రాష్ట్రంలోని పది విశ్వ విద్యాలయాలకు వైస్చాన్స్లర్లను ప్రభుత్వం ఖరారు చేసింది. రాష్ట్ర ప్రభుత్వం సిఫారసు చేసిన పేర్లను గవర్నర్ తమిళిసై సౌందర్రాజన్ శనివారం ఆమోదించారు. వీసీల పేర్లను ప్రకటిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
హైదరాబాద్, మే 22 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని పది యూనివర్సిటీలకు ఉపకులపతులను నియమించారు. వీసీల నియామకాన్ని ఖరారు చేస్తూ గవర్నర్ తమిళిసై సౌందర్రాజన్ ఆమోద ముద్ర వేయడంతో ప్రభుత్వం వర్సిటీల వారీగా జీవోలు జారీ చేసింది. ఉస్మానియా విశ్వవిద్యాలయ వీసీగా డీ రవీందర్, అంబేద్కర్ ఓపెన్ వర్సిటీకి కే సీతారామారావు, శాతవాహన వర్సిటీ వీసీగా ఎస్ మల్లేశం, మహాత్మాగాంధీ యూనివర్సిటీ వీసీగా సీహెచ్ గోపాల్రెడ్డి, పాలమూరు వర్సిటీ వీసీగా ఎల్బీ లక్ష్మీకాంత్ రాథోడ్, తెలంగాణ యూనివర్సిటీకి ఉపకులపతిగా డాక్టర్ డీ రవీందర్గుప్తా, జేఎన్ఏఎఫ్యూ వీసీగా కవిత దర్యాని, కాకతీయకు తాటికొండ రమేశ్, తెలుగు వర్సిటీ వైస్చాన్స్లర్గా కిషన్రావు, జేఎన్టీయూ వీసీగా కట్టా నర్సింహారెడ్డి పేర్లను ప్రభుత్వం ప్రకటించింది. వీసీలు మూడేండ్ల పాటు పదవిలో కొనసాగనున్నారు.
ఉస్మానియా యూనివర్సిటీ వైస్చాన్సలర్గా అదే యూనివర్సిటీలో పనిచేస్తున్న ప్రొఫెసర్ రవీందర్ యాదవ్ నియమితులయ్యారు. జనగామ జిల్లా వడ్లకొండకు చెందినవారు. ఉస్మానియా పొలిటికల్ సైన్స్ ఫ్యాకల్టీగా చేరిన ఆయన 30 ఏండ్లకు పైగా బోధనావృత్తిలో కొనసాగారు. ప్రస్తుతం ఆర్ట్స్ కాలేజీ ప్రిన్సిపాల్గా పనిచేస్తున్నారు. రూసా 2.0లో భాగంగా హ్యుమానిటీస్, సోషల్ సైన్సెస్లో 2 రిసెర్చ్ సెంటర్లను నెలకొల్పటంలో కీలకపాత్రను పోషించారు.
బీఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం వైస్ చాన్సలర్గా కుసుంబ సీతారామరావు రెండోసారి నియమితులయ్యారు. వరంగల్ జిల్లాకు చెందిన ఆయన కాకతీయ యూనివర్సిటీలో సుదీర్ఘకాలం ప్రొఫెసర్గా పనిచేశారు. తెలంగాణ ఉద్యమ కాలంలో ఆయన ప్రొఫెసర్ జయశంకర్తో పాటు తెలంగాణవ్యాప్తంగా పర్యటించారు. 37 ఏండ్ల పాటు బోధనావృత్తిలో ఉన్న ఆయన మార్గదర్శనంలో పలువురు పీహెచ్డీ పట్టాలు పుచ్చుకొన్నారు.
పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం నూతన వైస్చాన్సలర్గా కిషన్రావు నియమితులయ్యారు. కరీంనగర్ జిల్లాకు చెందిన ఆయన భువనగిరి డిగ్రీ కళాశాల నుంచి ఉపన్యాసకుడిగా బోధన రంగంలోకి ప్రవేశించారు. ఓయూ అకడమిక్ సెల్ డైరెక్టర్గా, స్టూడెంట్ వెల్ఫేర్ డీన్గా బాధ్యతలను నిర్వర్తించారు. తెలుగు విశ్వవిద్యాలయం సలహామండలి సభ్యులుగా విశేషసేవలను అందించారు. ఓయూ తెలుగుశాఖలో ఆచార్యులుగా ఉద్యోగ విరమణ పొందారు.
తెలంగాణ యూనివర్సిటీ వైస్చాన్సలర్గా డీ రవీందర్గుప్తా నియమితులయ్యారు. యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థానం నారాయణపురానికి చెందిన ఆయన ఉస్మానియా వర్సిటీ నుంచి ఎంఎస్సీ, పీహెచ్డీ పట్టాలు పుచ్చుకొన్నారు. భౌతికశాస్త్రంలో పరిశోధనలు నిర్వహించిన ఆయన ఇప్పటి వరకు 250కి పైగా పరిశోధనపత్రాలను సమర్పించారు. 1989లో ఫిజిక్స్ విభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్గా ఉద్యోగంలో చేరారు. 1994లో బాయ్స్కాస్ట్ ఫెలోషిప్, రాయల్సొసైటీ ఫెలోషిప్, అబ్దుల్ కలాం చేతులమీదుగా యంగ్ సైంటిస్ట్ అవార్డుతో పాటు, యూజీసీ కెరీర్ అవార్డులను సొంతం చేసుకొన్నారు.
