ముఖ్యమంత్రి ఆహ్వానానికి ప్రధానమంత్రి సానుకూలం
యాదాద్రి ఆలయాన్నిఅద్భుతంగా నిర్మించాం
ప్రారంభానికి చినజీయర్ స్వామి ముహూర్తం పెడతారు
10-15 వేల రుత్విక్కులతోమహా సుదర్శనయాగం చేస్తాం
మీరు తప్పక హాజరు కావాలి మోదీకి కేసీఆర్ ఆహ్వానం
కాకతీయ టెక్స్టైల్ పార్కుకు వెయ్యి కోట్లివ్వండి
రాష్ట్రంలో ప్రత్యేక గిరిజన వర్సిటీ నెలకొల్పండి
ట్రిపుల్ ఐటీ, ఐఐఎం ఏర్పాటు చేయండి
కొత్త జిల్లాలకు జవహర్ నవోదయ స్కూళ్లివ్వండి
రెండు పారిశ్రామికవాడలను మంజూరుచేయండి
పీఎంజీఎస్వై కింద అదనపు నిధులు ఇవ్వండి
విభజన చట్టంలోని హామీలను నెరవేర్చాలి
పది అంశాలపై మోదీకి కేసీఆర్ వినతి పత్రాలు
హైదరాబాద్, సెప్టెంబర్ 3 (నమస్తే తెలంగాణ): ఆధునిక కాలంలో అత్యద్భుత ఆధ్యాత్మిక నగరిగా అవతరిస్తున్న యాదాద్రి నరసింహస్వామి దేవాలయ పునఃప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా రావాలని ప్రధానమంత్రి మోదీని సీఎం కే చంద్రశేఖర్రావు ఆహ్వానించారు. సీఎం ఆహ్వానానికి ప్రధాని సానుకూలంగా స్పందించారు. శుక్రవారం సాయంత్రం ప్రధాని మోదీని ఆయన నివాసంలో సీఎం కేసీఆర్ కలుసుకొన్నారు. దాదాపు గంటపాటు సాగిన ఈ సమావేశంలో రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రధానికి వివరించారు. ఈ సందర్భంగా కేసీఆర్ యాదాద్రి పునర్నిర్మాణం గురించిన వివరాలను ప్రధానికి తెలిపారు. పునర్నిర్మాణ పనులు తుది దశకు చేరుకొన్నాయని.. చివరి నగిషీలు తీర్చిదిద్దుతున్నామని
వరంగల్లో ఏర్పాటుచేసిన కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కు (కేఎంటీపీ)కు రూ.వెయ్యి కోట్లను వన్టైమ్ గ్రాంట్గా ఇవ్వండి. పార్కుకు అవసరమయ్యే ఇతర నిధులను రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుంది. టెక్స్టైల్ రంగాన్ని ప్రోత్సహించడానికి ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించినందుకు కేంద్రానికి ధన్యవాదాలు. పత్తి ఉత్పత్తిలో తెలంగాణ దేశంలోనే రెండో స్థానంలో ఉన్నది. ఇక్కడ 60 లక్షల బేళ్ల పత్తి పండుతున్నది. ఇక్కడి పత్తి పొడవైన పింజతో, మంచి నాణ్యతతో ఉంటుంది. అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా ఇక్కడ కల్పించే వసతులకు రూ.1600 కోట్ల నిధులు అవసరమవుతాయని అంచనా వేశాం.. దీనికోసం వన్ టైం గ్రాంట్గా కేంద్రం నుంచి వెయ్యికోట్లు విడుదల చేయాలని కోరుతున్నాను.వెల్లడించారు. యాదాద్రిపై స్వయంభువుగా వెలసిన ఉగ్రజ్వాలాముఖ గండభేరుండ యోగిపుంగవ లక్ష్మీనారసింహస్వామిని ఐదు రూపాల్లో దర్శించుకోవడం అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని ముఖ్యమంత్రి ప్రధానికి వివరించారు. యాదాద్రి నారసింహుడు తెలంగాణ ప్రజల ఇలవేల్పు అని చెప్పారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత దాదాపు రూ.1200 కోట్లకు పైగా ఖర్చుతో కనీవినీ ఎరుగని రీతిలో యాదాద్రి పునర్నిర్మాణాన్ని చేపట్టినట్టు పేర్కొన్నారు. విశాలమైన 17.32 ఎకరాల్లో నూటికి నూరుశాతం రాతి కట్టడాలు, కృష్ణ శిలలతో నిర్మితమౌతున్నదని తెలిపారు. వెయ్యేండ్లపాటు నిలబడేలా ఆలయాన్ని నిర్మిస్తున్నట్టు వెల్లడించారు. సప్త గోపురాలు, సాలహారాలు, అష్టభుజి మండపాలు, స్తంభాలు, కుడ్యాలు, తోరణాలతో.. అత్యద్భుతమైన శిల్పనిర్మాణ వైచిత్రితో యాదాద్రి ఆలయం పునరావిష్కారమవుతున్నదంటూ దాని ప్రత్యేకతలను ప్రధానికి సీఎం వివరించారు.
