పేద ముస్లింల అంత్యక్రియలకు రూ.5 వేలు
హెల్ప్డెస్క్ ఏర్పాటు.. వక్ఫ్బోర్డు చైర్మన్ సలీం
హైదరాబాద్, మే 19 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని వక్ఫ్ ఆస్తుల పరిరక్షణకు ప్రభుత్వం డీఎస్పీ సయ్యద్ ఖాజామోహినుద్దిన్ నేతృత్వంలో విజిలెన్స్ టాస్క్ఫోర్స్ను ఏర్పాటుచేసిందని వక్ఫ్బోర్డు చైర్మన్ మహమ్మద్ సలీం చెప్పారు. బుధవారం నాంపల్లిలోని హజ్హౌస్లో జరిగిన వక్ఫ్బోర్డు సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. వక్ఫ్ ఆస్తుల పరిరక్షణకు ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకొంటున్నదని, ఎవరు అతిక్రమించినా చర్యలు తప్పవని హెచ్చరించారు. కరోనాతో మృతిచెందిన పేద ముస్లింల అంతిమ సంస్కారాల కోసం వక్ఫ్బోర్డు రూ.5 వేలు అందిస్తుందని తెలిపారు. మృతదేహాల అంతిమ సంస్కారం తదితర అంశాలపై హెల్ప్డెస్క్ను ఏర్పాటుచేశామని, సహాయం కోసం 7995560136 నంబర్ను సంప్రదించవచ్చని పేర్కొన్నారు.