హైదరాబాద్/ సిటీబ్యూరో, సెప్టెంబర్ 21 (నమస్తే తెలంగాణ): ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డ్రోన్ టెక్నాలజీ, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (ఐవోటీ), మిషన్ లెర్నింగ్.. బిగ్డాటా, బ్లాక్చైన్ టెక్నాలజీ.. క్లౌడ్ కంప్యూటింగ్.. ఇవన్నీ ప్రస్తుతం బాగా ప్రాచుర్యం ఉన్న కోర్సులు. ఐటీ రంగంలో వీటిని ఎమర్జింగ్ టెక్నాలజీగా పేర్కొంటున్నారు. ఇంజినీరింగ్ విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్తు అందించే కోర్సులివి. ఇప్పుడిప్పుడే యూనివర్సిటీలు, కాలేజీలు ఈ కోర్సులపై దృష్టి సారిస్తున్నాయి. ఎమర్జింగ్ టెక్నాలజీని వినియోగించడంలో దేశంలోనే తెలంగాణ ముందువరుసలో నిలుస్తున్నది. తొలినాళ్లలోనే వీటి ప్రాధాన్యాన్ని గుర్తించిన మంత్రి కేటీఆర్ అందుకు అనుగుణంగా ఐటీశాఖను సన్నద్ధంచేశారు. నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవడంలో ప్రభుత్వం ప్రదర్శిస్తున్న మెరుపువేగానికి డ్రోన్ల ద్వారా మందుల పంపిణీయే నిదర్శనం. ఇటీవల వికారాబాద్ జిల్లాలో మారుమూల ప్రాంతాలకు డ్రోన్ ద్వారా ఔషధాలను పంపిణీచేసే పైలట్ ప్రాజెక్టును కేంద్ర పౌరవిమానయానశాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియాతోరాష్ట్ర ప్రభుత్వం ప్రారంభింపజేసింది. ఇలాంటి ప్రయోగం దేశంలోనే మొదటిది.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)ను వినియోగించడంలో రాష్ట్ర పోలీసులు ముందున్నారు. వినాయకచవితి ఉత్సవాలు, వివిధ పండుగలు, సభలు, సమావేశాలు, అంతర్జాతీయ క్రికెట్మ్యాచ్ సందర్భాలలో రద్దీ నియంత్రించేందుకు ఏఐ టెక్నాలజీని వినియోగిస్తున్నారు. ఆయా ప్రాంతాల్లోని వీడియో ఫుటేజీని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీతో అనుసంధానం చేసి రద్దీని నియంత్రించగలుగుతున్నారు. మాస్క్లేనివారిని కూడా ఈ టెక్నాలజీతో గుర్తిస్తున్నారు.
బ్లాక్చైన్ టెక్నాలజీని వినియోగించడంలోనూ తెలంగాణ ముందున్నది. అన్ని విద్యాసంస్థల్లో సర్టిఫికెట్ల జారీని పూర్తిగా డిజిటలైజేషన్ చేయడంతోపాటు బ్లాక్చైన్ టెక్నాలజీ సహకారంతో నకిలీపత్రాలు జారీ చేసే అవకాశం లేకుండా చేస్తున్నది. సైబర్సెక్యూరిటీ, స్త్రీనిధి లావాదేవీల్లోనూ బ్లాక్చైన్ టెక్నాలజీని వినియోగిస్తున్నారు.
రాష్ట్రం ఏర్పడిన తొలినాళ్లలోనే మంత్రి కేటీఆర్ ఎమర్జింగ్ టెక్నాలజీ విభాగాన్ని ఏర్పాటుచేశారు. బ్లాక్చైన్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డ్రోన్ అండ్ రోబోటిక్స్, క్లౌడ్, బిగ్డేటా, స్పేస్ టెక్నాలజీ, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, అడిటివ్ మ్యానుఫాక్చరింగ్ వంటి ఎనిమిది రంగాలను భవిష్యత్తు ఉన్న టెక్నాలజీలుగా ఐటీశాఖ గుర్తించింది. మంత్రి కేటీఆర్ 2020 సంవత్సరాన్ని ఏఐ ఇయర్గా ప్రకటించిన నేపథ్యంలో నాస్కాంతో కలిసి ఫ్రేమ్వర్క్ను రూపొందించారు. బలమైన భాగస్వామ్యం కోసం ఇంటెల్, ఎన్విడియా, వరల్డ్ ఎకనమిక్ ఫోరం, నాస్కామ్, ఐఐటీ వంటి సంస్థలతో జట్టుకట్టారు.
ఉపాధి అవకాశాలున్న ఎమర్జింగ్ టెక్నాలజీ కోర్సులపై అవగాహన కల్పించడం, యువతలో నైపుణ్యాలు పెంపొందించడం, అవకాశాలు అందిపుచ్చుకునేలా తోడ్పాటునివ్వడం వంటి లక్ష్యాలతో ఎమర్జింగ్ టెక్నాలజీస్ విభాగం పనిచేస్తున్నది. దేశంలో ఇలాంటి ప్రత్యేక విభాగం ఎక్కడా లేదు.
వివిధ విభాగాల్లో ఎమర్జింగ్ టెక్నాలజీలను వినియోగించడానికి వీలుగా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా పాలసీలు, ఫ్రేమ్వర్క్లు రూపొందిస్తున్నది. ఇప్పటికే క్లౌడ్ అడాప్షన్ ఫ్రేమ్వర్క్-2020, ఏఐ ఫ్రేమ్వర్క్-2020, డ్రోన్ ఫ్రేమ్వర్క్-2019, బ్లాక్చైన్ ఫ్రేమ్వర్క్-2019 ఇలా వివిధ ఫ్రేమ్వర్క్లు తీసుకొచ్చింది. ఆయా టెక్నాలజీలను వివిధరంగాల్లో ఏ విధంగా వినియోగించాలో ఐటీ నిపుణుల ద్వారా మార్గనిర్దేశం చేస్తూ అమలుచేస్తున్నది.