శ్రీవైష్ణవ ఆచార్యులైన త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చినజీయర్ స్వామి ఆలయ ప్రారంభోత్సవానికి ముహూర్తం ఖరారుచేస్తారని, అక్టోబర్, నవంబర్ మాసాల్లో ముహూర్తం ఉండవచ్చని తెలిపారు. యాదాద్రి ప్రారంభోత్సవం సందర్భంగా దాదాపు పదిపదిహేను వేల మంది రుత్విక్కులతో మహా సుదర్శన యాగాన్ని నిర్వహిస్తామని.. ఈ యాగంలో పాల్గొనాలని ప్రధానిని ముఖ్యమంత్రి కోరారు. జీయర్స్వామి ముహూర్తాన్ని ఖరారుచేసిన తర్వాత ఆహ్వానించడానికి మళ్లీ వచ్చి కలుస్తానని చెప్పారు. సీఎం ఆహ్వానంపై మోదీ సంతోషం వ్యక్తంచేశారు. ముహూర్తం ఖరారు కాగానే తెలియజేయాలని.. తాను తప్పకుండా వచ్చి మహా సుదర్శన యాగంలో పాల్గొని స్వామివారిని దర్శించుకొంటానని చెప్పారు. ప్రస్తుతం గత ఏపీ భవన్ను తెలంగాణ, ఏపీ రాష్ర్టాలు పంచుకుని, ఉపయోగించుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణకు ప్రత్యేకంగా తెలంగాణ రాష్ట్ర భవన్ ఏర్పాటుచేసుకోవడానికి స్థలం కేటాయించాలన్న ముఖ్యమంత్రి వినతికి ప్రధాని సానుకూలంగా స్పందించారు. వీటితోపాటు పది అంశాలపై సీఎం కేసీఆర్ ప్రధానికి వినతిపత్రాలు అందించారు.
–ప్రధానికి ఇచ్చిన వినతిపత్రంలో సీఎం కేసీఆర్
కేఎంటీపీకి వెయ్యి కోట్లు ఇవ్వండి
వరంగల్లో ఏర్పాటుచేసిన కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కు (కేఎంటీపీ)కు రూ.వెయ్యి కోట్లను వన్టైమ్ గ్రాంట్గా ఇవ్వాలని ప్రధానమంత్రికి కేసీఆర్ విజ్ఞప్తిచేశారు. పార్కుకు అవసరమయ్యే ఇతర నిధులను రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుందని పేర్కొన్నారు. టెక్స్టైల్ రంగాన్ని ప్రోత్సహించడానికి ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించినందుకు కేంద్రానికి ముఖ్యమంత్రి ధన్యవాదాలు తెలిపారు. పత్తి ఉత్పత్తిలో తెలంగాణ దేశంలోనే రెండో స్థానంలో ఉన్నదని, ఇక్కడ 60 లక్షల బేళ్ల పత్తి పండుతుందని, ఇక్కడి పత్తి పొడవైన పింజతో, మంచి నాణ్యతతో ఉంటుందని ప్రధానికి ఇచ్చిన లేఖలో పేర్కొన్నారు. టెక్స్టైల్ రంగానికి అవసరమైన మానవ వనరులు, ముడిసరుకు రాష్ట్రంలో అందుబాటులో ఉన్నాయని చెప్పారు. రెండువేల ఎకరాల్లో ఏర్పాటుచేసిన ఈ పార్కులో ఫైబర్ టూ ఫ్యాబ్రిక్ పద్ధతిలో ఏర్పాట్లుచేస్తున్నామని వెల్లడించారు. అక్కడ పనిచేసే ఉద్యోగులు, కార్మికులకు అక్కడే గృహ వసతిని, ఇతర మౌలిక సదుపాయాలను కల్పిస్తున్నామన్నారు. 