ్గకుండా ఇటు.. కొవిడ్ నిబంధనలు కచ్చితంగా పాటించేలా చూస్తున్నారు. మున్ముందు రద్దీ పెరిగే అవకాశముండటంతో ఎక్కడా నిర్లక్ష్యం చూపకుండా ప్రయాణికులకు సురక్షితమైన, భద్రతతో కూడిన ప్రయాణం మెట్రోలోనే సాధ్యమనేలా..హెచ్ఎంఆర్ యంత్రాంగం పనిచేస్తున్నది. కాగా, ఏప్రిల్ మొదటి వారంలో ప్రతి రోజు సుమారుగా 2 లక్షల వరకు ప్రయాణం చేస్తున్నట్లు మెట్రో వర్గాలు తెలిపాయి.