కార్పొరేట్కు దీటుగా తీర్చిదిద్దేందుకు ప్రణాళికలు
అన్ని స్కూళ్ల స్థితిగతులపై ఆరా
ఇప్పటికే పలు పాఠశాలలకు కొత్త భవనాలు
మరింత బలోపేతం దిశగా అడుగులు
తెలంగాణ చౌక్, ఏప్రిల్ 16: రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగానికి పెద్దపీట వేస్తున్నది. శిథిలావస్థకు చేరిన పాఠశాలలకు పూర్వ వైభవం తీసుకువచ్చి, సకల సౌకర్యాలతో వాటి రూపురేఖలు మార్చేందుకు చర్యలు తీసుకుంటున్నది. ఇందుకోసం విరివిగా నిధులు మంజూరు చేస్తుండడంతో దీర్ఘకాలిక సమస్యలకు పరిష్కారం లభించనున్నది. జిల్లా వ్యాప్తంగా స్కూళ్ల స్థితిగతులపై ఇప్పటికే 53 అం శాలతో కూడిన నివేదికను అధికార యంత్రాంగం సేకరించింది. ఇందుకు అనుగుణంగా నిధులు విడుదల కానుండడంతో త్వరలోనే బడులకు కొత్త శోభ సంతరించుకోనున్నది.
53 అంశాలతో నివేదిక
రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది బడ్జెట్లో విద్యా రంగానికి ఏకంగా నాలుగు వేల కోట్లు కేటాయించింది. ఈ నిధులను సకాలంలో ఖర్చు చేసి ప్రభుత్వ పాఠశాలల్లో దీర్ఘకాలిక సమస్యలను పరిష్కరించాలని నిర్ణయించింది. విద్యార్థుల సంఖ్య కు అనుగుణంగా అదనపు తరగతి గదులు నిర్మించాలని భావిస్తున్నది. ఇప్పటికే ప్రైవేట్ స్కూళ్ల నుం చి విద్యార్థులు సర్కారు బడుల్లో చేరుతుండడంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. విద్యా సంవత్సరం కంటే ముందుగానే సమస్యలు పరిష్కరించేందుకు సన్నద్ధమైంది. ఇందుకోసం పాఠశాలల్లో 53అంశాలతో జాబితాను ఆన్లైన్లో నమోదు చేసింది. త్వరలో నిధులు మంజూరు చేయనున్నది.
తల్లిదండ్రుల్లో మార్పు..
‘సర్కారు బడుల్లో సరిగ్గా చదువు చెప్పరు. ఉపాధ్యాయులు విద్యార్థులను పట్టించుకోరు. ఎప్పుడు వస్తారో.. ఎప్పుడు పోతారో వారికే తెలియదు. ఎటు చూసినా అరకొర వసతులే.. అందుకే మా పిల్లలను అప్పోసప్పో చేసైనా సరే కార్పొరేట్లోనే చదివిస్తాం’.. ఈ మాటలన్నీ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు ముందు.. కానీ రాష్ట్రం సిద్ధించిననాటి నుం చే కేసీఆర్ పాలనలో ప్రభుత్వ బడుల్లో మార్పు మొదలైంది. ప్రైవేట్ చదువుల వైపు ఇంతకాలం మొగ్గు చూపిన తల్లిదండ్రుల వైఖరిలో మార్పు కనిపిస్తున్నది. తమ పిల్లలను సర్కారు బడుల్లోనే చేర్పిస్తామంటున్నారు. ఇది వరకు సరార్కు బడులు వద్దనుకుని ప్రైవేట్ బాట పట్టిన వారంతా ఇప్పుడు సర్కారు బడులకు వస్తున్నారు. ఈ మార్పుకు అనుగుణంగా సీఎం కేసీఆర్ ప్రత్యేక శ్రద్ధతో మరింత బలోపేతం దిశగా అడుగులు వేయడం శుభపరిణామం. ఈ సారి బడ్జెట్లో భారీగా నిధులు కేటాయించడం తల్లిదండ్రుల్లో భరోసానింపింది.
వివరాల సేకరణ ఇలా..
జిల్లాలోని ఒక్కో ప్రభుత్వ పాఠశాలకు సంబంధించి 53అంశాలతో కూడిన వివరాలను ఎంఈవో, నోడల్ అధికారులు, హెచ్ఎంల నుంచి సేకరించాలి. ఈ వివరాల్ని ప్రత్యేక యాప్లో పొందుపర్చాలి. పాఠశాలల విద్యార్థుల సంఖ్య, తరగతులు, కమ్యూనిటీల వారీగా టీచింగ్, నాన్టీచింగ్ సిబ్బంది, అదనపు తరగతి గదుల అవసరం ఉన్నాయా.. ఎంత స్థలం అందుబాటులో ఉన్నది.. ఎన్ని మరుగుదొడ్లు ఉన్నాయి.. డెస్కు లు, సైన్స్, కంప్యూటర్ల ల్యాబ్, విద్యుత్ సరఫరా, బ్లాక్బోర్డులు, తాగునీటి సౌకర్యం, ప్రహరీ నిర్మాణం, ప్రొజెక్టర్, ఆట స్థలం, ప్యాన్లు, ట్యూబ్లైట్లు తదితర వివరాలు సేకరించాలి.
మరింత బలోపేతం ..
ప్రభుత్వం ఇప్పటికే ప్రభుత్వ పాఠశాలలను ఆధునీకరిస్తున్నది. వీటిని మరింత బలోపేతం చేసే దిశగా అడుగులు పడుతున్నాయి. కొన్ని చోట్ల పాఠశాలల భవనాలు శిథిలావస్థకు చేరుకోగా, ఆ గదుల్లోనే విద్యార్థులు తరగతులకు హాజరవుతున్నారు. ఇలాంటి పాఠశాలలను గుర్తించి వాటి స్థానంలో కొత్త తరగతి గదుల నిర్మాణం చేపట్టాలని నిర్ణయించింది. ఇందులో భాగంగానే జిల్లా వ్యాప్తంగా ఉన్న 486 ప్రభుత్వ పాఠశాలలు (ప్రాథమిక, ప్రాథమికోన్నత, జడ్పీహెచ్ఎస్), కేజీబీవీ లు 13, మోడల్ స్కూల్స్ 7, అర్బన్ రెసిడెన్షియ ల్, టీఎస్ఆర్ఈఐఎస్, రాష్ట్ర ప్రభుత్వ ఉన్నత పాఠశాలలు 3, వీటిలో అవసరం మేరకు నిధులతో సుందరంగా తీర్చిదిద్దనున్నారు.
సమస్యలు శాశ్వతంగా దూరం
ప్రభుత్వం విద్యారంగానికి పెద్దపీట వేస్తూ, నిధులు మంజూరు చేయడం శుభపరిమాణం. ప్రభుత్వ సూచించిన విధంగా 53అంశాలతో నివేదికలు సిద్ధం చేస్తున్నాం. అన్ని ప్రభుత్వ పాఠశాలల పూర్తి వివరాలతో కూడిన నివేదికను ఆన్లైన్లో పొందుపరుస్తున్నాం. ప్రభుత్వ సమాలోచనతో సర్కారు బడుల్లో సమస్యలు శాశ్వతంగా దూరంకానున్నాయి.
డీ రాధాకిషన్, డీఈవో, రాజన్న సిరిసిల్ల
ఇవి కూడా చదవండి
మున్సిపల్ ఎన్నికలు.. నామినేషన్లు షురూ
పవన్ కళ్యాణ్పై ప్రకాశ్రాజ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్