2 వేల ఎకరాల్లో ఇప్పటికే వెయ్యి ఎకరాలను సేకరించామని, మిగిలిన భూమిని త్వరలోనే సేకరిస్తామని వివరించారు. ఈ పార్కులో కాలుష్య ప్రభావం ఉండొద్దనే ఉద్దేశంతో జీరో లిక్విడ్ డిశ్చార్జ్ (జెడ్ఎల్డీ) విధానంలో సెంట్రలైడ్జ్ ఎఫ్లూయెంట్ ట్రీట్మెంట్ ప్లాంట్ (సీఈటీపీ) ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ఈ తరహాలో దేశంలో ఏర్పాటుచేసే కొద్ది పార్క్ల్లో ఇది ఒకటని పేర్కొన్నారు. ఈ పార్క్ డీపీఆర్ను సిద్ధం చేస్తున్నామని చెప్పారు. అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా ఇక్కడ కల్పించే వసతులకు రూ.1600 కోట్ల నిధులు అవసరమవుతాయని అంచనా వేశామని, దీని కోసం వన్ టైం గ్రాంట్గా కేంద్రం నుంచి వెయ్యికోట్లు విడుదల చేయాలని కోరారు.
పీఎంజీఎస్వైకి అదనపు నిధులివ్వండి
ప్రధాన మంత్రి గ్రామీణ సడక్ యోజన కింద తెలంగాణ రాష్ట్రానికి దాదాపు 4 వేల కిలోమీటర్ల పొడవు గ్రామీణ రహదారులున్నాయని వాటి వెడల్పును పెంచాలని సీఎం కేసీఆర్ ప్రధానికి వినతిపత్రం ఇచ్చారు. ఈ రోడ్ల వెడల్పును ప్రస్తుతం ఉన్న 3.75 మీటర్ల నుంచి పేవ్మెంట్స్తో కలిపి 5.5 మీటర్లకు (బ్లాక్టాప్) పెంచాలని కోరారు.
వెనుకబడిన ప్రాంతాల్లో రోడ్లు బాగుపరచాలి
వెనుకబడిన ప్రాంతాల్లో రోడ్లను అభివృద్ధిచేయాలనే స్పష్టమైన నిబంధన ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం-2014లో ఉన్నప్పటికీ కేంద్రం ఇప్పటికీ దానిని నెరవేర్చడం లేదని సీఎం కేసీఆర్ ప్రధాని మోదీకి వివరించారు. ఈ నేపథ్యంలో రోడ్ కనెక్టివిటీని అభివృద్ధి చేయడానికి పీఎంజీఎస్వై కింద రాష్ట్రానికి రావాల్సిన అదనపు నిధులు ఇవ్వాలని కోరారు. ఇప్పటివరకు విభజన చట్టం ప్రకారం రాష్ట్రానికి అదనపు నిధులు ఇవ్వలేదని ఈ సందర్భంగా ప్రధానికి సీఎం గుర్తుచేశారు.
వామపక్ష తీవ్రవాద ప్రాంతాల్లో రోడ్లు మెరుగవ్వాలి
వామపక్ష తీవ్రవాదం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో రహదారుల వ్యవస్థను మరింతగా విస్తరించాల్సి ఉన్నదని సీఎం కేసీఆర్ తెలిపారు. ప్రజల రాకపోకలు, వారి ఆరోగ్య సేవలు, భద్రత కోసం ఈ ప్రాంతాల్లో రోడ్లను అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉన్నదని ప్రధానికి నివేదించారు. వామపక్ష తీవ్రవాద ప్రభావిత ప్రాంతాల్లో రోడ్ల వ్యవస్థను ఏర్పాటుచేయడానికి కేంద్రం పూర్తిగా నిధులు సమకూర్చాలని విజ్ఞప్తిచేశారు. ఇప్పటివరకు సీఎస్ఎస్ పద్ధతిలో 60ః40 శాతం నిష్పత్తిలో ఖర్చును రాష్ట్రాలను అడగడం కన్నా కేంద్రమే పూర్తిగా ఫండింగ్ చేయాలని కోరారు.
