హైదరాబాద్, మార్చి 14 (నమస్తే తెలంగాణ): అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఉదయం 11 గంటలకు ఉభయసభలనుద్దేశించి గవర్నర్ తమిళిసై సౌందర్రాజన్ ప్రసంగంతో సమావేశాలు మొదలవుతాయి. ఈ నెల 18న ప్రభుత్వం 2021-22 బడ్జెట్ను సభలో ప్రవేశపెట్టనున్నది. గవర్నర్ ప్రసంగం అనంతరం జరిగే బీఏసీలో సమావేశాల పనిదినాలు, ఎజెండాను ఖరారు చేయనున్నారు. కరోనా నేపథ్యంలో సమావేశాలకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. సభ్యులతో సహా అసెంబ్లీ సిబ్బంది, మార్షల్స్, మీడియా ప్రతినిధులకు ర్యాపిడ్ టెస్టులు చేస్తున్నారు. ప్రతిరోజూ అసెంబ్లీ ఆవరణను రెండుసార్లు శానిటైజేషన్ చేస్తారు. భద్రతా ఏర్పాట్లపై స్పీకర్ పోచారం శ్రీనివాస్రెడ్డి పోలీసు ఉన్నతాధికారులతో సమీక్షించారు. ఈ సమావేశాల్లో సభ్యులు అడిగిన ప్రశ్నలతోపాటు గత సమావేశాల్లో జీరోఅవర్లో లేవనెత్తిన ప్రశ్నలకు సమాధానాలు అందజేయాలని స్పీకర్ ఆదేశించారు.