న్యూఢిల్లీ : మే 1 నుంచి 18 ఏండ్లు పైబడిన వారందరికీ వ్యాక్సినేషన్ కు సన్నద్ధమవుతున్న క్రమంలో కొవిడ్-19 వ్యాక్సిన్లు కొవిషీల్డ్, కొవాగ్జిన్ ధరలను తగ్గించాలని కేంద్ర ప్రభుత్వం వ్యాక్సిన్ తయారీ సంస్ధలు సీరం ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా (ఎస్ఐఐ), భారత్ బయోటెక్ లను కోరిందని అధికార వర్గాలు పేర్కొన్నాయి. బెంగాల్ సీఎం మమతా బెనర్జీ సహా పలు రాష్ట్రాల సీఎంలు వ్యాక్సిన్ ధరల్లో అసమానతలను ప్రశ్నించిన నేపథ్యంలో ధరల తగ్గింపుపై కేంద్రం వ్యాక్సిన్ తయారీ కంపెనీలను కోరడం గమనార్హం. కేంద్రం, రాష్ట్రాలు, ప్రైవేట్ దవాఖానాలకు వ్యాక్సిన్ల సరఫరాలో ధరల వ్యత్యాసంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి.
ప్రస్తుతం భారత్ బయోటెక్ కొవాగ్జిన్ ను రా|ష్ట్రాలకు డోస్ కు రూ 600 చొప్పున, ప్రైవేట్ ఆస్పత్రులకు రూ 1200కు సరఫరా చేస్తుండగా కేంద్ర ప్రభుత్వానికి వ్యాక్సిన్ డోస్ ను రూ 150 కే సరఫరా చేస్తోంది. ఇక ఎస్ఎస్ఐ కొవిషీల్డ్ ధరను ప్రభుత్వ ఆస్పత్రులకు ఒక్కో డోస్ కు రూ 400గా నిర్ణయించగా ప్రైవేట్ ఆస్పత్రులకు రూ 600కు సరఫరా చేయనున్నట్టు ప్రకటించింది. ధరల వ్యత్యాసం పట్ల రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు వివిధ వర్గాల నుంచి వ్యతిరేకత రావడంతో వ్యాక్సిన్ ధరలను తగ్గించాలని దేశీ వ్యాక్సిన్ తయారీ సంస్ధలను కేంద్ర ప్రభుత్వం కోరింది. మరి కేంద్ర ప్రభుత్వ అభ్యర్ధనపై ఎస్ఎస్ఐ, భారత్ బయోటెక్ ల స్పందన ఎలా ఉంటుందనేది వేచిచూడాలి.