హైదరాబాద్, ఆగస్టు 18 (నమస్తే తెలంగాణ): మారుమూల ప్రాంతాలకు కూడా టెర్షియరీ సేవలు అందించాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకున్న నిర్ణయాలు రాష్ట్రంలో వైద్యారోగ్యాన్ని పటిష్ఠం చేయడంతోపాటు, వైద్యవిద్య అభ్యసించాలనుకొనేవారికి వరంగా మారుతున్నాయి. దేశంలో అత్యధిక మెడికల్ సీట్లున్న రాష్ర్టాల్లో తెలంగాణ ఆరోస్థానం నుంచి ఐదో స్థానానికి చేరబోతున్నది. రాష్ట్రంలో కొత్తగా 7 మెడికల్ కాలేజీల ఏర్పాటు ప్రక్రియ వేగంగా జరుగుతుండగా, రామగుండంలో సింగరేణి మెడికల్ కాలేజీ ఏర్పాటుకు చర్యలు తీసుకొంటున్నారు. మరో రెండు ప్రైవేటు మెడికల్ కాలేజీలు రానున్నట్టు వైద్యవిద్య విభాగం అధికారులు తెలిపారు. ఈ పది కాలేజీలు వచ్చే విద్యాసంవత్సరం నుంచి అందుబాటులోకి వస్తాయి. ఒక్కో కాలేజీలో 150 సీట్ల చొప్పున 1,500 ఎంబీబీఎస్ సీట్లు అందుబాటులోకి రానున్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో 11 ప్రభుత్వ, 23 ప్రైవేటు మెడికల్ కాలేజీలున్నాయి. కొత్తవాటితో మొత్తం కాలేజీల సంఖ్య 44కు చేరనున్నది. ప్రస్తుతం ఉన్న 5,240 మెడికల్ సీట్లకు అదనంగా వచ్చే 1,500 కలిసి 6,740 ఎంబీబీఎస్ సీట్లు వచ్చే ఏడాది అందుబాటులో ఉంటాయి. నేషనల్ మెడికల్ కౌన్సిల్ వెల్లడించిన వివరాల ప్రకారం కర్ణాటకలో అత్యధికంగా మెడికల్ కాలేజీలున్నాయి. ఈ రాష్ట్రంలో 9,345 ఎంబీబీఎస్ సీట్లున్నాయి. సీట్లపరంగా ఆ తర్వాత స్థానాల్లో మహారాష్ట్ర, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, గుజరాత్ కొనసాగుతున్నాయి. ఆరోస్థానంలో తెలంగాణ ఉన్నది. కొత్త కాలేజీలు ప్రారంభమైతే గుజరాత్ను వెనక్కు నెట్టి ఐదో స్థానానికి చేరుతుంది.
ఏడేండ్లలో 12 మెడికల్ కాలేజీలు
ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణలో కాకతీయ, ఉస్మానియా, గాంధీ, రిమ్స్, నిజామాబాద్ మెడికల్ కాలేజీలే ఉన్నాయి. స్వరాష్ట్రంలో నల్లగొండ, సూర్యాపేట, సిద్దిపేట, మహబూబ్నగర్లో కొత్తగా మెడికల్ కాలేజీలు ఏర్పాటయ్యాయి. బీబీనగర్ ఎయిమ్స్, సనత్నగర్ ఈఎస్ఐ దవాఖానలు వీటికి అదనం. వచ్చే ఏడాది భద్రాద్రి కొత్తగూడెం, సంగారెడ్డి, మహబూబాబాద్, మంచిర్యాల, నాగర్కర్నూల్, జగిత్యాల, వనపర్తి, రామగుండంలో కొత్త మెడికల్ కాలేజీల ప్రారంభమవుతాయి. ఈ ఏడేండ్లలో 12 మెడికల్ కాలేజీల ఏర్పాటు దేశంలో ఎక్కడా లేదని వైద్య అధికారులు చెప్పారు.
ఎన్ఎంసీ ప్రకారం మెడికల్ కాలేజీలు, సీట్ల వివరాలు (05.03.2021) నాటికి..
రాష్ట్రం మెడికల్ కాలేజీలు ఎంబీబీఎస్ సీట్లు
కర్ణాటక 60 9,345
మహారాష్ట్ర 57 9,000
తమిళనాడు 52 8,000
ఉత్తరప్రదేశ్ 57 7,428
గుజరాత్ 31 5,700
తెలంగాణ 34 5,240