హైదరాబాద్ : సీఎం కేసీఆర్ అధ్యక్షత రాష్ట్ర మంత్రి వర్గం ఈ నెల 8న (మంగళవారం) సమావేశం కానుంది. మధ్యాహ్నం 2 గంటలకు ఈ సమావేశం జరగనుంది. ఈ సందర్భంగా రాష్ట్రంలో కరోనా స్థితిగతులు, వైద్యం, నీటిపారుదల, రైతుబంధు, వ్యవసాయం పనులు, లాక్డౌన్ నేపథ్యంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, సాగు నీటి ప్రాజెక్టుల పనుల పురోగతి, చేపట్టాల్సిన చర్యలు, వానాకాలం సాగునీరు, రైతుబంధు అందుతున్న తీరు, కల్తీ విత్తనాలు అరికట్టేందుకు తీసుకుంటున్న చర్యలు, ఎరువులు క్రిమిసంహారక మందుల లభ్యత, కరోనా మూడో వేవ్ సన్నద్ధతకు చేపట్టాల్సిన చర్యలు తదితర అంశాలపై కేబినెట్ చర్చించే అవకాశముంది.
రాష్ట్రంలోని 19 జిల్లాల్లో 19 డయాగ్నొస్టిక్ సెంటర్లను సోమవారం ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది. కాగా వీటిని జూన్ 9 నుంచి ప్రారంభించాలని సీఎం కేసీఆర్ తాజాగా నిర్ణయించారు. ఆయా చోట్ల మంత్రులంతా ఒకేసారి వీటిని ప్రారంభించనున్నారు. మంత్రులు లేని చోట ఇతర ప్రముఖులను ఆహ్వానించి వారితో ప్రారంభోత్సవం చేయించాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు. ఈ నేపథ్యంలో ఎవరెవరు ఎక్కడెక్కడా పాల్గొనాలనే విషయంపైనా మంత్రి మండలి సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశముంది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి.