హైదరాబాద్ : కొత్త రాష్ట్రం అయినప్పటికీ నిర్వహణలో తెలంగాణ శాసనసభ ఇప్పటికే దేశానికి ఆదర్శంగా నిలిచింది అని ముఖ్యమంత్రి కేసీఆర్ గుర్తు చేశారు. బీఏసీ సమావేశం సందర్భంగా సీఎం కేసీఆర్ ఈ వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ అసెంబ్లీలో కొత్తగా కొన్ని నిబంధనలను, విధివిధానాలను రూపొందించుకొని దేశానికి ఆదర్శంగా నిలవాలి అని సూచించారు. సభలో ప్రవేశపెట్టే బిల్లులపై సభ్యులకు ముందస్తుగా సమాచారం ఇవ్వాలని అధికారులకు సీఎం సూచించారు.
ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను అసెంబ్లీ వేదికగా ప్రజలకు చేరవేయాలన్నారు. అర్ధవంతమైన, ముఖ్యమైన అంశం అయితే కావలసినంత సమయం కేటాయించాలి అని కేసీఆర్ సూచన చేశారు. విపక్ష సభ్యుల సంఖ్య తక్కువగా ఉన్నప్పటికీ సమయం ఎక్కువగానే కేటాయిస్తున్నాం అని తెలిపారు. ఇక ముందు కూడా ఇదే పద్ధతి కొనసాగుతుంది అని కేసీఆర్ స్పష్టం చేశారు. అసెంబ్లీ వర్షాకాల సమావేశాలను అక్టోబర్ 5వ తేదీ వరకు కొనసాగించాలని బీఏసీలో నిర్ణయించిన విషయం తెలిసిందే.