మిర్యాలగూడ టౌన్, మే 20 : వ్యాపారులు కొవిడ్ నిబంధనలు పక్కాగా పాటించాలని మిర్యాలగూడ డీఎస్పీ వెంకటేశ్వర్రావు ఆదేశించారు. గురువారం డీఎస్పీ కార్యాలయంలో ఆర్డీఓ రోహిత్ సింగ్తో కలిసి పట్టణంలోని దుకాణాల నిర్వాహకులతో సమావేశం ఏర్పాటు చేశారు. లాక్డౌన్ సడలింపు సమయంలో రద్దీ అధికంగా ఉంటుందని, వ్యాపారులు మాస్కులు ధరించడంతో పాటు తమ దుకాణానికి వచ్చే వారు కూడా మాస్కులు వేసుకొని, భౌతిక దూరం పాటించేలా చూడాలన్నారు. ప్రజలు షాపు ఎదుట గుమిగూడకుండా చర్యలు తీసుకోవాలని, 10 గంటల తర్వాత దుకాణాలు ఎట్టి పరిస్థితుల్లోనూ తీయ వద్దని కోరారు. నిబంధనలు పాటించకుంటే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సమావేశంలో మార్కెట్ కమిటీ చైర్మన్ చింతరెడ్డి శ్రీనివాస్రెడ్డి పాల్గొన్నారు.
ప్రజాప్రతినిధులు సహకరించాలి : సీఐ
మిర్యాలగూడ రూరల్ : గ్రామాల్లో కరోనా కేసులు పెరుగుతున్నాయని, వైరస్ కట్టడికి ప్రజాప్రతినిధులు సహకరించాలని రూరల్ సీఐ సత్యనారాయణ కోరారు. కరోనా కట్టడిపై గురువారం మండల పరిషత్ కార్యాలయంలో జడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కరోనా కట్టడిలో భాగంగా ప్రభుత్వం విధించిన లాక్డౌన్ గ్రామాల్లో సంపూర్ణంగా అమలయ్యేలా చూడాలన్నారు. వ్యాధి బారిన పడిన వారు బయటకు రాకుండా, హోం ఐసొలేషన్లో ఉండేలా చర్యలు తీసుకోవాలని కోరారు. సమావేశంలో జడ్పీటీసీ సభ్యుడు తిప్పన విజయ సింహారెడ్డి, ఎంపీపీ నూకల సరళాహన్మంరెడ్డి, వైస్ఎంపీపీ అమరావతి సైదులు, రూరల్ ఎస్ఐ సుధీర్కుమార్, పీఏసీఎస్ చైర్మన్ రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
జాగ్రత్తలు పాటించాలి : ఎంపీపీ
అడవిదేవులపల్లి : కరోనా కేసులు పెరుగుతున్నందున ప్రజలు జాగ్రత్తగా ఉండాలని ఎంపీపీ ధనావత్ బాలాజీనాయక్ సూచించారు గురువారం మండలంలోని చిట్యాల, బాల్నేపల్లి గ్రామాల్లో అధికారులతో కలిసి పర్యటించారు. కొవిడ్ నిబంధనలపై ప్రజలకు అవగాహన కల్పించారు. కరోనా కట్టడికి రాష్ట్ర ప్రభుత్వం లాక్డౌన్ విధించినందున ప్రజలు తప్పక పాటించాలని సూచించారు. ప్రజలు అత్యవసరమైతేనే బయటకు వెళ్లాలని, అప్పుడు కూడా మాస్క్ ధరించి, భౌతిక దూరం పాటించాలని సూచించారు. నిబంధనలు పాటించని వారిపై చర్యలు తీసుకుంటామన్నారు. ఆయన వెంట ఎంపీడీఓ ఎండీ మసూద్ షరీఫ్, మండల వైద్యాధికారి ఉపేందర్, ఎస్ఐ వీర శేఖర్ ఉన్నారు.