హైదరాబాద్, జూలై 23 (నమస్తే తెలంగాణ)/జూబ్లీహిల్స్: టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ జన్మదినం సందర్భంగా శనివారం చేపట్టనున్న ముక్కోటి వృక్షార్చన కార్యక్రమానికి సర్వం సిద్ధమైంది. ఎంపీ సంతోష్కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా చాలెంజ్లో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా కనీవినీ ఎరుగని రీతిలో ఒకే రోజు మూడు కోట్ల మొక్కలు నాటనున్నారు. ఒక్క గంటలోనే ఇన్ని మొక్కలు నాటాలని ముందుగా నిర్ణయించినప్పటికీ వివిధ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తుండటంతో ఆ నిబంధనను సడలించినట్టు ఎంపీ సంతోష్కుమార్ తెలిపారు. మంత్రి కేటీఆర్కు ఈ మొకలు నాటడాన్నే పుట్టినరోజు కానుకగా ఇస్తున్నట్టు తెలిపారు. ముక్కోటి వృక్షార్చనలో రాష్ట్రవ్యాప్తంగా శనివారం మొత్తం 3 కోట్ల 30 లక్షల మొకలు నాటేందుకు ఏర్పాట్లు చేసినట్టు నిర్వాహకులు తెలిపారు. మొకల కోసం పంచాయితీరాజ్ నర్సరీలు, అటవీ, మున్సిపల్ నర్సరీలను ఇప్పటికే అనుసంధానించామని వెల్లడించారు. ముక్కోటి వృక్షార్చనలో పాల్గొనేవారంతా తాము నాటిన మొక్కతో ఫొటోదిగి 90003 65000 నంబర్కు వాట్సప్చేయాలని నిర్వాహకులు విజ్ఞప్తిచేశారు. అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్రెడ్డి, మండలి ప్రొటెం చైర్మన్ భూపాల్రెడ్డి అసెంబ్లీ ఆవరణలో శనివారం ఉదయం మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. అనంతరం కామారెడ్డి జిల్లాలో మూడున్నర లక్షల మొక్కలు నాటే కార్యక్రమంలో స్పీకర్ పాల్గొంటారు.
పర్యావరణ పరిరక్షణకు అందరూ కలిసిరావాలని టీఆర్ఎస్ ఎంపీ సంతోష్కుమార్ పిలుపునిచ్చారు. జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 46లోని జీహెచ్ఎంసీ పార్కులో ‘సైయంట్ ఫౌండేషన్’ ఆధ్వర్యంలో చేపట్టిన మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఎమ్మెల్యే దానం నాగేందర్, నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మితో కలిసి శుక్రవారం ఆయన ప్రారంభించారు. సైయంట్ సంస్థ సామాజిక బాధ్యత కార్యక్రమంలో భాగంగా పార్కును దత్తత తీసుకొని అభివృద్ధి చేస్తున్నట్టు ఫౌండేషన్ వ్యవస్థాపక చైర్మన్ బీవీఆర్ మోహన్రెడ్డి తెలిపారు. దీనిలో భాగంగా మూడువేల మొక్కలు నాటుతున్నామని వెల్లడించారు. కార్యక్రమంలో మున్సిపల్ పరిపాలన విభాగం ముఖ్య కార్యదర్శి అరవింద్ కుమార్, జీహెచ్ఎంసీ జోనల్ కమిషనర్ ప్రావీణ్య, గ్రీన్ ఇండియా చాలెంజ్ కో ఫౌండర్ రాఘవ, ప్రతినిధి కిశోర్గౌడ్ పాల్గొన్నారు.