హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వం మహిళలకు అన్నిరంగాల్లో సముచిత ప్రాధాన్యం కల్పిస్తున్నదని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. సోమవారం అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మల్లారెడ్డి ఎడ్యుకేషన్ ఇన్స్స్టిట్యూట్లో నిర్వహించిన వేడుకలకు పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి వాణీదేవితోపాటు మంత్రి మల్లారెడ్డితో కలిసి ఆమె హాజరయ్యారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో కవిత మాట్లాడుతూ.. స్త్రీలు, పురుషులు సమానమనే భావనతో అందరికీ రాజ్యాంగం ఓటుహక్కు కల్పించారని అన్నారు.చాలామంది నారీమణుల పోరాటాల ఫలితాలు ఇప్పుడు కనిపిస్తున్నాయని పేర్కొన్నారు.
అణచివేత, ఆంక్షల నుంచి ఎలా ఉండాలో నిర్ణయించుకునే స్థాయికి మహిళలు ఎదిగారని అన్నారు. మహిళల అభివృద్ధితోనే దేశాభివృద్ధి సాధ్యమని ఆమె పేర్కొన్నారు. మహిళలు అన్నిరంగాల్లో రాణిస్తున్నారని, ప్రముఖ ఐటీ సంస్థల్లో 25 శాతం మంది ఉద్యోగులు మహిళలేనని గుర్తుచేశారు. గొంతెత్తితే 365 రోజులు మనవేనని అన్నారు. బాలికల విద్య కోసం తెలంగాణ ప్రభుత్వం అనేక పాఠశాలను ప్రారంభించిందని చెప్పారు. చిన్నవయసులో పెళ్లిళ్లు చేసే సంస్కృతి రాష్ట్రంలో తగ్గిందన్నారు. 18 ఏండ్లలోపు వివాహం చేసుకున్న వారికి కల్యాణలక్ష్మి పథకాన్ని వర్తింపజేయొద్దని సీఎం ఆదేశించారంటే ఆయన ఎంత సుదీర్ఘంగా ఆలోచిస్తారో తెలుస్తున్నదని అన్నారు. చదువుకున్న ప్రతి ఒక్కరూ ఓటుహక్కు వినియోగించుకోవాలని కవిత సూచించారు.