హైదరాబాద్, జూలై 15 (నమస్తే తెలంగాణ): తెలంగాణలో ప్రతిపాదిత ఫుడ్ ప్రాసెసింగ్ జోన్ (ఎఫ్పీజడ్)లలో తవుడు నూనె (రైస్బ్రాన్ ఆయిల్)తోపాటు సాల్వెంట్ ఆయిల్ మిల్లుల ఏర్పాటుకు ప్రాధాన్యమిస్తామని పౌర సరఫరాల శాఖమంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. తవుడు నూనెతో పలు ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న నేపథ్యంలో వాటి ఏర్పాటుకు ప్రాధాన్యమివ్వాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు భావిస్తున్నారని చెప్పారు. సాల్వెంట్ మిల్లులు, తెలంగాణ రైస్ మిల్లుల సంఘాల ప్రతినిధులు గురువారం హైదరాబాద్లో మంత్రి గంగులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా సాల్వెంట్ ఆయిల్ మిల్లుల ప్రతినిధులు తవుడు నూనె తయారీ విధానాన్ని వివరించారు. కొలెస్ట్రాల్ తక్కువగా ఉండటంతోపాటు, రక్తపోటు అదుపులో ఉంటుందని తెలిపారు. సీఎం కేసీఆర్ ప్రత్యేకంగా తీసుకుంటున్న చర్యలతో ధాన్యం ఉత్పత్తిలో తెలంగాణ దేశంలోనే నంబర్వన్గా ఎదిగిందని గంగుల పేర్కొన్నారు. ఫుడ్ ప్రాసెసింగ్ జోన్ల ఏర్పాటుకు ఇప్పటికే ప్రాంతాల గుర్తింపు పూర్తయిందని. సాల్వెంట్ మిల్లుల సంఘం ప్రతినిధులు మారం ప్రసాద్, పాలకుర్తి చినబాబు, మిషనరీ తయారీదారు ఆనందమోహన్, తెలంగాణ రైస్మిల్లుల సంఘం అధ్యక్షుడు గంప నాగేందర్ తదితరులు మంత్రిని కలిసినవారిలో ఉన్నారు.