రాష్ట్రంలో లాక్డౌన్ కారణంగా పది రోజులపాటు వ్యవసాయ, వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లు నిలిపివేస్తున్నట్టు అధికారులు తెలిపారు. ఇప్పటికే స్లాట్బుక్ చేసుకున్నవారికి రీషెడ్యూల్ అవకాశం కల్పిస్తామని చెప్పారు. లాక్డౌన్ అనంతరం వీటిపై మార్గదర్శకాలు జారీ చేస్తామని వెల్లడించారు. ప్రజలెవరూ తాసిల్దార్, సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్లకు రావొద్దని సూచించారు.
లాక్డౌన్ సడలింపు సమయంలో రాష్ట్రంలో వైన్షాపులు, బార్లను తెరిచి ఉంచాలని ఎైక్సెజ్శాఖ నిర్ణయించింది. ఉదయం 6 నుంచి 10 గంటల వరకు మద్యంషాపులు తెరిచి ఉంచవచ్చని ఆ శాఖ కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్ మంగళవారం ఉత్తర్వులిచ్చారు. షాపుల వద్ద భౌతికదూరం పాటించేలా చూడాలని సూచించారు.
లాక్డౌన్ నేపథ్యంలో రాష్ట్రంలోని ప్రముఖ ఆలయాలను బుధవారం నుంచి మూసివేయనున్నారు. యాదాద్రి, వేములవాడ దేవస్థానాలతోపాటు ప్రముఖ ఆలయాల్లో ఈ నెల 12 నుంచి 22 వరకు భక్తులకు దర్శనాలను రద్దుచేశారు.
హైదరాబాద్, మే 11 (నమస్తే తెలంగాణ): కరోనా మహమ్మారి సెకండ్వేవ్ను కట్టడి చేసేందుకు రాష్ట్రంలో లాక్డౌన్ విధించారు. మే 12వ తేదీ బుధవారం ఉదయం 10 గంటల నుంచి పది రోజులపాటు లాక్డౌన్ అమలుచేయాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించింది. లాక్డౌన్ కాలంలో ప్రతిరోజూ ఉదయం 6 నుంచి 10 గంటల వరకు ప్రజల అవసరాల కోసం సడలింపు ఉంటుంది. ఆ 4 గంటలపాటు మాత్రమే అన్నిరకాల షాపులు తెరిచి ఉంటాయి. మిగతా 20 గంటలపాటు లాక్డౌన్ కఠినంగా అమల్లో ఉంటుంది. కరోనా సెకండ్వేవ్ విజృంభిస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో ఏమిచేయాలన్న అంశంపై నిర్ణయం తీసుకోవడానికి ప్రగతిభవన్లో మంగళవారం మధ్యాహ్నం 2 గంటలకు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గం సమావేశమైంది. కరోనా తీవ్రతను తగ్గించాలంటే లాక్డౌన్ కూడా అమలుచేయాలని నిర్ణయం తీసుకున్నది. అయితే నిత్యావసరాల కోసం ప్రతి రోజు ఉదయం 6 గంటల నుంచి ఉదయం 10 గంటల వరకు అన్ని కార్యకలాపాలకు అనుమతి ఇచ్చింది.
