బంజారాహిల్స్,మే 12: సుదీర్ఘకాలంగా ఉన్న పెండింగ్ వివాదాల సత్వర పరిష్కారానికి ఇంటర్నేషనల్ అర్బిట్రేషన్ అండ్ మీడియేషన్ సెంటర్ (ఐఏఎంసీ) ఎంతగానో ఉపయోగపడుతున్నదని ఐఏఎంసీ రిజిస్ట్రార్ తారిఖ్ ఖాన్ అన్నారు. జూబ్లీహిల్స్ రోడ్ నం 5లోని అడ్వకేట్స్ అసోసియేషన్ ఫర్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అండ్ అవేర్నెస్( ఆస్రా) కార్యాలయంలో గురువారం ఐఏఎంసీ చాంబర్ను జిల్లా వినియోగదారుల కమిషన్ జడ్జి మాధవరావుతో కలిసి తారిఖ్ ఖాన్ ప్రారంభించారు. అర్బిట్రేషన్ సెంటర్ ప్రయోజనాలు, పనితీరుపై న్యాయవాదులకు అవగాహన కల్పించారు. దీని ద్వారా తక్కువ సమయంలో, తక్కువ ఖర్చుతో పరిష్కరించుకునేందుకు అవకాశం ఉన్నదని వెల్లడించారు. ఎలాంటి కేసు అయినా 18నెలల్లోనే తీర్పు వెలువడుతుందని తారిఖ్ ఖాన్ వివరించారు. కార్యక్రమంలో ఆస్రా ఫౌండర్ సుల్తాన్ అలీ, ఉపాధ్యక్షుడు దీప్తిదాస్, శ్రీధన్య తదితరులు పాల్గొన్నారు.