హైదరాబాద్, జూన్ 8 (నమస్తే తెలంగాణ): వర్షాలు కురుస్తున్నాయి. ఈ ఏడాది కూడా కాలం మంచిగా అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. దీనిని దృష్టిలో పెట్టుకొని వానకాలం సాగుకోసం రైతులను పూర్తిస్థాయిలో సంసిద్ధం చేయాలని రాష్ట్ర మంత్రిమండలి అధికారులను ఆదేశించింది. 2,601 వ్యవసాయ క్లస్టర్లలో క్షేత్రస్థాయి అధికారులు (ఏఈవోలు) అందుబాటులో ఉంటూ.. రైతులకు పంటలకు సంబంధించిన సలహాలు, సూచనలు అందించాలని పేర్కొన్నది. వానకాలం సాగుకు వ్యవసాయశాఖ సన్నద్ధతపై క్యాబినెట్ భేటీలో పూర్తిస్థాయిలో సమీక్ష జరిగింది. కాళేశ్వరం సహా ఇతర సాగునీటి ప్రాజెక్టుల పరిధిలో సాగు విస్తీర్ణం భారీగా పెరగడంపై క్యాబినెట్ సంతోషం వ్యక్తంచేసింది. గతేడాది వానకాలం, యాసంగి కలిపి 1,06,03,927 ఎకరాల్లో వరిసాగు ద్వారా సుమారు 3 కోట్ల టన్నుల ధాన్యం దిగుబడి రావడం హర్షణీయమని పేర్కొన్నది. ఇందులో భాగం పంచుకున్న వ్యవసాయశాఖమంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి, అధికారులు, సిబ్బందిని అభినందించింది. చేపలు, గొర్రెల పెంపకం రంగాల్లో అద్భుతమైన కృషి కనబరుస్తున్న మత్స్య, పశు సంవర్ధకశాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ను, అధికారులను, సిబ్బందిని అభినందించింది. ఈ యాసంగిలో ఇప్పటికే సుమారు 84 లక్షల టన్నుల ధాన్యం సేకరణ జరిగిందని తెలిపిన సీఎం కేసీఆర్.. జొన్నలతోపాటు.. మిగిలిన కొద్దిపాటి కొనుగోళ్లను కూడా వెంటనే పూర్తి చేయాలని సీఎస్ సోమేశ్కుమార్, కలెక్టర్లను ఆదేశించారు.
రాష్ట్రంలో సంప్రదాయ పంట అయిన జొన్నల కొనుగోలుకు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు గ్రీన్సిగ్నల్ ఇవ్వడం పట్ల అందోల్ ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్ హర్షం వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు తెలిపారు. పూర్వపు మెదక్, నిజామాబాద్ జిల్లాలతో పాటు ఆదిలాబాద్లోని పలు ప్రాంతాల్లో రైతులు జొన్నలు విరివిగా పండిస్తారని ఎమ్మెల్యే పేర్కొన్నారు.