కోల్కతా: పశ్చిమబెంగాల్లో అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెల్లడైన అనంతరం చెలరేగిన హింసతో బాధితులుగా మారిన వారికి పునరావాసం కల్పించడానికి సంబంధించి కోల్కతా హైకోర్టు సోమవారం త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేసింది. రాష్ట్ర మానవ హక్కుల కమిషన్, జాతీయ మానవ హక్కుల కమిషన్, మెంబర్ సెక్రెటరీ అండ్ స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ నుంచి ఒక్కొక్కరు ఈ కమిటీలో ఉంటారు.
బాధితులు తమకు హక్కులు కలిగిన ప్రాంతాల్లో ఉండేందుకు వీలుగా పోలీసుల సమన్వయంతో కమిటీ తగిన ఏర్పాట్లు చేస్తుందని కోర్టు పేర్కొన్నది. ఎన్నికల అనంతర హింసపై విచారణ కోరుతూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై కోల్కతా హైకోర్టుకు చెందిన ఐదుగురు న్యాయమూర్తుల విస్తృత ధర్మాసనం విచారణ జరిపింది. మే 2న అసెంబ్లీ ఎన్నికల ఫలితాల అనంతరం వివిధ ప్రాంతాల్లో హింస చెలరేగింది. పలువురు తమ నివాసాలు విడిచి పునరావాస కేంద్రాల్లో తలదాచుకున్నారు.