హుజూరాబాద్ : బహుజన వాదం అనే ముసుగులో తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ చేయని అక్రమాలు లేవని.. ఆయన నిజస్వరూపం ఇన్నాళ్లకు బయటపడిందని హుజూరాబాద్ నియోజకవర్గ మల్లన్న టీమ్ కన్వీనర్, కో కన్వీనర్ చెరుకు పైడయ్య, మహమ్మద్ అంకుస్లు కుండబద్దలు కొట్టారు. శుక్రవారం తమ టీమ్ సభ్యులతో కలిసి జమ్మికుంటలో విలేకర్ల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. బహుజన వాదానికి తానే బ్రాండ్ అంబాసిడర్ను అంటూ సామాన్య ప్రజలను మభ్యపెట్టి, తన గారడీ మాటలతో తీన్మార్ మల్లన్న మోసం చేశాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. అంగీ, లాగు సిద్దాంతం అంటూ.. మనమంతా నీతిగా బతకాలంటూ సూచిస్తూ, తాను మాత్రం అవినీతి అక్రమాలు చేస్తూ విలాసవంతమైన జీవితాన్ని గడిపాడని దుయ్యబట్టారు.
మా బాధలు పట్టించుకోలే..
నిరుద్యోగులమైన తాము మల్లన్న సొసైటీని మూడు నెలలగా సొంత ఖర్చులతో నడిపిస్తున్నామని, హుజూరాబాద్ నియోజకవర్గంలోని 105 గ్రామాల్లో కమిటీలు వేసి, 1800 మందికి సభ్యత్వం ఇచ్చినట్లు చెప్పారు. మా బాధలు పట్టించుకోకుండా తనని తాను కాపాడుకునేందుకు తీన్మార్ మల్లన్న బీజేపీలోకి వెళ్తుండటాన్నితీవ్రంగా వ్యతిరేకిస్తున్నామన్నారు. ఆయన తీసుకున్న స్వార్ధ పూరిత నిర్ణయాన్ని తామంతా ముక్తకంఠంతో ఖండిస్తున్నామన్నారు.
అవినీతికి కేరాఫ్ ‘క్యూ న్యూస్..’
ప్రశ్నించే గొంతులకు అండగా ఉండాలని నీతులు చెబుతూనే, క్యూ న్యూస్ను అవినీతికి, దందాలకు కేరాఫ్గా మార్చాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెరముందు హీరోలా ప్రశ్నిస్తూ.. తెర వెనుక బినామీల రూపంలో కోట్ల రూపాయలు కూడబెట్టుకొని ఆయన్నే నమ్ముకున్న టీమ్లను బిచ్చగాళ్లను చేశాడని ఆవేదన వ్యక్తం చేశారు. మల్లన్నకు, బీజేపీకి వ్యతిరేకంగా ఓ స్వతంత్ర అభ్యర్థిని నిలబెడతామని వారి ఓటమి కోసం తామంతా పనిచేస్తామని ప్రతినబూనారు. కార్యక్రమంలో జిల్లా కన్వీనర్ ఎండి.అఖిల్ పాషా, చొప్పదండి నియోజకవర్గ కన్వీనర్ గంగాధర ప్రవీణ్, ఇల్లంతకుంట , హుజూరాబాద్, వీణవంక, జమ్మికుంట, కమలాపూర్ మండలాల కన్వీనర్లు సంతోష్, రమేష్, తిప్పారబోయిన శ్రీకాంత్, శ్రీనివాస్, ముస్తఫా, నాంపల్లి కిషోర్, కో-కన్వీనర్లు దేవరాజ్, రామ్మూర్తి, శ్రావణ్, ప్రవీణ్, ఐలయ్య వివిధ గ్రామాల కన్వీనర్లు, కో కన్వీనర్లు, కమిటీ సభ్యులు పాల్గొన్నారు.