హైదరాబాద్ : రాష్ర్టంలో ఆయిల్ పామ్ సాగును ప్రోత్సహించాలని కేబినెట్ నిర్ణయించింది. ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన బుధవారం ప్రగతి భవన్లో రెండో రోజు జరిగిన కేబినెట్ సమావేశంలో వ్యవసాయ శాఖపై చర్చించారు. 2022 – 23 ఏడాదికి 20 లక్షల ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగు చేపట్టే దిశగా రైతులను చైతన్యపరిచి ప్రోత్సహించాలని కేబినెట్ నిర్ణయం తీసుకున్నది. ఇందులో భాగంగా.. ఆయిల్ పామ్ సాగుచేసే రైతులకు ఎకరాకు, మొదటి సంవత్సరం రూ.26,000, రెండో సంవత్సరం ఎకరాకు రూ.5,000 మూడో సంవత్సరం ఎకరాకు రూ. 5,000 చొప్పున పంట పెట్టుబడి ప్రోత్సాహకం కింద సబ్సిడీగా అందించాలని నిర్ణయించింది.
ఇందులో భాగంగా అటవీ శాఖ, అటవీ అభివృద్ధి కార్పోరేషన్తో పాటు పంచాయితీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల సహాయంతో ఆయిల్ పామ్ మొక్కల నర్సరీలను పెంచాలని కేబినెట్ సూచించింది. ఆయిల్ పామ్ పంట విధానం గురించి మరింతగా తెలుసుకోవడానికి మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారులతో కూడిన అధ్యయన బృందం.. కోస్టారికా, మలేషియా, థాయ్లాండ్, ఇండోనేషియా తదితర దేశాలలో పర్యటించాలని కేబినెట్ ఆదేశించింది.
ఆయిల్ పామ్ ప్రాసెసింగ్ యూనిట్లకు, తెలంగాణ స్టేట్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ అండ్ ఎంటర్ ప్రెన్యూయర్ అడ్వాన్స్మెంట్ (టీఐడీఈఏ), తెలంగాణ స్పెషల్ ఫుడ్ ప్రాసెసింగ్ జోన్ల (టీఎస్ఎఫ్పీజెడ్) నిబంధనల ప్రకారం ప్రోత్సాహకాలు అందించాలని అధికారులకు కేబినెట్ సూచించింది.