విద్యారంగాన్ని ఈ ఏడాది కూడా కరోనా తీవ్రంగా దెబ్బకొట్టింది. దేశవ్యాప్తంగా కరోనా కేసులు పెద్ద సంఖ్యలో పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వంతోపాటు వివిధ రాష్ర్టాల ప్రభుత్వాలు కొన్ని వార్షిక పరీక్షలను రద్దుచేశాయి. మరికొన్నింటిని వాయిదా వేశాయి. ఈ నెల 18న జరుగాల్సిన నీట్-పీజీ (నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రెన్స్ టెస్ట్-పోస్ట్గ్రాడ్యుయేట్) పరీక్షలను కేంద్రం వాయిదా వేయగా.. విదేశాల్లోని పాఠశాలల్లో ప్రవేశాలకోసం ఇంటర్నేషనల్ బ్యాకులరేట్ (ఐబీ) సంస్థ నిర్వహించే పరీక్షలు రద్దయ్యాయి. వివిధ రాష్ర్టాల్లోనూ బోర్డు పరీక్షలను రద్దుచేస్తూ ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయాలు తీసుకున్నాయి. మన రాష్ట్రంలో కూడా ఈ ఏడాది టెన్త్ పరీక్షలను రద్దు చేశారు. ఇంటర్ ద్వితీయ సంవత్సరం పరీక్షలను వాయిదావేశారు. ఇంటర్ ఫస్టియర్ విద్యార్థులను పరీక్షలు లేకుండానే రెండో సంవత్సరానికి ప్రమోట్ చేస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది.
హైదరాబాద్, ఏప్రిల్ 15 (నమస్తే తెలంగాణ): కరోనా ఉధృతంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో ఎస్సెస్సీ, ఇంటర్ వార్షిక పరీక్షలపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. ఎస్సెస్సీ పరీక్షలను రద్దుచేయగా, ఇంటర్ పరీక్షలను వాయిదావేసింది. ఎస్సెస్సీ, ఇంటర్కు సీబీఎస్ఈ అనుసరించిన సూత్రాన్నే రాష్ట్రంలోనూ అమలుచేయనున్నారు. ఈ మేరకు విద్యాశాఖ స్పెషల్ సీఎస్ చిత్రారామచంద్రన్ గురువారం ఉత్తర్వులు విడుదలచేశారు. ఎస్సెస్సీ, ఇంటర్కు వేర్వేరుగా ఆమె సర్క్యులర్లను జారీచేశారు. అంతకుముందు ఇదే అంశంపై ఆమె ఇంటర్, ఎస్సెస్సీ బోర్డు అధికారుల నుంచి ఫైళ్లను తెప్పించుకున్నారు. కరోనా సెకండ్ వేవ్ దృష్ట్యా పరీక్షలు నిర్వహించడం అంత సులువుకాదన్న అభిప్రాయానికి వచ్చి, రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక పంపించారు. ప్రభుత్వం నుంచి అనుమతి రావడంతో ఆ మేరకు ఆదేశాలు జారీచేశారు.
గతేడాది తరహాలోనే ఎస్సెస్సీ పరీక్షలను ఈ ఏడాది సైతం రద్దుచేశారు. పరీక్ష ఫీజు చెల్లించిన 5,21,393 మంది విద్యార్థులను పాస్ చేస్తున్నట్టు ప్రకటించారు. సీబీఎస్ఈ అనుసరిస్తున్న ఫార్ములా, ఎస్సెస్సీ బోర్డు రూపొందించిన ఆబ్జెక్టివ్ క్రైటీరియా ఆధారంగా గ్రేడింగ్స్ ప్రకటించనున్నారు. ఈ మార్కులపై సంతృప్తిలేకున్నా, అభ్యంతరాలున్నా సదరు విద్యార్థులకు ఆఫ్లైన్లో పరీక్షరాసే అవకా శం కల్పిస్తామని సర్క్యులర్లో తెలిపారు. పరిస్థితు లు మెరుగయ్యాకే ఈ అవకాశం ఉంటుందని స్పష్టంచేశారు. ఆబ్జెక్టివ్ క్రైటీరియా ఏమిటన్నదానిపై విద్యాశాఖ స్పష్టతనివ్వలేదు. ముందుగా అనుకున్నదాని ప్రకారం రాష్ట్రంలో మే 17 నుంచి 26 వరకు పదో తరగతి పరీక్షలు జరుగాల్సి ఉన్నది. కరోనా నేపథ్యంలో ఎస్సెస్సీ ప్రశ్న పత్రాలను 11 నుంచి 6కు కుదించారు.
ఎస్సెస్సీ విద్యార్థులందరినీ ఫార్మేటివ్ అసెస్మెం ట్ (ఎఫ్ఏ) మార్కుల ఆధారంగా పాస్ చేయాలని అధికారులు నిర్ణయించినట్టు తెలిసింది. గత మార్చి 15న నిర్వహించిన ఎఫ్ఏ-1 మార్కుల ప్రకారం గ్రేడింగ్ ఇవ్వాలని నిర్ణయించినట్టు ఓ అధికారి తెలిపారు. ఇందుకు ఎఫ్ఏ-1 మార్కులను తక్షణమే ప్రభుత్వ పరీక్షల విభాగం (డీజీఈ) వెబ్సైట్లో అప్లోడ్చేయాలని ఎస్సెస్సీ బోర్డు ఆదేశాలు సైతం జారీచేసింది. ఎంఈవోలు, డీఈవోలు ఇందుకు చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులు కోరారు.
