బొంరాస్పేట, సెప్టెంబర్ 5: ‘నీ బుల్లెట్ బండెక్కి వచ్చెత్తప్పా’ అనే పాటకు ఇటీవల వచ్చిన క్రేజ్ అంతా ఇంతాకాదు. సామాజిక మాధ్యమాల్లో ఈ వీడియో వైరల్ అయిన విషయం తెలిసిందే. ఇదే పాట తరహాలో ఓ ఉపాధ్యాయుడి పాట కూడా ఇప్పుడు యూట్యూబ్లో హల్చల్ చేస్తున్నది. కరోనా కారణంగా మూతపడ్డ విద్యా సంస్థలు 16 నెలల తరువాత ఈ నెల ఒకటిన ప్రారంభమయ్యాయి. కరోనా భయాలు ఇంకా వీడకపోవడం.. విద్యార్థులు పాఠశాలకు వస్తారో రారో తెలియని పరిస్థితి. ఈ క్రమంలో విద్యార్థుల్లో కరోనా భయాన్ని పోగొట్టి, జాగ్రత్తలు తీసుకుంటూ పాఠశాలకు రావాలంటూ వికారాబాద్ జిల్లా బొంరాస్పేట మండలం దుద్యాల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల తెలుగు పండిత్ సుధాకర్రావు స్వయంగా పాటను పాడారు. దీన్ని యూట్యూబ్లో అప్లోడ్ చేయగా వైరల్ అయింది. ‘పాఠశాల గంట మోగుతుంది గణగణగణ, పిల్లలు అందరు వచ్చేయండి చకచకచక’ అంటూ ఈ పాటను బుల్లెట్ బండి సాంగ్ తరహాలో పాడారు. ఇంకా ఈ పాటలో మాస్కులు ధరించడం, భౌతిక దూరం పాటించడం వంటి జాగ్రత్తలు తీసుకుని సంతోషంగా బడికి రావాలని సుధాకర్రావు సూచించారు. పిల్లల్లో కరోనా భయాన్ని పోగొట్టేందుకే ఈ పాటను రాసి పాడినట్టు సుధాకర్రావు తెలిపారు.