హైదరాబాద్ : తెలంగాణ కేబినెట్ సమావేశం ముగిసింది. సీఎం కేసీఆర్ అధ్యక్షతన ప్రగతి భవన్లో మంగళవారం సమావేశం ప్రారంభమైన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా పలు కీలక అంశాలపై సీఎం, మంత్రులు చర్చించి ఆమోదముద్ర వేశారు. పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాలను మరోసారి నిర్వహించాలని కేబినెట్ నిర్ణయించింది. ఈ సందర్భంగా పలు పనులకు కేబినెట్ ఆమోదం తెలిపింది. చెన్నూరు ఎత్తిపోతల పథకానికి మంత్రి మండలి ఆమోదముద్ర వేసింది.
రూ.1658కోట్లతో చెన్నూరు ఎత్తిపోతలు నిర్మించాలని నిర్ణయించారు. ఈ ఎత్తిపోతల పథకంతో ఐదు మండలాల్లోని 103 గ్రామాలకు తాగు, సాగునీరు అందనున్నది. చెన్నూరు ఎత్తిపోతలకు పది టీఎంసీల కాళేశ్వరం జలాలను వినియోగించాలని కేబినెట్ నిర్ణయించింది. ఇదిలా ఉండగా.. మరికొద్ది సేపట్లో సీఎం కేసీఆర్ విలేకరుల సమావేశం నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా కేబినెట్ నిర్ణయాలను వివరించనున్నారు.