హైదరాబాద్, ఏప్రిల్ 11 (నమస్తే తెలంగాణ): మిషన్ భగీరథతో తాగునీటి కష్టాలకు ఫుల్స్టాప్ పడింది. నడివేసవిలోనూ నల్లాల ద్వారా ఇంటింటికీ విజయవంతంగా తాగునీరు సరఫరా అవుతున్నది. మిషన్ భగీరథ సంపూర్ణంగా పూర్తయ్యాక మొదటిసారి వేసవికాలం రావడంతో అధికారులు గ్రామాల్లో నీటి సరఫరాను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. గ్రామానికి బల్క్గా సరఫరా అవుతున్న తాగునీటిని పరిశీలిస్తూ సర్పంచ్, కార్యదర్శి, మిషన్భగీరథ ఏఈలు లాగ్షీట్పై సంతకాలు చేస్తున్నారు. వీటిని పరిశీలిస్తున్న డీఈ, ఈఈలు తగినంత పరిమాణంలో సరఫరా కాకుంటే వెంటనే సిబ్బందిని అప్రమత్తం చేస్తున్నారు. ప్రతి లాగ్షీట్లో కౌంటర్ సంతకం చేసి వెబ్సైట్లో ఆప్లోడ్ చేస్తున్నారు. ఒకవేళ నీటి సరఫరా సక్రమంగా కాకపోయినా అందులో పొందుపరుస్తారు. నీటిసరఫరాపై గ్రామంలోని ఇతర ప్రజాప్రతినిధుల అభిప్రాయాలు కూడా తీసుకుంటున్నారు. అక్కడక్కడా కొద్దిపాటి లీకేజీలు తప్ప ఇతర సమస్యలేవీ రావడం లేదని మిషన్ భగీరథ అధికారులు స్పష్టంచేస్తున్నారు. ఈ వేసవిలో మిషన్భగీరథ నీటిని విజయవంతంగా ఇవ్వగలిగితే భవిష్యత్లో ఎలాంటి సవాళ్లనైనా ఎదుర్కోవచ్చని చెప్తున్నారు. వాట్సాప్ గ్రూపులను ఏర్పాటుచేసుకుని నిత్యం పర్యవేక్షిస్తున్నారు. ఫిర్యాదులను వెంటనే సంబంధిత క్షేత్రస్థాయి అధికారులకు సూచిస్తున్నారు. అక్కడక్కడా చిన్న సమస్యలు వచ్చినా అవి స్థానికంగా ఆ గ్రామ పరిధికి మాత్రమే ఉంటున్నాయని పేర్కొంటున్నారు. మిషన్భగీరథకు నీటినందించే రిజర్వాయర్లలో నీటిమట్టాల స్థాయిని కూడా అధికారులు ఎప్పటికప్పుడు పరిగణనలోకి తీసుకుంటున్నారు.
గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి వ్యక్తికి వంద లీటర్ల చొప్పున తాగునీటి సరఫరా జరుగుతున్నది. ప్రతిఇంటికి సమాన స్థాయిలో, అవసరమైన ప్రెజర్తో నీటిని సరఫరా చేసేలా ఫ్లో కంట్రోల్ వాల్వ్ను ఏర్పాటుచేశారు. మిషన్భగీరథ కాంట్రాక్టర్లకే ప్రాజెక్టు నిర్వహణ బాధ్యతలు అప్పగించారు. దీంతో ఎలాంటి సమస్యలు వచ్చి నా వెంటనే జవాబుదారీ గా ఉండేలా చర్యలు తీసుకున్నారు. ఎక్కడైనా పైపులైన్ లీకేజీ అయితే 24 గంటల్లో పునరుద్ధరించకపోతే ఆపరేషన్, మెయింటనెన్స్ కింద కాంట్రాక్టరుకు ఫైన్ వేస్తున్నారు. తాగునీటి సరఫరాను పర్యవేక్షించేందుకు రాష్ట్ర వ్యాప్తంగా 18 వేల సిబ్బంది పనిచేస్తున్నారు.