హైదరాబాద్ : రాష్ట్రంలోని లా కాలేజీల్లో న్యాయ విద్య ప్రవేశాల కోసం నిర్వహించే లాసెట్ దరఖాస్తుల గడువును ప్రభుత్వం మరోసారి పొడిగించింది. ఆలస్య రుసుము లేకుండా జూలై 5 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని సూచించింది. ఆసక్తి గల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచించారు. మూడు, ఐదేండ్ల న్యాయ, రెండేండ్ల ఎల్ఎల్ఎం కోర్సుల్లో అడ్మిషన్స్ కోసం ఏటా లాసెట్, పీజీ లాసెట్ను నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ ప్రవేశపరీక్ష ద్వారా మూడేండ్ల ఎల్ఎల్బీ, ఐదేండ్ల ఇంటిగ్రేటెడ్ ఎల్ఎల్బీ కోర్సులైన బీఏ ఎల్ఎల్బీ, బీబీఏ ఎల్ఎల్బీ, బీకామ్ ఎల్ఎల్బీ, బీఎస్సీ ఎల్ఎల్బీలో, రెండేండ్ల పీజీ లా కోర్సులైన ఎల్ఎల్ఎంలో ప్రవేశాలు కల్పిస్తారు. రాష్ట్రంలో మొత్తం 21 లా కాలేజీలు ఉన్నాయి.