హైదరాబాద్, జూన్ 1 (నమస్తే తెలంగాణ): ఆపదలో వచ్చినవారికి అండగా నిలవాల్సిన ప్రైవేటు దవాఖానలు, ఫీజుల రూపంలో నిలువుదోపిడీ చేయడంపై ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తున్నది. చికిత్సలో లోపాలు, అధిక ఫీజులు వసూలు చేస్తున్న మరో ఆరు దవాఖానల్లో కొవిడ్ చికిత్స రద్దుచేస్తూ మంగళవారం ఆదేశాలు జారీచేసింది. ఆరోపణలు ఎదుర్కొంటున్నవి సాధారణ, కార్పొరేట్ దవాఖానలు అనే తేడా లేకుండా చర్యలు తీసుకుంటున్నది. కరోనా కష్టకాలంలో మానవతా దృక్పథంతో వ్యవహరించాలని, సేవాభావంతో ప్రవర్తించాలని పలుమార్లు వైద్యారోగ్యశాఖ సూచనలు చేసింది. అయినప్పటికీ కొన్ని ప్రైవేటు దవాఖానలు ధనార్జనే ధ్యేయంగా రోగులును ఫీజుల కోసం పీడిస్తున్నాయి. దీంతో ప్రభుత్వం ఏర్పాటుచేసిన వాట్సప్ నంబర్కు (91541 70960) పెద్ద సంఖ్యలో ఫిర్యాదులు అందుతున్నాయి. వీటి ఆధారంగా విచారణ చేస్తున్న వైద్యారోగ్యశాఖ ఆయా దవాఖానలకు షోకాజు నోటీసులు జారీచేస్తున్నది. తప్పు జరిగినట్లు నిర్ధారణ కాగానే ఆ దవాఖానల్లో కొవిడ్ చికిత్స అనుమతులను రద్దుచేస్తున్నది. ఈ క్రమంలో 113 దవాఖానలపై 174 ఫిర్యాదులు రాగా, వాటిని పరిష్కరించే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. ఇప్పటివరకు 16 దవాఖానలకు అనుమతులు రద్దు చేయగా, 113 దవాఖానలకు షోకాజ్ నోటీసులు జారీచేశారు. మంగళవారం మరో ఆరు దవాఖానలపైనా చర్యలు తీసుకున్నారు. ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా వ్యవహరించినా, ప్రజలను మోసం చేసేలా ప్రవర్తించినా, అధిక ఫీజులు వసూలు చేసినా కఠిన చర్యలు తప్పవని డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ జీ శ్రీనివాసరావు హెచ్చరించారు.
1, కిమ్స్ (సికింద్రాబాద్)
2, సన్షైన్ (గచ్చిబౌలి)
3, సెంచురీ (బంజారాహిల్స్)
4, లోటస్ (లక్డీకాపూల్)
5, మెడ్సిస్ (ఎల్బీనగర్)
6, ఇంటిగ్రో (టోలిచౌకి)