ప్రైవేట్ స్కూళ్ల టీచర్లు, సిబ్బందికి కరోనా కష్టకాలంలో ఆపన్నహస్తం అందించిన రాష్ట్ర ప్రభుత్వం.. వారికి అందే సాయం కూడా అత్యంత గౌరవప్రదంగా ఉండేలా చర్యలు తీసుకుంటున్నది. ఎలాంటి ఇబ్బంది లేకుండా రెండు వేల ఆర్థిక సాయాన్ని నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లోనే జమచేయాలని నిర్ణయించింది. అంతేకాదు.. వారికి ఇచ్చే రేషన్ బియ్యం 25 కిలోలూ సన్నబియ్యం అందించి వారి మర్యాదను కాపాడుతున్నది.
హైదరాబాద్, ఏప్రిల్ 9 (నమస్తే తెలంగాణ): కరోనాతో స్కూళ్లు మూతపడటంతో కష్టాలు ఎదుర్కొంటున్న ప్రైవేటు పాఠశాలల ఉపాధ్యాయులు, సిబ్బందిని ఆదుకోవడానికి ముందుకొచ్చిన రాష్ట్రప్రభుత్వం వీరికి రేషన్ దుకాణాల ద్వారా 25 కిలోలూ సన్న బియ్యమే ఇవ్వాలని నిర్ణయించింది. టీచర్లంతా గౌరవప్రదంగా ఉండాలన్న భావనతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకొన్నది. నగదు సహాయం పక్కదారి పట్టకుండా రూ.2 వేల మొత్తాన్ని ఆన్లైన్ ద్వారా నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోకే బదిలీచేసేందుకు మార్గదర్శకాలు రూపొందించింది. ఈ పథకం అమలుకు శుక్రవారం కార్యాచరణ ప్రకటించింది. శనివారం నుంచే లబ్ధిదారుల ఎంపిక ప్రారంభించి, 15 రోజుల్లో ప్రక్రియను పూర్తిచేయనున్నది. ఈ పథకం అమలు, లబ్ధిదారుల ఎంపికపై మంత్రులు సబితాఇంద్రారెడ్డి, గంగుల కమలాకర్ శుక్రవారం సచివాలయం (బీఆర్కే భవన్) నుంచి వివిధ జిల్లాల కలెక్టర్లు, అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
నెలకు రూ.42.57 కోట్లు: గంగుల
ఈ పథకం అమలుకు పౌరసరఫరాలశాఖ ద్వారా ప్రతి నెలా రూ.42.57 కోట్లు ఖర్చుచేయనున్నట్టు ఆ శాఖ మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. ఇందుకు పూర్తి కార్యచరణతో సిద్ధమయ్యామని చెప్పారు. మంత్రి సబితాఇంద్రారెడ్డి, ప్రభుత్వ ప్రధాన సలహాదారు రాజీవ్శర్మలతో కలిసి జిల్లాల కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో ఆయన మా ట్లాడారు. 1.45 లక్షల మందికి ఒక్కొక్కరికి రూ.2 వేల కోసం నెలకు రూ.29 కోట్లు, 25 కిలోల బియ్యం కోసం రూ.13.57 కోట్లు అవసరం అవుతాయని చెప్పారు. వీరికోసం నెలకు రూ.3,625 టన్నుల బియ్యాన్ని అందుబాటులో ఉంచుతామన్నారు. గతేడాది కరోనా సమయంలో ప్రజలకు నెలకు రూ. 1,500తోపాటు డబుల్ రేషన్ ఉచితంగా ఇచ్చామని గుర్తుచేశారు. కలెక్టర్లు తగు జాగ్రత్తలు తీసుకొని అర్హులందరికీ బియ్యం, ఆర్థికసహాయం అందేలా చూడాలని మంత్రి సబితాఇంద్రారెడ్డి సూచించారు. ఫ్రంట్లైన్ వర్కర్లకు వ్యాక్సినేషన్ వేగంగా సాగేలా కలెక్టర్లు చొరవ తీసుకోవాలని రాజీవ్శర్మ కోరారు. సమావేశంలో విద్యాశాఖ స్పెషల్ సీఎస్ చిత్రారామచంద్రన్, ముఖ్యకార్యదర్శులు రామకృష్ణారావు, అర్వింద్కుమార్, వికాస్రాజ్, కార్యదర్శులు రిజ్వీ, సందీప్కుమార్ సుల్తానియా, రాహుల్ బొజ్జా తదితరులు పాల్గొన్నారు.
మానవతకు మారుపేరు కేసీఆర్: మంత్రి సబితా ఇంద్రారెడ్డి
ప్రైవేటు స్కూళ్ల టీచర్లు, సిబ్బందికి సా యం అందించడం శుభ పరిణామమని వి ద్యాశాఖమంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. సీఎం కేసీఆర్ మానవతకు మారుపేరు అని కొనియాడారు. శుక్రవారం తన కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడుతూ ఎవరూ అడుగకున్నా సీఎం మానవీయ కోణంలో స్వయంగా స్పందించి బియ్యం, రూ.2 వేల అందజేయాలని నిర్ణయించటం పట్ల సంతోషం వ్యక్తంచేశారు. ఇతర రాష్ర్టాల్లో ప్రైవేటు టీచర్లు ధర్నాలు, ర్యాలీలు చేసినా ప్ర భుత్వాలు పట్టించుకోలేదన్నారు. దేశంలోనే తొలిసారి తెలంగాణలో ప్రైవేటు స్కూళ్ల సిబ్బందికి సహాయం చేస్తున్నామన్నారు.
లెక్కతేలింది
2019-20 విద్యాసంవత్సరం యూనిఫైడ్ డిస్ట్రిక్ ఇన్ఫర్మేషన్ సిస్టం ఫర్ ఎడ్యుకేషన్ (యూడైజ్) సమాచారం ప్రకారం రాష్ట్రంలోని ప్రైవేటు పాఠశాలల్లో 1,43,660 మంది లబ్ధిదారులున్నట్టు తేల్చారు. 1,15,700 మంది బోధన, 27,960 బోధనేతర సిబ్బంది ఉన్న ట్టు లెక్కతేలింది. ప్రస్తుతం ఈ సంఖ్య పెరగొచ్చని అధికారులఅంచనా.. అత్యధికంగా లబ్ధిదారులు గ్రేటర్ హైదరాబాద్లోని మూడు జిల్లాల్లోనే ఉన్నారు. హైదరాబాద్లో 22,072 బోధన, 4,733 బోధనేతర, రంగారెడ్డిలో 15,653 బోధన, 3,694 బోధనేతర, మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలో 19,193 బోధన, 3,200 బోధనేతర సిబ్బంది పనిచేస్తున్నారు.