హైదరాబాద్, సెప్టెంబర్ 2 (నమస్తే తెలంగాణ): దేశవ్యాప్తంగా కరోనా మాటున టీబీ వ్యాధి వేగం గా విస్తరిస్తున్నది. మన రాష్ట్రంలో కూడా టీబీ కేసులు పెరుగుతున్నాయని వైద్యాధికారులు అంటున్నారు. రెండు వ్యాధుల లక్షణాలు ఒకేలా ఉండటమే దీనికి కారణమని చెప్తున్నారు. జలుబు, దగ్గు, ఇతర లక్షణాలు కనిపించగానే యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ వైరల్ ఔషధాలు విపరీతంగా వినియోగిస్తుండటంతో టీబీ ప్రభావం తాత్కాలికంగా తగ్గిపోతున్నదని చెప్తున్నారు. తగ్గినట్టే తగ్గి కొంతకాలం తర్వాత విజృంభిస్తుందని, అప్పుడు యాంటీ బ్యాక్టీరియల్ మందులను సైతం తట్టుకునేలా టీబీ శక్తిమంతంగా మారుతున్నదని ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.
మన రాష్ట్రంలో పరిస్థితి…
‘మనదేశంలోని మొత్తం టీబీ కేసుల్లో 65శాతం 15-45 ఏండ్ల మధ్య వయసువారే’ అని రెండు వారాల క్రితం కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ తెలిపారు. మనరాష్ట్రంలోనూ ఈ వయసువారిలో టీబీ కేసులు పెరుగుతున్నట్టు గణాంకాలు చెప్తున్నాయి. 2025 నాటికి టీబీ రహిత దేశంగా అవతరించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నది. మనరాష్ట్రంలో టీబీ నిర్మూలనకు వైద్యారోగ్యశాఖ తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నది. రోగులను గుర్తించి వ్యాధిని నయం చేయడంలో మంచి పురోగతి సాధించిన నిజామాబాద్, కొత్తగూడెం జిల్లాలు కేంద్రం వైద్యారోగ్యశాఖ నుంచి ఉత్తమ జిల్లాలుగా పురస్కారాలు అందుకొన్నాయి. కరోనా వచ్చినప్పటి నుంచి టీబీ రోగులను గుర్తించడం కష్టంగా మారటంతో టీబీ కేసులు క్రమం గా పెరిగాయి. గత ఆరు నెలల్లో రాష్ట్రం లో 31,680 టీబీ కేసులను కొత్తగా గుర్తించినట్టు టీబీ నివారణ విభాగం అధికారులు వెల్లడించారు. టీబీ వల్ల మరణాల రేటు రాష్ట్రంలో 3-5శాతం ఉందని చెప్తున్నారు.
రోగనిరోధక శక్తి తక్కువగా ఉండేవారికి ఇది త్వరగా సం క్రమిస్తుంది. ఎయిడ్స్, షుగర్ వంటి వ్యాధులున్నవారికి వచ్చే అవకాశం ఎక్కువ. మూడు వారాలకు మించి దగ్గు ఉన్నా, రాత్రి వేళ తరుచూ జ్వరం వస్తు న్నా, ఆకలి మందగించినా, అకస్మాత్తుగా బరువు తగ్గినా వెం టనే వైద్యులను సంప్రదించాలని సూచిస్తున్నారు. ప్రతి పీహెచ్సీలో నిర్ధారణ పరీక్షలు చేస్తారు. వ్యాధి నిర్ధారణ అయితే ప్రభుత్వమే వారికి నెలనెలా ఉచితంగా మందులు అందిస్తుం ది. ఏఎన్ఎంలు, ఆశా కార్యకర్తలు ఇంటికి వచ్చి మందులు అందజేస్తారు. టీబీ నివారణపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు అధికారులు గ్రామస్థాయిలో ప్రచార కార్యక్రమాలు నిర్వహించాలని నిర్ణయించారు. టీబీ విజేతలతో గ్రామాల్లో సభలు నిర్వహించి అవగాహన కల్పించనున్నారు.
వారధిగా టీబీ ఆరోగ్య సాథి యాప్…
టీబీ బాధితులు, ఆరోగ్య సిబ్బందికి మధ్య కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రారంభించిన TB Arogya Sathi యాప్ వారధిగా పని చేస్తున్నది. ఇందులో టీబీకి సేవలు, అధికారుల వివరాలు, టీబీ లక్షణాలు, టీబీ సందేహాలు, పౌష్టికాహారం తదితర వివరాలు, ఉచిత కాల్ సెంటర్ నంబర్ పొందుపర్చారు. గూగుల్ ప్లేస్టోర్ నుంచి దీన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు.