హైదరాబాద్, అక్టోబర్ 1 (నమస్తే తెలంగాణ): నల్సార్వర్సిటీలో స్థానిక విద్యార్థులకు 25 శాతం కోటా కల్పించేందుకు ఉద్దేశించిన నల్సార్ చట్టసవరణ బిల్లు-1998తో సహా మొత్తం ఆరు బిల్లులను రాష్ట్ర అసెంబ్లీ శుక్రవారం ఏకగ్రీవంగా ఆమోదించింది. నల్సార్ చట్టసవరణ బిల్లు-1998ను న్యాయశాఖ మంత్రి ఇంద్రకరణ్రెడ్డి ప్రవేశపెట్టగా సభ ఏకగ్రీవంగా ఆమోదించింది. ప్రస్తుతం వర్సిటీలో తెలంగాణ విద్యార్థులకు 20 శాతం కోటా మాత్రమే అమలవుతున్నది. తెలుగు రాష్ర్టాలకు ప్రత్యేక హైకోర్టులు ఏర్పాటుచేసినందున నల్సార్చట్టం-1998లో పేర్కొ న్న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు పేరును సాంకేతికంగా తెలంగాణ హైకోర్టుగా మార్చాల్సిన అవసరమున్నదని మంత్రి సభకు వివరించారు. స్థానిక కోటాను 25 శాతానికి పెంచడంతోపాటు బీసీ, ఓబీసీలకు రిజర్వేషన్ కోటా ప్రకారం సీట్లు కేటాయించేలా చట్టంలోని నిబంధనలను సవరిస్తున్నట్టు తెలిపారు. మూడ్రోజుల విరామం తర్వాత అసెంబ్లీ సమవేశాలు శుక్రవారం ప్రారంభమయ్యాయి. స్పీకర్ పోచారం శ్రీనివాస్రెడ్డి ప్రశ్నోత్తరాల కార్యక్రమం చేపట్టారు. అనంతరం జీరో అవర్లో సభ్యులు తమ నియోజకవర్గ సమస్యలపై ప్రస్తావించారు. వర్షాల నేపథ్యంలో రైతులకు నష్టపరిహారంపై సీఎల్పీ నేత భట్టివిక్రమార్క, హైదరాబాద్ సమస్యలపై బీజేపీ సభ్యుడు రాజాసింగ్ ఇచ్చిన వాయిదా తీర్మానాలను స్పీకర్ తిరస్కరించారు. టీ విరామం తర్వాత తెలంగాణకు హరితహారంపై స్వల్పకాలిక చర్చ నిర్వహించారు. అనంతరం మంత్రులు ఆరు బిల్లులు ప్రవేశపెట్టారు. వీటికి సభ ఏకగ్రీవ ఆమోదంతెలిపింది. సభను సోమవారానికి వాయిదావేస్తున్నట్టు స్పీకర్ ప్రకటించారు.
రాష్ట్ర ఉద్యానవర్సిటీ పరిధిలో ప్రైవేట్ ఉద్యాన కళాశాలలు, పాలిటెక్నిక్ కళాశాలల ఏర్పాటుకు వీలుకల్పించే ఆచార్య కొండాలక్ష్మణ్ బాపూజీ ఉద్యాన విశ్వవిద్యాలయం-2007 చట్ట సవరణ బిల్లును వ్యవసాయ, ఉద్యానశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. ఈ బిల్లును సభ ఏకగ్రీవంగా ఆమోదించింది.
తెలంగాణ హౌజింగ్ బోర్డు చట్ట సవరణ బిల్లును గృహనిర్మాణశాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి ప్రవేశపెట్టగా, అసెంబ్లీ ఏకగ్రీవంగా ఆమోదించింది. ఈ బిల్లుతో హౌజింగ్ బోర్డుకున్న ఆస్తులపై తెలంగాణ ప్రభుత్వానికి అజమాయిషీ వస్తుందని చెప్పారు. రాజీవ్ స్వగృహ ఇండ్లపై ముఖ్యమంత్రి కేసీఆర్ త్వరలోనే నిర్ణయం తీసుకుంటారని పేర్కొన్నారు.
పంచాయతీరాజ్ చట్ట సవరణ బిల్లు-2018ను మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు ప్రవేశపెట్టగా అసెంబ్లీ ఏకగ్రీవంగా ఆమోదించింది. చట్టంలో ఉన్న నిబంధనల వల్ల కొత్త గ్రామపంచాయతీల ఏర్పాటు, పంచాయతీల విలీనం, సరిహద్దుల నిర్ణయం, గ్రామాల పేర్ల మార్పు తదితర అంశాల పరిష్కారంలో జరుగుతున్న కాలయాపనను నివారించడం ఈ బిల్లు లక్ష్యమని మంత్రి పేర్కొన్నారు.