కొత్త జిల్లాల్లో జేఎన్వీలకు వినతి
తెలంగాణలోని 21 కొత్త జిల్లాల్లో జవహర్ నవోదయ విద్యాలయాలు (జేఎన్వీ) ఏర్పాటుచేయాలని ప్రధానిని సీఎం కేసీఆర్ కోరారు. దేశంలోని ప్రతి జిల్లాలో నవోదయ విద్యాలయం ఏర్పాటుచేయాలన్న కేంద్ర ప్రభుత్వ పాలసీ ప్రకారం రాష్ట్రంలోని 21 జిల్లాల్లో కొత్తగా నవోదయ విద్యాలయాలను ఏర్పాటు చేయాలని వినతిపత్రాన్ని సమర్పించారు. ఆదిలాబాద్, నిర్మల్, మంచిర్యాల, నిజామాబాద్, సంగారెడ్డి, మెదక్, రాజన్న సిరిసిల్ల, జగిత్యాల, పెద్దపల్లి, భద్రాద్రి కొత్తగూడెం, వరంగల్, జనగామ, మహబూబాబాద్, జయశంకర్ భూపాలపల్లి, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి, మహబూబ్నగర్, వనపర్తి, జోగులాంబ గద్వాల, వికారాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాల్లో కొత్త నవోదయ విద్యాలయాలు ఏర్పాటుచేయాలని కేసీఆర్ విజ్ఞప్తిచేశారు. నవోదయ విద్యాలయాలు గ్రామీణ ప్రాంతాల్లోని పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యనందిస్తున్నాయని పేర్కొన్నారు. వీటి ఏర్పాటుకు అవసరమయ్యే స్థలాన్ని రాష్ట్రప్రభుత్వం సమకూరుస్తుందని హామీ ఇచ్చారు. 12,500 చదరపు కిలోమీటర్లు, 35 లక్షల జనాభాకు ఒక జిల్లా చొప్పున రాష్ట్రంలో 10 జిల్లాలు ఉండగా, 2016లో సరాసరిగా 4,760 చదరపు కిలోమీటర్లు, 12 లక్షల జనాభాకు ఒక జిల్లా చొప్పున 33 జిల్లాలు ఏర్పాటు చేశామని వివరించారు. వాటిలో 9 (రంగారెడ్డి, కుమ్రంభీం ఆసిఫాబాద్, హనుమకొండ, నాగర్కర్నూల్, నల్లగొండ, సిద్దిపేట, ఖమ్మం, కరీంనగర్, కామారెడ్డి) జిల్లాల్లో మాత్రమే నవోదయ విద్యాలయాలున్నాయని చెప్పారు. కేంద్రం చొరవ తీసుకొని, మిగతా 21 జిల్లాలకు కొత్త నవోదయ విద్యాలయాలు ఏర్పాటుచేయాలని కోరారు.
కరీంనగర్లో ట్రిపుల్ ఐటీ ఉత్తర తెలంగాణలో అతిపెద్ద
ఎడ్యుకేషన్ హబ్ అయిన కరీంనగర్ జిల్లా కేంద్రంలో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ట్రిపుల్ ఐటీ)ని ఏర్పాటుచేయాలని ప్రధానిని సీఎం కేసీఆర్ కోరారు. కేంద్ర విద్యాశాఖ ద్వారా పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ (పీపీపీ) పద్ధతిలో ఈ విద్యాసంస్థను ఏర్పాటు చేయాలని వినతిచేశారు. హైదరాబాద్లో అత్యున్నత ప్రమాణాలతో కూడిన విద్య లభిస్తుందన్న విషయం తెలిసిందేనని, దీనిని తెలంగాణలోని ప్రముఖ నగరాలకు విస్తరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తున్నదని చెప్పారు. ట్రిపుల్ ఐటీ ఏర్పాటుకు కరీంనగర్ అత్యంత అనుకూలమైన ప్రాంతమని, గతంలోకూడా కరీంనగర్కు ట్రిపుల్ ఐటీ మంజూరుచేయాలని తాము విన్నవించామని గుర్తుచేశారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున స్థలాన్ని కేటాయించడంతోపాటు, పీపీపీ పద్ధతిలో వాటాను సైతం సమకూర్చడంతోపాటు, ఐటీ కంపెనీలు భాగస్వామ్యమయ్యేలా చొరవ తీసుకుంటామని పేర్కొన్నారు. ట్రిపుల్ ఐటీని వీలైనంత త్వరగా మంజూరుచేస్తే, ఈ విద్యాసంవత్సరమే ప్రవేశాలు పూర్తిచేస్తామని తెలిపారు.
