హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం 5 గంటల పాటు కొనసాగింది. ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన ప్రగతి భవన్లో మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభమైన మంత్రివర్గ సమావేశం రాత్రి 7 గంటల దాకా కొనసాగింది. ఐదు గంటల పాటు కొనసాగిన సమావేశంలో ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలు తీసుకున్నది. లాక్డౌన్ను మరో పది రోజుల పాటు పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నది. ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు సడలింపు ఇచ్చింది.
ఇక తెలంగాణలో కొత్తగా మరో 7 మెడికల్ కాలేజీల ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. భూములు, ఆస్తుల రిజిస్ట్రేషన్లతో పాటు వాహనాల రిజిస్ట్రేషన్లకు కేబినెట్ అనుమతించింది. లాక్ డౌన్ సడలింపు సమయాల్లో ఈ కార్యకలాపాలు నిర్వహించాలని నిర్ణయించింది. వ్యవసాయ రంగంపై కూడా కేబినెట్ చర్చించి, పలు కీలక నిర్ణయాలు తీసుకున్నది.