మే 1- 19 వరకు జరగాల్సిన ఇంటర్ సెకండ్ ఇయర్ వార్షిక పరీక్షలను సైతం వాయిదావేశారు. ఈ పరీక్షలపై జూన్ మొదటివారంలో సమీక్షించి, అప్పటి పరిస్థితులనుబట్టి పరీక్షా తేదీలను ఖరారు చేయనున్నారు. పరీక్షలకు 15 రోజుల ముందుగా షెడ్యూల్ విడుదలచేస్తామని చిత్రారామచంద్రన్ సర్క్యులర్లో తెలిపారు. ఇక సెకండ్ ఇయర్ విద్యార్థులకు బ్యాక్ల్యాగ్స్ ఉంటే కనీస మార్కులతో ఉత్తీర్ణులుగా ప్రకటిస్తామని పేర్కొన్నారు. ఇది బ్యాక్ల్యాగ్స్ సబ్జెక్ట్లకు మాత్రమే వర్తిస్తుందని తెలిపారు. ఈ నిర్ణయంతో ఫస్టియర్ పరీక్షలు రాసి ఫెయిల్ అయిన 1,99,019 మంది విద్యార్థులు సైతం కనీ స మార్కులతో ఉత్తీర్ణులుకానున్నారు. ఫస్టియర్ విద్యార్థులను పరీక్షలు లేకుండానే సెకండియర్కు ప్రమోట్ చేయనున్నట్టు ప్రకటించారు. భవిష్యత్తు లో పరిస్థితులు చక్కబడితే ఫస్టియర్వారికి సైతం పరీక్షలు నిర్వహిస్తామని తెలిపారు. ఎంసెట్లో 25% ఇంటర్ వెయిటేజీని సైతం ఈ ఏడాది రద్దుచేస్తున్నట్టు ప్రకటించారు. ఇంటర్ ఫస్టియర్లో 4,59,008 మంది, సెకండియర్లో 4,73,967 చొప్పున మొత్తం 9,32,975 మంది పరీక్ష ఫీజును చెల్లించారు. ఫస్టియర్వారికి ఇంటర్నల్స్ నిర్వహించగా, సెకండియర్వారికి నిర్వహించాల్సిన ప్రాక్టికల్స్ను ఇప్పటికే వాయిదావేసిన సంగతి తెలిసిందే.
ఎస్సెస్సీ పరీక్షలు గతేడాది సైతం ఇదే కరోనా సంక్షోభంతో రద్దయ్యాయి. గతేడాది మార్చిలో పరీక్షలు కొనసాగుతున్న క్రమంలో లాక్డౌన్ ప్రకటించడంతో వాయిదావేశారు. మరలా పరీక్షలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసినా, హైకోర్టు ఆదేశాలతో పరీక్షలను పూర్తిగా రద్దుచేశారు. అప్పట్లో ఎఫ్ఏ మార్కుల ఆధారంగా అందరినీ పాస్ చేసి, గ్రేడ్లు కేటాయించారు. ఈ ఏడాది సైతం పరీక్షలు రద్దుచేయడంతో పరీక్షల్లేకుండా పై తరగతులకు ప్రమోట్ చేయడం ఇది వరుసగా రెండోసారి కానున్నది. ఇక గతేడాది ఇంటర్ పరీక్షలు అప్పటికే ముగియడంతో మూల్యాకనం నిర్వహించి ఫలితాలను ప్రకటించారు. కానీ సెకండియర్లో ఫెయిల్ అయినవారు పై తరగతులకు ప్రమోట్కావాల్సి ఉం డటంతో వారందరికీ మినిమం మార్కులేసి పాస్చేయడంతోపాటు ఫస్టియర్లో బ్యాక్ల్యాగ్ ఉన్న సెకండియర్ వాళ్లను సైతం పాస్చేశారు. తాజాగా ఫస్టియర్లో బ్యాక్ల్యాగ్స్ ఉన్నవారికి సైతం మిని మం మార్కులేసి ఉత్తీర్ణులను చేయనున్నారు.
పరీక్షలను వాయిదా వేయడాన్ని పలు సంఘాల నేతలు ఆహ్వానించారు. విద్యార్థుల భవిష్యత్తు దృష్ట్యా ప్రభుత్వం సరైన నిర్ణయం తీసుకున్నదని ఇంటర్ విద్యా జేఏసీ చైర్మన్ డాక్టర్ మధుసూదన్రెడ్డి అన్నారు. ప్రతికూల పరిస్థితుల్లో పరీక్షలపై ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకున్నదని ఆర్జేడీ కాంట్రాక్ట్ లెక్చరర్ల సంఘం అధ్యక్షుడు గాదె వెంకన్న అభిప్రాయపడ్డారు. విద్యార్థులంతా వైరస్ బారినపడకుండా పరీక్షలను వాయిదా వేసి ప్రభు త్వం మంచి నిర్ణయం తీసుకున్నదని టీఆర్ఎస్వీ నేత కిశోర్గౌడ్ అన్నారు. ఎస్సెస్సీ పరీక్షలను రద్దుచేయడంపై తెలంగాణ తల్లిదండ్రుల సంఘం (టీపీఏ) హర్షం వ్యక్తంచేసింది. ప్రభుత్వ నిర్ణయం లక్షలమంది తల్లిదండ్రులకు సంతోషాన్నిచ్చిందని టీపీఏ అధ్యక్షుడు నారాయణ అన్నారు.