గిరిజన యూనివర్సిటీ మంజూరుచేయండి
విభజన చట్టంలోని షెడ్యూల్ 13 (3) సెక్షన్ 94 ప్రకారం తెలంగాణకు గిరిజన విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటుచేయాలని ప్రధాని మోదీకి సీఎం కేసీఆర్ విజ్ఞప్తిచేశారు. వర్సిటీ ఏర్పాటుకు వీలుగా రాష్ట్ర ప్రభుత్వం 200 ఎకరాల స్థలాన్ని కేటాయించిందని, కేంద్ర ప్రభుత్వ ప్రతినిధులు సైతం ఆ ప్రాంతంలో వర్సిటీ ఏర్పాటుకు అంగీకరించారని ప్రధాని మోదీకి సమర్పించిన వినతిపత్రంలో గుర్తుచేశారు. పార్లమెంట్ బడ్జెట్ కేటాయింపులతోపాటు ఎక్కడా యూనివర్సిటీ ఏర్పాటుకు పురోగతిలేదన్నారు. రాష్ట్ర విభజన చట్టాన్ని పరిగణనలోకి తీసుకొని, సెంట్రల్ యూనివర్సిటీ హోదాతో గిరిజన యూనివర్సిటీ ఏర్పాటయ్యేలా కేంద్ర విద్యాశాఖను ఆదేశించాలని విజ్ఞప్తిచేశారు.
అదనంగా ఐపీఎస్లను కేటాయించండి
తెలంగాణలో జిల్లాల పునర్వ్యవస్థీకరణ తర్వాత పోలీస్ జిల్లా యూనిట్లు, పోలీస్ కమిషనరేట్ల సంఖ్య పెరిగిందని, అందుకు అనుగుణంగా ఐపీఎస్ క్యాడర్ సంఖ్యను పెంచాలని ప్రధానిని సీఎం కేసీఆర్ కోరారు. ఐపీఎస్ క్యాడర్ను 139 నుంచి 195కు పెంచాలని వినతిచేశారు. సీనియర్ డ్యూటీ అధికారుల సంఖ్యను 76 నుంచి 105కు పెంచాలన్నారు. రాష్ట్ర విభజన తర్వాత కేంద్ర హోంశాఖ తెలంగాణకు 76 సీనియర్ డ్యూటీ పోస్టులు సహా మొత్తం 139 ఐపీఎస్ పోస్టులను మంజూరుచేస్తూ 2016లో ఐపీఎస్ కేడర్ రివ్యూ చేసిందని పేర్కొన్నారు. జిల్లాల పునర్వ్యవస్థీకరణ తర్వాత రాష్ట్రంలో పోలీస్ జిల్లాల సంఖ్య 20కి, పోలీస్ కమిషనరేట్ల సంఖ్య 9కి పెరిగిందని తెలిపారు. నూతన జోన్లు, మల్టీజోన్లు, పోలీస్ జిల్లాలు పెరిగినందున అదనంగా ఐపీఎస్ పోస్టులు కేటాయిస్తూ ఐపీఎస్ కేడర్ రివ్యూ చేయాలని కోరుతూ ఈ ఏడాది జూన్ 24న కేంద్ర హోంశాఖకు లేఖ రాసినట్టు తెలిపారు. కొత్తగా ఏర్పడిన జోన్లు, మల్టీజోన్లు, పోలీస్ జిల్లాల్లో శాంక్షన్డ్ క్యాడర్ పోస్టులు లేవని, కొత్తగా పోస్టుల మంజూరుతో ఈ సమస్య తీరుతుందని పేర్కొన్నారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను వినతిపత్రంతోపాటు జత చేశారు. తెలంగాణతో దాదాపు సమానమైన విస్తీర్ణం, జనాభా ఉన్న రాష్ర్టాల్లో ప్రస్తుతం ఐపీఎస్ల సంఖ్య ఎంత ఉన్నది, తెలంగాణలో ఎంత తక్కువగా ఉన్నదో వివరించారు.
