హైదరాబాద్ : దళిత బంధు పథకం లబ్ధిదారులకు దళిత బీమాను సైతం వర్తింపజేసే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు సీఎం కేసీఆర్ తెలిపారు. రైతుబీమా మాదిరి పటిష్టమైన వ్యవస్థను ఏర్పాటు చేసి దళిత బీమాను అమలు చేస్తామని ఆయన పేర్కొన్నారు. మంత్రులు, దళిత ప్రజాప్రతినిధులు, ఎస్సీ డెవలప్మెంట్ ఉన్నతాధికారులు దళిత బీమా కార్యాచరణపై కసరత్తు చేయాలని సీఎం సూచించారు. ఆమోదయోగ్యమైన కార్యాచరణ రూపొందించుకుని.. కొంచెం ఆలస్యమైనా దళిత బీమాను అమలు చేసుకుందామని అన్నారు. సీఎం కేసీఆర్ అధ్యక్షతన దళిత బంధు పథకం అమలుపై హుజూరాబాద్ నియోజకవర్గంలోని దళిత ప్రతినిధులతో ప్రగతి భవన్లో జరిగిన అవగాహన సదస్సు జరిగింది. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడారు. దళితబంధు పథకం అమలు సందర్భంగా 3 దశలు పాటించాలని సూచించారు. దళితుల అసైన్డ్, గ్రామకంఠం సహా భూసమస్యలన్నీ పరిష్కరించాలని చెప్పారు. దళితవాడల్లో మౌలిక వసతులు సంపూర్ణంగా మెరుగుపర్చాలని అధికారులను ఆదేశించారు.