హైదరాబాద్ : రాష్ట్రంలో ఉత్పత్తి అవుతున్న చేపల కొనుగోలు, మార్కెటింగ్, ఎగుమతులను ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో చేపట్టే అంశాన్ని పరిశీలిస్తున్నామని రాష్ట్ర పశుసంవర్థక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. శనివారం మాసాబ్ ట్యాంక్లోని తన కార్యాలయంలో మత్స్యశాఖ అధికారులతో ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన ఉచిత చేప పిల్లల పంపిణీతో చేపల ఉత్పత్తి గణనీయంగా పెరిగిందని అన్నారు. 2016-17 సంవత్సరంలో రాష్ట్రంలో 1.97 లక్షల టన్నుల చేపల ఉత్పత్తి ఉండగా, 2020-21 సంవత్సరంలో 3.49 లక్షల టన్నులకు పెరిగిందని చెప్పారు. రాష్ట్రంలో ఉత్పత్తి అవుతున్న చేపల్లో 60 శాతం ఇక్కడే వినియోగిస్తుండగా, 21 శాతం పశ్చిమ బెంగాల్, 19 శాతం అస్సాం, తమిళనాడు, కేరళ తదితర రాష్ట్రాలకు ఎగుమతి చేస్తున్నట్లు వివరించారు.
‘‘మత్స్యకారులు ఆర్థికంగా, సామాజికంగా అభివృద్ధి సాధించాలన్నదే సీఎం కేసీఆర్ లక్ష్యం. కానీ మత్స్యకారులు దళారులను ఆశ్రయించి నష్టపోతున్నారు. వారికి ఆర్థిక లబ్ధి చేకూర్చేలా మత్స్య ఫెడరేషన్ ఆధ్వర్యంలో నేరుగా మత్స్యకార సంఘాల నుంచి చేపలను కొనుగోలు చేయాలని ప్రభుత్వం యోచిస్తున్నది. మత్స్య ఫెడరేషన్ కొనుగోలు చేసిన చేపలను తెలంగాణ చేపల బ్రాండ్తో మార్కెటింగ్ చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నాం. మార్కెటింగ్ వ్యవస్థను పటిష్టం చేసేందుకు ఇప్పటికే మొబైల్ ఫిష్ ఔట్ లెట్లను ప్రారంభించాం.
మత్స్య సొసైటీల నుంచి కొనుగోలు చేసిన చేపలను 2 లేదా 3 మండలాలను కలిపి క్లస్టర్గా ఏర్పాటు చేసి అక్కడికి రవాణా చేయాలని ప్రణాళికలు రూపొందిస్తున్నాం. రాష్ట్రంలో మొత్తం సుమారు 200 వరకు క్లస్టర్లలను ఏర్పాటు చేయనున్నాం. 40 నుంచి 50 క్లస్టర్లకు ఓ ప్రధాన ప్రాసెసింగ్ యూనిట్ను అనుసంధానం చేస్తాం. హైదరాబాద్లోని శేరిగూడ, ఖమ్మం, కరీంనగర్, నిజామాబాద్, వరంగల్లోని మత్స్యశాఖకు చెందిన భూముల్లో అంతర్జాతీయ నాణ్యతా ప్రమాణాలతో ప్రధాన ప్రాసెసింగ్ యూనిట్లను తొలుత ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నాం. ఈ ప్రాసెసింగ్ యూనిట్లో క్లస్టర్ల నుంచి వచ్చిన చేపలను గ్రేడింగ్ చేయడం, ప్యాకింగ్ చేయడం, శుద్ధి చేయడం, ఫిష్ ఔట్ లెట్ లకు సరఫరా చేయడం, ఇతర మార్కెట్లకు సరఫరా చేయడం లేదా ఇతర రాష్ట్రాలకు ఎగుమతి చేయడం జరుగుతుంది.
పెరిగిన మత్స్య సంపదకు అనుగుణంగా ప్రైవేట్ భాగస్వామ్యంతో (ఫ్రాంచైజ్) మరిన్ని కొత్త ఫిష్ ఔట్ లెట్లను ప్రారంభిస్తాం. రాష్ట్రంలో తలసరి చేపల వినియోగం సాలీనా 7.88 కిలోలు ఉన్నది. కానీ ఐసీఎంఆర్ సిఫారసు ప్రకారం 12 కిలోలు తీసుకోవాలి. రాష్ట్రంలో కావలసిన చేపల లభ్యత ఉన్నా వినియోగదారులకు అందించలేకపోతున్నాం. రాష్ట్రంలో మంచినీటి వనరులు విస్తారంగా ఉన్నాయి. 365 రోజులు వీటిలో నీరు నిల్వ ఉంటుంది. మత్స్యకారులు కేవలం వేసవి కాలంలో మాత్రమే చేపల వేటను కొనసాగిస్తున్నారు. సంవత్సరం పొడవునా చేపల వేట నిర్వహించేలా చర్యలు తీసుకోవాలి’’ అని మంత్రి శ్రీనివాస్ యాదవ్ మత్స్య శాఖ కమిషనర్ లచ్చిరాం భూక్యాను ఆదేశించారు.
మత్స్య ఫెడరేషన్ ద్వారా చేపట్టబోయే మార్కెటింగ్ వలన సుమారు 500 మందికి ప్రత్యక్ష సుమారు 5 వేల మంది వరకు పరోక్షంగా ఉపాధి అవకాశాలు లభిస్తాయని వివరించారు. ఈ ప్రక్రియ ను ముందుకు తీసుకెళ్లేందుకు ఈ రంగంలో అనుభవం కలిగి ఉన్న అందరితో త్వరలో సమావేశం ఏర్పాటు చేసి సమగ్ర కార్యాచరణ ప్రణాళిక రూపొందిస్తామని చెప్పారు. ప్రభుత్వం తీసుకున్న చర్యల వలన రాష్ట్రంలో మత్స్య సంపద పెరిగి మత్స్యకారులు ఆర్థికంగా అభివృద్ధి సాధిస్తున్నారని, జీవనోపాధి అవకాశాలు మరింత మెరుగుపడ్డాయని మంత్రి శ్రీనివాస్ యాదవ్ అన్నారు.