కరీంనగర్ : చేనేత కార్మికుల సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం ఎంతగానో కృషి చేస్తున్నదని సంక్షేమ శాఖల మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా ఇవాళ కరీంనగర్ కలెక్టరేట్ ఆడిటోరియంలో నిర్వహించిన సమావేశానికి మంత్రి గంగుల కమలాకర్తో కలిసి ఆయన హాజరై మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ అన్నివర్గాల సంక్షేమానికి కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. మగ్గాలపై ఆధారపడి జీవిస్తున్న నేత కార్మికుల అభ్యున్నతికి తెలంగాణ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నదని అన్నారు.
చేనేత కార్మికులకు విద్యుత్, రుణాల సబ్సిడీ, ఓనర్ టు వర్కర్, మరమగ్గాల కార్మికులకు ఆర్థికసాయం ఇతర సౌకర్యాలు కల్పించిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుందని అన్నారు. చేనేత కార్మికులకు ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో దసరా, రంజాన్, క్రిస్టమస్ పండుగలకు కార్మికుల వద్ద ప్రభుత్వం దుస్తులను కొనుగోలు చేసి పేదలకు పంపిణీ చేస్తున్నదని గుర్తు చేశారు. చేనేత కార్మికుల అభ్యున్నతికి ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి అన్నారు. అనంతరం పలువురు చేనేత కార్మికులను మంత్రులు సన్మానించారు. సమావేశంలో మేయర్ వై సునీల్ రావు, కలెక్టర్ ఆర్వీ కర్ణన్, జేసీ శ్యామ్ ప్రసాద్ లాల్, నాయకులు వాసాల రమేష్, మెతుకు సత్యం తదితరులు పాల్గొన్నారు.