పారిశ్రామిక కారిడార్లను మంజూరు చేయండి
రాష్ట్రం ప్రతిపాదించిన రెండు పారిశ్రామిక కారిడార్లను మంజూరుచేయాలని ప్రధానికి సీఎం కేసీఆర్ వినతిపత్రం ఇచ్చారు. దీనిద్వారా ఈ ప్రాంతాలు పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతాయని, ఉపాధి అవకాశాలు పెద్ద ఎత్తున ఏర్పడుతాయని అందులో పేర్కొన్నారు. హైదరాబాద్- నాగపూర్ మధ్యలో 585 కిలోమీటర్లకు ఇరువైపులా 50 కిలోమీటర్ల వెడల్పును పరిగణనలోకి తీసుకొంటే నాలుగు కోట్ల జనాభా ఉంటుందని, తెలంగాణ, మహారాష్ట్ర జనాభాలో 27% ఉంటుందని వివరించారు. హైదరాబాద్- నాగపూర్ మధ్యలో జాతీయ రహదారి, రైలు సౌకర్యం ఉన్నదని పేర్కొన్నారు. ఈ రెండు నగరాల మధ్య హై స్పీడ్ రైలు ప్రతిపాదనలో ఉన్నదని గుర్తుచేశారు. సరుకు రవాణాను రెండు విధాలుగా చేసుకోవచ్చని తెలిపారు. ఈ రహదారిలో సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ కూడా ఉండటం మరో అదనపు ప్రయోజనమని పేర్కొన్నారు. నాగపూర్లో ప్రతిపాదించిన మల్టీ మోడల్ ఇంటర్నేషనల్ కార్గోకు హబ్గా ఈ కారిడార్ మారుతుందని వివరించారు. ఈ మార్గంలో అభివృద్ధి చెందిన, మోస్తరుగా అభివృద్ధి చెందిన, అభివృద్ధి చెందుతున్న ప్రాంతాలున్నాయని వెల్లడించారు. దీంతోపాటుగా తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్- వరంగల్ పారిశ్రామిక కారిడార్ను అభివృద్ధి చేయడానికి సిద్ధంగా ఉన్నదని, ఈ నేపథ్యంలో హైదరాబాద్- నాగపూర్, హైదరాబాద్- వరంగల్ పారిశ్రామిక కారిడార్లను మంజూరు చేయాలని కోరారు.
హెచ్సీయూలో.. ఐఐఎం
ప్రతి రాష్ట్రంలో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ (ఐఐఎం) ఏర్పాటుచేయాలన్న కేంద్ర ప్రభుత్వ విధానం ప్రకారం హైదరాబాద్కు ఐఐఎంను మంజూరుచేయాలని సీఎం కేసీఆర్, ప్రధాని మోదీని కోరారు. యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ (హెచ్సీయూ) క్యాంపస్లో ప్రతిపాదిత ఐఐఎంను ఏర్పాటుచేయాలని వినతిపత్రం ఇచ్చారు. ఇందుకు అవసరమయ్యే స్థలాన్ని రాష్ట్ర ప్రభుత్వం సమకూరుస్తుందని చెప్పారు. హెచ్సీయూలో రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిన 2 వేల ఎకరాలకు పైగా స్థలం అందుబాటులో ఉన్నదని.. అదే క్యాంపస్లో ఐఐఎంను ఏర్పాటు చేయవచ్చని సూచించారు. గత పదేండ్లల్లో పలు రాష్ర్టాలకు కొత్త ఐఐఎంలు మంజూరుచేసినా, తెలంగాణలో ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ను (ఐఎస్బీ) సాకుగా చూపుతూ కొత్త ఐఐఎంను ఏర్పాటుచేయడం లేదని సీఎం కేసీఆర్ ప్రస్తావించారు. ఐఎస్బీలో ట్యూషన్ ఫీజులను సాధారణ విద్యార్థులు భరించలేరని ప్రధాని దృష్టికి తీసుకెళ్లారు. హైదరాబాద్లోని హెచ్సీయూలో ఐఐఎం ఏర్పాటు చేసేలా కేంద్ర విద్యాశాఖకు ఆదేశాలివ్వాలని కోరారు.