అంబర్పేట, ఏప్రిల్ 23 : అంబర్పేట నియోజకవర్గంలోని అన్ని బస్తీలలో రోడ్లు, మంచినీరు, డ్రైనేజీ, వీధిలైట్లు వంటి మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తున్నట్లు ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ అన్నారు. బాగ్అంబర్పేట డివిజన్లోని సిద్ధి అషూర్ఖాన, పోచమ్మబస్తీ, ధోబీగల్లీ, అంబేద్కర్నగర్ తదితర ప్రాంతాలలో అన్ని ప్రభుత్వ విభాగాల అధికారులతో కలిసి శుక్రవారం పాదయాత్ర చేశారు. ప్రజల నుంచి సమస్యలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయా బస్తీల ప్రజలు పలు సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. సీసీ కెమెరా ఏర్పాటు చేయాలని, నూతన సీసీరోడ్లు వేయాలని, మంచినీరు, డ్రైనేజీ సమస్యలు పరిష్కరించాలని చెప్పారు. వీటికి స్పందించిన ఎమ్మెల్యే వీలైనంత త్వరగా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని చెప్పారు. ఇంకా చేపట్టాల్సిన పలు అభివృద్ధి పనులపై అధికారులతో చర్చించారు. ఈ కార్యక్రమంలో జలమండలి మేనేజర్ కుశాల్, వర్క్ ఇన్స్పెక్టర్ బాలకృష్ణ, ఎలక్ట్రికల్ ఏఈ సౌమ్య, సిబ్బంది స్వామి, టీఆర్ఎస్ నాయకులు శ్రీరాములుముదిరాజ్, శివాజీయాదవ్, మధు, శ్రీనివాస్, గణేశ్ తదితరులు పాల్గొన్నారు.