తెలంగాణ రాష్ట్ర అవతరణ వేడుకలు బుధవారం నగరవ్యాప్తంగా నిరాడంబరంగా జరిగాయి. కరోనా నేపథ్యంలో ప్రభుత్వ, ప్రభుత్వ రంగ సంస్థల్లో ఎలాంటి హంగు ఆర్భాటం లేకుండా జాతీయ పతకాలను ఆవిష్కరించారు. మంత్రులు, కలెక్టర్లు, ఇతర ఉన్నతాధికారులు తెలంగాణ అమరులకు నివాళులర్పించారు. సరూర్నగర్ ఇండోర్ స్టేడియంలో అమరవీరుల స్తూపం వద్ద విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి, ఎమ్మెల్సీలు అంజలి ఘటించారు.
రాష్ట్ర అవతరణ వేడుకలు అంబరాన్నంటాయి. తెలంగాణ ఆవిర్భవించి ఏడేండ్లు పూర్తయిన సందర్భంగా గ్రేటర్ వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, ప్రభుత్వ రంగ సంస్థల్లో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. రాష్ట్ర పోరులో అమరులైన వారికి ఘనంగా నివాళులర్పించారు. కరోనా నేపథ్యంలో అన్ని ప్రాంతాల్లో వేడుకలు నిరాడంబరంగా జరిగాయి. కొవిడ్ నిబంధనలు పాటిస్తూ జెండా వందనం, పోలీసు పరేడ్ నిర్వహించారు. తెలంగాణ మహనీయుల పోరాటాన్ని స్మరించుకున్నారు.
ఆర్కేపురం, జూన్ 2 : ఏడేండ్లలో నూతన తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి వైపు దూసుకుపోతున్నదని విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి అన్నారు. రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు బుధవారం సరూర్నగర్ ఇండోర్ స్టేడియంలో నిర్వహించగా, మంత్రి హాజరై అమరవీరుల స్తూపానికి నివాళులర్పించారు. రాష్ట్ర సాధన కోసం అసువులుబాసిన వారి త్యాగాలను స్మరించుకున్నారు. ఈ కార్యక్రమంలో రంగారెడ్డి కలెక్టర్ అమోయ్కుమార్, జాయింట్ కలెక్టర్ ప్రతీక్జైన్, జడ్పీ చైర్పర్సన్ తీగల అనితారెడ్డి, ఎమ్మెల్సీలు సురభి వాణీదేవి, బొగ్గారపు దయానంద్గుప్త, యెగ్గే మల్లేశం, అధికారులు, టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.
మేడ్చల్, జూన్ 2(నమస్తే తెలంగాణ) : మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా కలెక్టరేట్లో రాష్ట్ర అవతరణ వేడుకలు ఘనంగా జరిగాయి. కార్మికశాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి, అనంతరం పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. కార్యక్రమంలో సైబరాబాద్ పోలీసు కమిషనర్ సజ్జనార్, మల్కాజిగిరి డీసీపీ రక్షిత కృష్ణమూర్తి, అదనపు కలెక్టర్లు ఏనుగు నర్సింహారెడ్డి, శ్యాంసన్, అధికారులు పాల్గొన్నారు.