హైదరాబాద్ : వచ్చే ఏడాది నుంచి అంగన్వాడీ కేంద్రాల్లో ఉర్దూ మీడియంలో బోధన చేయనున్నామని గిరిజన, స్త్రీ – శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ తెలిపారు. ప్రస్తుతం ఉర్దూ మీడియం బోధించే అంగన్వాడీ టీచర్లు 412 మంది ఉన్నారన్నారు. ముస్లిం ప్రాంతాల్లో ఉర్దూలో, గిరిజన ప్రాంతాల్లో లంబాడా, కోయ వంటి స్థానిక భాషల్లో బోధన చేస్తున్నాం అని తెలిపారు.
రాష్ట్రంలో అంగన్వాడీ కేంద్రాలు ఎన్ని ఉన్నాయి?, వాటి పెంపు ప్రతిపాదన?, వాటిలో బోధనా మాధ్యమంగా ఉర్దూ భాష అమలు చేసే విషయం పరిశీలనలో ఉందా? మినీ అంగన్వాడీలకు అంగన్వాడీ టీచర్లకు సమానంగా వేతనాల పెంపుపై శాసనమండలిలో గౌరవ సభ్యులు కాటేపల్లి జనార్ధన్ రెడ్డి, కూర రఘోత్తం రెడ్డి, కల్వకుంట్ల కవిత అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానం చెప్పారు.
రాష్ట్రంలో 35,700 అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయని, అయితే
జనాభా పెరిగిందని, పెరిగిన జనాభాకు అనుగుణంగా 870 అంగన్వాడీ కేంద్రాలు పెంపు కోసం ప్రతిపాదనలు పంపామని చెప్పారు. ఏజెన్సీ ప్రాంతాల్లో అంగన్వాడీ సిబ్బంది నియామకానికి విద్యార్హతలలో ఇబ్బందులు వస్తున్న నేపథ్యంలో అక్కడి స్థానికులతో భర్తీ కోసం అనేక వెసులుబాటులు కల్పించామని పేర్కొన్నారు.
హైదరాబాద్ లో ఎక్కువ కేంద్రాలకు ప్రతి పాదనలు పంపామని చెప్పారు. గతంలో అంగన్వాడీ కేంద్రాలు అంటే పోషకాహారం, గర్భిణులు, బాలింతలకు మందులు ఇచ్చేవిగా ఉండేవి. కానీ సీఎం కేసీఆర్ వచ్చాక వాటితో పాటు విద్యా కేంద్రాలుగా అభివృద్ధి చెందాయన్నారు.
అంగన్వాడి కేంద్రాలకు వచ్చే 3 నుంచి 6 ఏళ్ల లోపు పిల్లలకు ప్రీ – ప్రైమరీ స్కూల్స్ నిర్వహిస్తున్నామని తెలిపారు. ఇందులో భాగంగా ఇప్పటికే పుస్తకాలు కూడా అందించామన్నారు. ఆయా ప్రాంతాల్లోని స్థానిక భాషలోనే బోధన చేసేందుకు ప్రాధాన్యత ఇస్తున్నాం.
మినీ అంగన్వాడీ టీచర్ల వేతనాలు పెంచేందుకు ఇప్పటికే ప్రతిపాదనలు పంపించామని చెప్పారు.
సీఎం కేసీఆర్ ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో మూడుసార్లు వేతనాలు పెంచారని చెప్పారు. ఇప్పుడు అంగన్వాడీ లకు రూ.13,650 వేతనం వస్తుందని తెలిపారు. అంగన్వాడీ ఖాళీల భర్తీ కోసం కూడా ఇప్పటికే నోటిఫికేషన్ ఇచ్చామని మంత్రి తెలిపారు. చనిపోయిన వారి కుటుంబ సభ్యులకు ఉద్యోగం ఇచ్చే అవకాశాన్ని కూడా పరిశీలిస్తున్నామని చెప్పారు.