కార్మికులకు 10శాతం హెచ్ఆర్ఏ
అత్యాధునిక వసతులతో 994 క్వార్టర్ల నిర్మాణం
టీబీజీకేఎస్ బ్రాంచ్ ఉపాధ్యక్షుడు తిరుపతి
భూపాలపల్లి, జూన్ 29: భూపాలపల్లి ఎమ్మె ల్యే గండ్ర వెంకటరమణారెడ్డి చొరవ, కృషి ఫలితంగానే సింగరేణి దవాఖానకు సిటీ స్కాన్ త్వరలోనే రాబోతున్నదని టీబీజీకేఎస్ భూపాలపల్లి బ్రాంచి కమిటీ ఉపాధ్యక్షుడు కొక్కుల తిరుపతి అన్నారు. మంగళవారం టీబీజీకేఎస్ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. వారం రోజుల క్రితం ఎమ్మెల్యే సింగరేణి దవాఖానను సందర్శించి సిటీ స్కాన్ లేక కార్మికులు, కుటుంబ సభ్యులు దూరప్రాంతాలకు వెళ్తున్నారనే విషయాన్ని తెలుసుకుని పరికరం ఏర్పాటు చేయాలని సింగరేణి సీఎండీ శ్రీధర్తో ఫోన్లో మాట్లాడారని తెలిపారు. పిల్లలు, చాతి, దంత, నేత్ర వైద్య నిపుణులను సైతం నియమించాలని, వైద్య సిబ్బందికి విశ్రాంతి గది ఏర్పాటు చేయాలని కోరారని గుర్తు చేశారు. ఈ క్రమంలో ఎమ్మెల్యే గండ్రతో పాటు టీబీజీకేఎస్ అగ్రనేతలు సింగరేణి యాజమాన్యంపై ఒత్తిడి తెచ్చి సిటీ స్కాన్ పరికరం కొనుగోలుపై వార్షిక ప్రణాళికలో చేర్పించారని, త్వరలోనే వస్తుందన్నారు.
అదేవిధంగా టీబీజీకేఎస్ కృషి ఫలితంగానే కార్మికులకు సీఎంపీఎఫ్ చిట్టీలు పంచుతున్నారన్నారు. వాస్తవాలు ఇలా ఉంటే మంజూరయ్యే విషయం తెలుసుకుని తమ పోరాటాల ఫలితమేనని ఏఐటీయూసీ యూనియన్ నాయకులు అబదాలు ప్రచారం చేసుకోవడం సిగ్గుచేటన్నారు. కొన్ని యూనియన్ల నాయకులు చేసే అసత్య ప్రచారాలు నమ్మవద్దని కార్మికులను తిరుపతి కోరారు. ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి సింగరేణి కార్మికుల శ్రేయస్సు కోసం ఎంతగానో పాటుపడుతున్నారని తెలిపారు. భూపాలపల్లి కార్మికులు సరైన నివాస వసతి లేక వారు పడుతున్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని యైటిైంక్లెయిన్ కాలనీలో నాడు వెయ్యి క్వార్టర్ల నిర్మాణానికి కృషి చేశారన్నారు. సీఎం కేసీఆర్ సహకారంతో నేడు అత్యాధునిక వసతులతో కూడిన 994 డబుల్ బెడ్రూం క్వార్టర్లు మంజూరు చేయించారని, పనులు వేగంగా జరుగుతున్నాయన్నారు. ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి వల్లే కార్మికులకు 10శాతం హెచ్ఆర్ఏ వస్తోందన్నారు. కాగా, ఆక్సిజన్ ప్లాంట్ నిర్మిస్తున్నారని తెలిపారు. సమావేశంలో టీబీజీకేఎస్ భూపాలపల్లి బ్రాంచి కమిటీ, గనిస్థాయి నా యకులు రత్నం సమ్మిరెడ్డి, మధు, సుధాకర్, సాంబయ్య, అశోక్, దేవేందర్ పాల్గొన్నారు.