హైదరాబాద్: మంత్రివర్గం నిర్ణయం మేరకు రాష్ట్రంలో ప్రభుత్వ భూముల అమ్మకానికి సర్కార్ మార్గదర్శకాలు ఖరారు చేసింది. వివిధ శాఖల వద్ద ఖాళీగా ఉన్న భూముల విక్రయం కోసం నిర్ధిష్ట నిర్వహణ విధానాన్ని ప్రభుత్వం అనుసరించనుంది. అమ్మే భూములకు సంబంధించి ఎలాంటి న్యాయపరమైన చిక్కులు లేకుండా చూడాలని కలెక్టర్లను ప్రభుత్వం ఆదేశించింది. విక్రయించే భూములను మల్టీపర్పస్ జోన్గా ప్రకటించాలని సూచించింది. అవసరమైన అన్ని రకాల అనుమతులు ఇవ్వాలని ఆదేశించింది.
భూముల విక్రయం కోసం వివిధ కమిటీలను ఏర్పాటు చేసింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అధ్యక్షతన స్టీరింగ్ కమిటీ ఏర్పాటైంది. న్యాయపరమైన చిక్కులు లేకుండా చూసేందుకు ల్యాండ్స్ కమిటీ, భూములకు అనుమతుల కోసం అప్రూవల్ కమిటీ, భూముల అమ్మకం పర్యవేక్షణ కోసం ఆక్షన్ కమిటీ ఏర్పాటు చేశారు. నోడల్ శాఖ భూమి ధరను నిర్ణయించి ఈ-వేలం ప్రక్రియ నిర్వహించనుంది. భూముల అమ్మకాల్లో పారదర్శకత ఉండాలన్న ఉద్దేశంతో ‘ఈ-వేలం’ ద్వారా విక్రయాలు చేయనున్నారు.