జవహార్లాల్ నెహ్రు అర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీ వైస్చాన్సలర్గా కవిత దర్యాని నియమితులయ్యారు. అదే యూనివర్సిటీలో రిజిస్ట్రార్, వైస్చాన్స్లర్గా పనిచేసిన ఆమెను తిరిగి వైస్చాన్సలర్గా నియమించారు. 1985లో జేఎన్టీయూలో లెక్చరర్గా తన ప్రస్థానాన్ని ప్రారంభించారు. జేఎన్ఏఎఫ్ఏయూలో చాయిస్ బేస్ట్ క్రెడిట్ సిస్టం అమలుతో పాటు, విద్యార్థుల సౌకర్యార్థం పలు ల్యాబ్ల ఏర్పాటుకు ఆమె చొరవ తీసుకొన్నారు.
జవహర్లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్సిటీ(జేఎన్టీయూ)-హైదరాబాద్ వైస్చాన్సలర్గా ప్రొఫెసర్ కట్టా నర్సింహారెడ్డి నియమితులయ్యారు. నల్లగొండలోని మహత్మాగాంధీ యూనివర్సిటీ వైస్చాన్సలర్గా పనిచేసిన ఆయన్ను జేఎన్టీయూ వైస్చాన్సలర్గా ప్రభుత్వం నియమించింది. 1980లో ఉస్మానియా యూనివర్సిటీలో ప్రొఫెసర్గా నియమితులై ఫిజిక్స్ విభాగంలో పలు హోదాల్లో పనిచేశారు. ఎంజీ యూనివర్సిటీ వీసీగా నియమితులైన ఆయన సుదీర్ఘకాలం సేవలందించారు.
కాకతీయ యూనివర్సిటీ వీసీగా డాక్టర్ తాటికొండ రమేశ్ను నియమిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఆయన ప్రస్తుతం కేయూ సోషియాలజీ, సోషల్వర్క్ విభాగాధిపతిగా కొనసాగుతున్నారు. వరంగల్కు చెందిన ఆయన 1987లో ఎంఏ సోషియాలజీ పూర్తి చేశారు. అనేక జాతీయ కాన్ఫరెన్స్లు, సదస్సులను నిర్వహించారు. సుమారు 20 వరకు పుస్తకాలను ప్రచురించారు. దాదాపు 3 అంతర్జాతీయ సెమినార్లకు, దాదాపు 60కు పైగా జాతీయ సెమినార్లు, వర్క్షాప్లకు హాజరై సిద్ధాంతపత్రాలను సమర్పించారు. వివిధ పత్రికలకు అనేక వ్యాసాలు రాశారు.
శాతవాహన వర్సిటీ వైస్చాన్సలర్గా రాజన్న సిరిసిల్లా జిల్లాకు చెందిన ప్రొఫెసర్ ఎస్ మల్లేశం నియమితులయ్యారు. వేములవాడ మండలం హన్మాజిపేటకు చెందిన ఆయన ఉస్మానియాలో ఎంఏ ఫిలాసఫీ, జర్మనీలో పీహెచ్డీ పూర్తిచేశారు. కవి దివంగత సీ నారాయణరెడ్డి స్వగ్రామం సైతం హన్మాజిపేటయే కావటం గమనార్హం. 1992 నుంచి ఆర్ట్స్ కాలేజీ, నిజాం కాలేజీల్లో అధ్యాపకుడిగా పనిచేశారు. ఆర్ట్స్ కాలేజీ ప్రిన్సిపాల్గాను సేవలందిచారు. ఇంటర్నేషనల్ జర్మనీ ఫెలోషిప్ను సైతం ఆయన సొంతం చేసుకొన్నారు.
మహత్మాగాంధీ యూనివర్సిటీ వీసీగా ప్రొఫెసర్ సీహెచ్ గోపాల్రెడ్డిని ప్రభుత్వం నియమించింది. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ మండలం పొతిరెడ్డిపేటకు చెందిన ఆయన 1990లో ఉస్మానియా ఫిజిక్స్ విభాగంలో ఫ్యాకల్టీగా చేరిన ఆయన, ప్రస్తుతం ఉస్మానియా రిజిస్ట్రార్గా వ్యవహరిస్తున్నారు. ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ అసొసియేషన్ జీవితకాల సభ్యుడిగాను కొనసాగుతున్నారు.
మహబూబ్నగర్లోని పాలమూరు యూనివర్సిటీ వీసీగా ప్రొఫెసర్ ఎల్బీ లక్ష్మీకాంత్ రాథోడ్ నియమితులయ్యారు. ప్రస్తుతం నిజాం కాలేజీ ప్రిన్సిపాల్గా పనిచేస్తున్న ఆయనది మహబూబ్నగర్ జిల్లాయే. ఫిజికల్ ఎడ్యుకేషన్ అధ్యాపకుడిగా ఉద్యోగంలో చేరిన ఆయన మొత్తం 27 ఏండ్లపాటు వివిధ హోదాల్లో సేవలందించారు. ఆయన మార్గదర్శనంలో 11 మంది పీహెచ్డీలు, 8 మంది ఎంఫిల్ పూర్తిచేశారు.