హైదరాబాద్, సెప్టెంబర్ 21 (నమస్తే తెలంగాణ): డిగ్రీ మూడో సంవత్సరం విద్యార్థులు సైతం ఇక నుంచి ద్వితీయ భాషను తప్పనిసరిగా చదువాల్సిందే. ఇతర సబ్జెక్టుతోపాటు ద్వితీయభాష తెలుగు, హిందీ లేదా సంస్కృతాన్ని సైతం అభ్యసించాల్సిందే. ఇది వరకు మొదటి, రెండో సంవత్సరాల్లో మాత్రమే ద్వితీయ భాషను బోధించేవారు. మూడో సంవత్సరంలో కోర్ సబ్జెక్టులు మాత్రమే ఉండేవి. తాజాగా ఉన్నత విద్యామండలి అధికారులు డిగ్రీ మూడో సంవత్సరంలో కూడా ద్వితీయ భాషను తప్పనిసరిచేశారు. రాష్ట్రంలోని అన్ని వర్సిటీల డిగ్రీలో తెలుగును ద్వితీయభాషగా ప్రవేశపెట్టారు. ఇందుకోసం పాఠ్యపుస్తక రచనకు కమిటీ వేసి, ‘తెలుగు సాహితీ దుందుభి’ పేరుతో ప్రత్యేకంగా పాఠ్యపుస్తకాన్ని సిద్ధంచేశారు. ఓయూ తెలుగు విభాగం ఈ పాఠ్యపుస్తకాన్ని రూపొందించగా, తెలుగు అకాడమీ పుస్తకాన్ని ముద్రించింది. ఈ పాఠ్యపుస్తకాన్ని ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ ఆర్ లింబాద్రి, వైస్ చైర్మన్ ప్రొఫెసర్ వెంకటరమణ మంగళవారం మాసాబ్ట్యాంక్లోని ఉన్నత విద్యామండలి కార్యాలయంలో విడుదల చేశారు. ప్రస్తుతానికి ఇంజినీరింగ్, సైన్స్ కోర్సుల్లో మాత్రమే ప్రాజెక్ట్ వర్క్ను అమలుచేస్తున్నారు. ఇదే తరహాలో తెలుగుభాషలోను సాహిత్య, సామాజిక ప్రాజెక్ట్ల పేరుతో ప్రాజెక్ట్ వర్క్ను చేర్చారు. ఇదే పుస్తకంలో జర్నలిజంపై విద్యార్థులకు అవగాహన కల్పించేదుకు ‘జర్నలిజం మౌలికాంశాల’ పేరుతో పాఠ్యాంశాన్ని సైతం చేర్చారు. కార్యక్రమంలో ఓయూ తెలుగుశాఖాధ్యక్షురాలు సూర్యాధనుంజయ్, కాశీం, జ్యోతి, రఘు, లావణ్య, శ్రీధర్, కృష్ణయ్య, శంకరయ్య, సీతారామారావు తదితరులు పాల్గొన్నారు