హైదరాబాద్, మార్చి 26 (నమస్తే తెలంగాణ) : ఉన్నత విద్యలో తెలంగాణ ప్రగతిపథాన దూసుకుపోతున్నది. గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో (జీఈఆర్)లో పెద్దపెద్ద రాష్ర్టాలను వెనక్కి నెట్టి 9వ స్థానంలో నిలిచింది. జాతీయ సగటును మించి మనరాష్ట్రంలో ప్రవేశాలు జరుగుతున్నాయి. 2020-21 సంవత్సరంలో తెలంగాణ ఉన్నత విద్యలో 9వ వస్థానంలో నిలిచినట్టు ఆల్ ఇండియా సర్వే ఆన్ హయ్యర్ ఎడ్యుకేషన్ నివేదిక వెల్లడించింది. సోషియో ఎకనామిక్ సర్వేలో రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ అంశాన్ని పొందుపరిచింది. ప్రతి లక్ష మందికి కళాశాలల రేషియో తెలంగాణలో 50 ఉంటే, దేశవ్యాప్తంగా 28 కాలేజీలు మాత్రమే ఉన్నాయి. కళాశాలల్లో సరాసరి ఎన్రోల్మెంట్ విషయంలో తెలంగాణలో ఒక కళాశాలలో 554 మంది చేరుతుండగా, జాతీయ స్థాయిలో 693 మంది చేరుతున్నారు.
అవకాశాలు పుష్కలం..
ఉన్నత విద్యారంగంలో రాష్ట్రంలో అవకాశాలు పుష్కలంగా లభిస్తున్నాయి. రాష్ట్రంలో 17 ప్రభుత్వ విశ్వవిద్యాలయాలు, 2,656 కళాశాలలున్నాయి. ఉస్మానియా, కేంద్రీయ విశ్వవిద్యాలయాలు యూజీసీ ప్రచురించిన యూనివర్సిటీస్ విత్ పొటెన్షియల్ ఫర్ ఎక్సలెన్స్ జాబితాలో చోటు దక్కించుకోవడం గమనార్హం. దేశంలోనే అత్యుత్తమ న్యాయ కళాశాల నల్సార్ మనదగ్గరే ఉన్నది. ఐఐటీతోపాటు, ఫార్మసీలో ప్రతిష్ఠాత్మక నైపర్ విద్యాసంస్థలు ఉన్నాయి. ఫలితంగా తెలంగాణ ఎడ్యుకేషన్ హబ్గా అవతరించింది. అనేక రాష్ర్టాల నుంచేకాకుండా విదేశాల నుంచి కూడా విద్యార్థులు ఉన్నత విద్యకోసం మన రాష్ర్టానికి వస్తున్నారు. అంతర్జాతీయంగా ఉత్తమ అవకాశాలున్న ప్రతీకోర్సు ఇక్కడ లభిస్తున్నది. 2014-15లో ప్రభుత్వ డిగ్రీకాలేజీల్లో 22 వేలమంది మాత్రమే చేరగా, 2020-21లో 46,194 మంది ప్రవేశాలు పొందారు. కొత్తగా 5 ప్రైవేట్ యూనివర్సిటీల ఏర్పాటయ్యాయి.