రాష్ట్రంలో 18 ఏండ్లు పైబడిన అందరికీ టీకా వేయాలని క్యాబినెట్ నిర్ణయించింది. వ్యాక్సిన్ల కొరత రాకుండా టీకాల కొనుగోలుకు గ్లోబల్ టెండర్లను పిలవాలని రాష్ట్ర క్యాబినెట్ నిర్ణయం తీసుకున్నది. లాక్డౌన్ పాటించే ఈ పదిరోజుల్లో రాష్ట్రంలో మందుల కొరత రాకుండా చూడాలని తీర్మానించింది. ఈ మేరకు మందులు, వ్యాక్సిన్ల సరఫరా కోసం మంత్రి కే తారకరామారావు అధ్యక్షతన టాస్క్ఫోర్స్ కమిటీని ఏర్పాటు చేసింది. కరోనా కట్టడి కోసం అన్ని జిల్లాల్లో మంత్రుల అధ్యక్షతన కలెక్టర్, డీఎంహెచ్వో, జిల్లా కేంద్రంలోని దవాఖాన సూపరింటెండెంట్, డ్రగ్ ఇన్స్పెక్టర్లతో కమిటీ వేయాలని నిర్ణయించింది. మంత్రులు ప్రతి రోజు జిల్లాకేంద్రాల్లో సమీక్షచేయాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. ఇదే సమయంలో వ్యవసాయం, దాని అనుబంధ కార్యక్రమాలు యథావిధిగా జరుగడానికి క్యాబినెట్ అనుమతి ఇచ్చింది. ధాన్యం కొనుగోళ్లు ఎట్టి పరిస్థితుల్లోనూ ఆపకూడదని నిర్ణయించింది. వైద్యరంగంలో పనిచేసే డాక్టర్లు, సిబ్బంది, మెడికల్ ఏజెన్సీలు, మెడికల్షాపుల కార్యకలాపాలకు అనుమతిచ్చింది.
ఉదయం ఆరుగంటల నుం చి ఉదయం 10 గంటల మధ్య.. నాలుగుగంటల కాలంలో మెట్రో, ఆర్టీసీ రవాణాకు క్యాబినెట్ అనుమతి ఇచ్చింది. ప్రభుత్వరంగంతోపాటు ప్రైవేట్రంగంలో కూడా రెమ్డెసివిర్ ఇంజెక్షన్లు, ఆక్సిజన్, ఇతర కరోనా ఔషధాలను అందుబాటులోకి తేవాలని, వీటి కొరత రాకుండా చూడాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్ను క్యాబినెట్ ఆదేశించింది. రెమ్డెసివిర్ ఇంజెక్షన్ ఉత్పత్తిదారులతో క్యాబినెట్ సమావేశంనుంచే ఫోన్లో మాట్లాడిన ముఖ్యమంత్రి కేసీఆర్.. రాష్ట్రానికి తగినన్ని మందులను సరఫరాచేయాలని కోరారు. ఏ రోజుకారోజు మందులు, వ్యాక్సిన్లను వేగవంతంగా సమకూర్చి, సరఫరా చేయడం కోసం పరిశ్రమలశాఖ మంత్రి కేటీఆర్ అధ్యక్షతన రాష్ట్రస్థాయి టాస్ఫోర్స్ నియామకానికి క్యాబినెట్ ఆమోదంతెలిపింది. పరిశ్రమలశాఖ ముఖ్యకార్యదర్శి జయేశ్రంజన్, జీఏడీ ప్రిన్సిపల్ సెక్రటరీ వికాస్రాజ్, పంచాయతీరాజ్ ముఖ్య కార్యదర్శి సందీప్ సుల్తానియా, సీఎంవో నుంచి సీఎం కార్యదర్శి, కొవిడ్ ప్రత్యేకాధికారి రాజశేఖర్రెడ్డి ఈ టాస్ఫోర్స్లో సభ్యులుగా ఉంటారు. మినహాయింపులను పూర్తిస్థాయిలో కొవిడ్ నిబంధనలను కఠినంగా పాటించేలా చర్యలు తీసుకోవాలని డీజీపీని క్యాబినెట్ ఆదేశించింది. 10 రోజుల లాక్డౌన్లో వచ్చే ఫలితాలపై ఆధారపడి తదుపరి నిర్ణయం తీసుకోవడానికి ఈ నెల 20న మరోసారి సమావేశం కావాలని నిర్ణయించింది.
నిషేధిత జాబితా: సినిమాహాళ్లు, అమ్యూజ్మెంట్ పార్కులు, క్లబ్లు, స్విమ్మింగ్పూల్స్, జిమ్లు పూర్తిగా మూసివేయాలి.