హైదరాబాద్, ఆగస్టు 10 (నమస్తే తెలంగాణ): తెలంగాణలో షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు బాగున్నాయని షెడ్యూల్ కులాల జాతీయ కమిషన్ (ఎన్సీఎస్సీ) గౌరవ ఉపాధ్యక్షుడు అరుణ్ హల్దార్ కొనియాడారు. సర్కారు పనితీరును మెచ్చుకున్నారు. ఏదైనా సంఘటన జరిగిన వెంటనే స్పందించాలని, బాధిత కుటుంబాలకు అండగా నిలవాలని అధికారులకు సూచించారు. మానవతా దృక్పథంతో ఎస్సీల సంక్షేమానికి కృషి చేయాలని కోరారు. మంగళవారం బీఆర్కే భవన్లో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్, డీజీపీ మహేందర్రెడ్డి, ఇతర సీనియర్ అధికారులతో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా షెడ్యూల్డ్ కులాల సమగ్రాభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలను సీఎస్ సోమేశ్కుమార్.. అరుణ్ హల్దార్కు వివరించారు. ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ అభివృద్ధి చట్టాన్ని అమలు చేస్తున్నదని, దేశంలో ఇలాంటి చట్టం తీసుకొచ్చిన ఏకైక రాష్ట్రం తెలంగాణ అని చెప్పారు. జనాభా నిష్పత్తి ఆధారంగా రాష్ట్ర బడ్జెట్లో 15.45% నిధులను షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి కోసం ప్రత్యేకంగా కేటాయించామని తెలిపారు. ఈ నిధుల్లో ఖర్చుచేయని సొమ్ము మరుసటి ఏడాది నిధులకు జమవుతుందని పేర్కొన్నారు. షెడ్యూల్డ్ కులాలవారిపై జరిగిన అట్రాసిటీ కేసులను పరిషరించడంలో ప్రభుత్వ నిబద్ధతను అధికారులు.. అరుణ్ హల్దార్కు వివరించారు. సమావేశంలో ఎన్సీఎస్సీ డైరెక్టర్ సునీల్కుమార్ బాబు, ఉన్నతాధికారులు అర్వింద్కుమార్, వికాస్రాజ్, రవిగుప్తా, లోకేశ్కుమార్ తదితరులు పాల్గొన్నారు.