న్యూఢిల్లీ: దేశంలో ప్రస్తుతం కరోనా కేసుల సంఖ్య తగ్గుముఖం పడుతున్నది. కానీ, వ్యాక్సినేషన్ ప్రక్రియ మాత్రం నిరంతరాయంగా కొనసాగుతున్నది. ప్రస్తుతం రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల వద్ద 1.05 కోట్ల కొవిడ్-19 వ్యాక్సిన్ డోసులు అందుబాటులో ఉన్నట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. వచ్చే మూడు రోజుల్లో మరో 47 లక్షలకు పైగా డోసులను రాష్ట్రాలకు పంపనున్నట్లు ఒక ప్రకటనలో తెలిపారు.
కేంద్ర ప్రభుత్వం ఇప్పటివరకు రాష్ట్రాలకు ఉచితంగా 25 కోట్లకు పైగా (26,69,14,930) వ్యాక్సిన్ డోసులను అందించింది. వాటిలో జూన్ 14 వరకు 25,67,21,069 డోసులను అందించారు. అవి కాకుండా ప్రస్తుతం 1,05,61,861 వ్యాక్సిన్లు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల వద్ద అందుబాటులో ఉన్నాయి. కరోనా వైరస్ను ఎదుర్కోవడంలో రాష్ట్రాలకు తోడుగా ఉండేందుకు కేంద్రం వ్యాక్సిన్ను ఉచితంగా అందిస్తున్నది.
టీకాల ఉత్పత్తి, సరఫరాను పెంచేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు కేంద్రం వెల్లడించింది. టీకా తీసుకోవడంతోపాటు ప్రజలు కరోనా మార్గదర్శకాలను పాటించేలా చూడాలని కేంద్రం రాష్ట్రాలకు సూచించింది. కరోనా నియంత్రణలో వ్యాక్సిన్ పంపిణీ కీలకమని ఆరోగ్య శాఖ పేర్కొన్నది. టీకా పంపిణీని వేగవంతం చేసేందుకు మూడో దశ వ్యూహాన్ని మే 1 నుంచి కేంద్రం అమలులోకి తెచ్చింది.