హైదరాబాద్ : ప్రపంచ వ్యాప్తంగా రైతులను కాపాడేందుకు కృత్రిమ మేధను, లోతైన సాంకేతికను వినియోగిస్తున్న వింగ్ స్యూర్ సంస్థతో తెలంగాణ ప్రభుత్వం ఒక అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఈ ఒప్పందంలో భాగంగా వింగ్ స్యూర్ లోతైన సాంకేతిక ఆధారితంగా వ్యక్తిగతీకరించబడిన పంట బీమా ఉత్పాదనలను, సలహా సేవలను చిన్న రైతులకు అందించనుంది.
భారతదేశంలో వ్యవసాయం, దాని అనుబంధ రంగాలు జీవనోపాధులకు అతిపెద్ద వనరులుగా ఉన్నాయి. గ్రామీణ కుటుంబాల్లో అత్యధికం ప్రాథమికంగా వ్యవసాయంపైనే ఆధారపడ్డాయి. 70 శాతం కమతాలు చిన్న, సన్నకారు రైతులకు చెందినవే. చాలా మంది రైతులు శీతోష్ణస్థితి మార్పు ప్రభావాలకు లోనయ్యే ముప్పును ఎదుర్కొంటున్నారు. ముప్పులపై అవగాహన కార్యక్రమాలు, ఆధునిక వనరులు, ప్రభుత్వ పథకాలకు తగినంత చేరువ కాలేకపోతున్నారు.
ఈ తరహా ఒప్పందాల్లో ఇదే మొదటిది. ఇది సామాజిక చేకూర్పును అందించడంలో, భారతీయ వ్యవసాయంలో డిజిటల్ పరివర్తనలో తెలంగాణను ముందువరుసలో నిలబెట్టనుంది. మొత్తం మీద ఇది ఆర్థిక సాధికారికత, వాల్యూ చెయిన్లో వినూత్నత, వృద్ధి, ఉపాధి అవకాశాల కల్పన వంటి అంశాల్లో ప్రభుత్వ ఆశయాలకు అండగా నిలువనుంది.
రాష్ట్ర ప్రభుత్వ విభాగమైన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ ఈ పరిష్కారాన్ని అమలు చేసేందుకు బాధ్యత వహించనుంది. వ్యవసాయ విభాగం దీన్ని క్షేత్రస్థాయిలో అమలు చేయనుంది. ఈ కార్యక్రమం కింద రైతులకు అవసరమైన శిక్షణ, సలహా సేవలను సంస్థ రైతులకు అందిస్తుంది. అదే విధంగా సమాచార సేకరణ, ఇతర కార్యకలాపాలను నిర్వర్తించనుంది. దానికి తోడుగా, ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ స్టేట్ అగ్రికల్చరల్ యూనివర్సిటీ పరిశోధనా కేంద్రాలు ఆయా పంటలకు, శీతోష్ణస్థితి పరిస్థితులకు సంబంధించి సలహాలు, సూచనలను వింగ్ స్యూర్ వేదిక ద్వారా అందించనున్నాయి.